AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026: 84 మ్యాచ్‌లు, 13 వేదికలు.. ఐపీఎల్ 19వ సీజన్‌కు రంగం సిద్ధం..!

క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) 19వ సీజన్ ముహూర్తం ఖరారైంది. మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈసారి రికార్డు స్థాయిలో 84 మ్యాచ్‌లతో ఐపీఎల్ చరిత్రలోనే ఇది అతిపెద్ద సీజన్‌గా నిలవనుంది.

IPL 2026: 84 మ్యాచ్‌లు, 13 వేదికలు.. ఐపీఎల్ 19వ సీజన్‌కు రంగం సిద్ధం..!
Ipl 2026
Venkata Chari
|

Updated on: Mar 19, 2026 | 3:33 PM

Share

భారతదేశపు అతిపెద్ద క్రీడా పండుగ ఐపీఎల్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. గత 18 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 10 జట్ల మధ్య మొత్తం 84 మ్యాచ్‌లు జరగనున్నాయి. గతంలో గరిష్టంగా 74 మ్యాచ్‌లు ఉండగా, ఈసారి డబుల్ రౌండ్-రాబిన్ పద్ధతిలో ప్రతి జట్టు ఇతర జట్టుతో రెండుసార్లు (హోమ్ అండ్ అవే) తలపడనుంది. 64 రోజుల పాటు సాగే ఈ క్రికెట్ జాతర దేశవ్యాప్తంగా 13 వేదికలలో అలరించనుంది.

‘బిగ్ 3’ చివరి పోరాటం?

క్రికెట్ ప్రపంచంలో లెజెండ్స్‌గా పేరొందిన ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు కలిసి ఆడే చివరి సీజన్ ఇదే కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

ధోనీ (CSK): 44 ఏళ్ల వయసులోనూ ధోనీ ప్రాక్టీస్‌లో సిక్సర్లతో విరుచుకుపడుతున్నారు. ఈసారి ఆయన ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా కనిపించే అవకాశం ఉంది.

రోహిత్ శర్మ (MI): రోహిత్ ఈ సీజన్ కోసం ఏకంగా 11 కిలోల బరువు తగ్గి పూర్తి ఫిట్‌నెస్‌తో నెట్స్‌లో చెమటోడుస్తున్నారు.

విరాట్ కోహ్లీ (RCB): తొలిసారి డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న కోహ్లీ, తన టైటిల్‌ను కాపాడుకోవాలనే పట్టుదలతో ఉన్నారు.

13 నగరాల్లో సందడి.. రెండో హోమ్ గ్రౌండ్స్..

ఈసారి ఐపీఎల్ కేవలం 10 నగరాలకే పరిమితం కాకుండా 13 వేదికలకు విస్తరించింది.

రాజస్థాన్ రాయల్స్ తమ కొన్ని మ్యాచ్‌లను గౌహతిలో ఆడనుంది.

పంజాబ్ కింగ్స్ ధర్మశాలను, ఆర్‌సీబీ రాయ్‌పూర్ ను తమ రెండో హోమ్ గ్రౌండ్‌గా ఎంచుకున్నాయి.

గాయాల బెడద.. జట్లకు షాక్..

సీజన్ ప్రారంభానికి ముందే కొన్ని జట్లకు ఎదురుదెబ్బ తగిలింది. కేకేఆర్ పేసర్ హర్షిత్ రాణా మోకాలి సర్జరీ కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. ఆర్‌సీబీ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్, ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా తొలి కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చు. కమిన్స్ లేని పక్షంలో ఇషాన్ కిషన్ హైదరాబాద్ జట్టును నడిపించే అవకాశం ఉంది.

ఏఐ (AI), స్మార్ట్ పిచ్ టెక్నాలజీ..

ఈ సీజన్‌లో సరికొత్త సాంకేతికతను ప్రవేశపెడుతున్నారు. ఏఐ బ్రాడ్‌కాస్టింగ్ ద్వారా అభిమానులు తమకు నచ్చిన ప్లేయర్‌పై మాత్రమే ఫోకస్ చేసే కెమెరా యాంగిల్స్ ఎంచుకోవచ్చు. అలాగే, పిచ్ కింద ఉండే సెన్సార్లు తేమ, బౌన్స్ డేటాను ఎప్పటికప్పుడు అందించే ‘స్మార్ట్ పిచ్’ టెక్నాలజీపై బీసీసీఐ కసరత్తు చేస్తోంది.

Follow Us