ఈ నలుగురిపై పగబట్టిన గంభీర్.. ప్రపంచకప్ 2027కి ముందే జట్టు నుంచి గెంటేసేందుకు స్కెచ్..?

ICC ODI World Cup 2026 2027: అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక సుదీర్ఘమైన ప్రయాణం ముగియబోతోందా? కోట్లాది మంది అభిమానులను తమ ఆటతో అలరించిన భారత క్రికెట్ దిగ్గజాలు మైదానాన్ని వీడనున్నారా? అంటే అవుననే అంటున్నాయి విశ్లేషణలు. వచ్చే ఏడాది జరగబోయే ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ సమరమే భారత జట్టుకు చెందిన నలుగురు అగ్రశ్రేణి ఆటగాళ్లకు ఆఖరి టోర్నీ కానుంది.

ఈ నలుగురిపై పగబట్టిన గంభీర్.. ప్రపంచకప్ 2027కి ముందే జట్టు నుంచి గెంటేసేందుకు స్కెచ్..?
Goutam Gambhir Odi World Cup 2027
Image Credit source: AI Image

Updated on: Jun 11, 2026 | 11:20 AM

ICC ODI World Cup 2026 2027: క్రికెట్ ప్రపంచంలో ఐసీసీ మెగా టోర్నమెంట్లు ముగిసిన వెంటనే సీనియర్ ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించడం సహజంగా చూస్తుంటాం. గతంలో ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ వన్డేలకు వీడ్కోలు పలికారు. అంతకుముందు టీ20 ప్రపంచకప్ విజయం అనంతరం భారత్ తరపున రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పారు. అయితే వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నెదర్లాండ్స్ వేదికలుగా జరిగే వన్డే ప్రపంచకప్ తర్వాత సీనియర్ ఆటగాళ్లు కేవలం ఒక ఫార్మాట్ నుంచే కాకుండా, అంతర్జాతీయ క్రికెట్‌కే పూర్తిగా స్వస్తి పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2023 ప్రపంచకప్ ఫైనల్లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుని, ఎలాగైనా కప్పు గెలవాలనే పట్టుదలతో ఉన్న ఆ నలుగురు సీనియర్ల భవితవ్యంపై ప్రత్యేక విశ్లేషణ.

1. హిట్ మాన్ ఆఖరి కల నెరవేరుతుందా?

భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఓపెనర్‌గా, మాజీ కెప్టెన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రోహిత్ శర్మకు వన్డే ప్రపంచకప్ గెలవడం ఒక తీరని కోరికగా మిగిలిపోయింది. తన సారథ్యంలో 2023లో తృటిలో చేజారిన ప్రపంచకప్ ట్రోఫీని ఈసారి ఎలాగైనా ముద్దాడాలని రోహిత్ భావిస్తున్నారు. అయితే వచ్చే ఏడాది నాటికి ఆయన వయసు 40 ఏళ్లు దాటుతుంది. ఇటీవల కాలంలో ఫిట్‌నెస్ సమస్యలు కూడా కాస్త ఇబ్బంది పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే మెగా టోర్నీలో భారత్ గెలిచినా, ఓడినా రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

2. కింగ్ కోహ్లీ ప్రయాణానికి ముగింపు పడేనా?

ప్రస్తుత తరం అత్యుత్తమ బ్యాటర్‌గా నీరాజనాలు అందుకుంటున్న విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ విషయంలో యువకులకు సైతం గట్టి పోటీ ఇస్తున్నారు. గతంలో విరాట్ ఫామ్‌పై విమర్శలు వచ్చినప్పటికీ, తన అద్భుత ప్రదర్శనతో విమర్శకుల నోళ్లు మూయించారు. అయితే వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్ ముగిసే సమయానికి కోహ్లీ సాధించడానికి కొత్తగా ఏమీ మిగలదు. భారత్ కనుక ప్రపంచకప్ సాధిస్తే విరాట్ ఘనంగా వీడ్కోలు పలకడం ఖాయం. ఒకవేళ ఫలితం తారుమారైనా, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడానికి మేనేజ్‌మెంట్ వైపు నుంచి సంకేతాలు వచ్చే అవకాశం ఉంది.

3. సర్‌ రవీంద్ర జడేజా ముగింపు రేఖకు చేరువగా..

ప్రస్తుతం 37 ఏళ్ల వయసున్న ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ కెరీర్ చివరి దశకు చేరుకుంది. వచ్చే ఏడాది నాటికి ఆయనకు 38 ఏళ్లు నిండుతాయి. గత కొంతకాలంగా వన్డే జట్టులో జడేజాకు క్రమం తప్పకుండా ఆడే అవకాశాలు లభించడం లేదు. జట్టులో ఆయన అనుభవం ఎంత ఉన్నప్పటికీ, టెస్టుల్లో సైతం ఆయనకు ప్రత్యామ్నాయాలను వెతికే పనిని సెలెక్టర్లు ప్రారంభించారు. ఇటీవల అరంగేట్రం చేసిన మానవ్ సుతార్ అద్భుత ప్రదర్శనతో మ్యాచ్ విజేతగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే వన్డే ప్రపంచకప్ తర్వాత జడేజా రిటైర్మెంట్ ప్రకటించే సూచనలు స్పష్టంగా ఉన్నాయి.

4. స్వింగ్ సుల్తాన్ మహమ్మద్ షమీ ఆఖరి పోరాటం..

గత వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లతో సంచలనం సృష్టించిన వేగవంతమైన బౌలర్ మహమ్మద్ షమీ కెరీర్ ప్రస్తుతం ఒడిదొడుకుల్లో పడింది. గాయాల కారణంగా ప్రస్తుతం ఏ ఫార్మాట్‌లోనూ ఆయన జట్టులో భాగం కాలేకపోతున్నారు. ప్రస్తుతం 35 ఏళ్ల వయసున్న షమీని పక్కనపెట్టి సెలెక్షన్ కమిటీ యువ పేసర్ల వైపు మొగ్గు చూపుతోంది. షమీ వచ్చే ప్రపంచకప్ ఆడాలని బలంగా ఆశిస్తున్నప్పటికీ, సెలెక్టర్లు ఆయనకు అవకాశం ఇస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ అవకాశం దక్కినా, ఈ టోర్నీయే ఆయన సుదీర్ఘ కెరీర్‌కు ఆఖరి ప్రయాణం కానుంది.

భారత క్రికెట్‌ను దశాబ్ద కాలంగా శాసించిన ఈ నలుగురు దిగ్గజాలు వచ్చే ఏడాది జరిగే మెగా టోర్నీ తర్వాత మైదానానికి గుడ్‌బై చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదేమైనా, తమ కెరీర్ ముగిసేలోగా భారత్‌కు ప్రపంచకప్ అందించి, సగర్వంగా వీడ్కోలు పలకాలనేదే ఈ సీనియర్ల ఏకైక ఆశయం. ఒక అద్భుతమైన తరం ముగింపునకు సమయం దగ్గరపడుతుండటం క్రీడాభిమానులను కొంత నిరాశకు గురిచేస్తున్నా, సరికొత్త శకానికి ఇది నాంది కాక తప్పదు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us