
IND vs NZ 2026 Schedule: క్రికెట్ అభిమానులకు సరికొత్త జోష్ వచ్చేసింది. న్యూజిలాండ్ వేదికగా భారత్ ఆడబోయే సుదీర్ఘ సిరీస్ షెడ్యూల్ విడుదలైంది. రికార్డు స్థాయిలో 12 మ్యాచ్లతో సాగనున్న ఈ చారిత్రక పర్యటన కోసం ఇరు దేశాల అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాల రాకతో ఈ సిరీస్ మరింత రసవత్తరంగా మారనుంది.
క్రికెట్ ప్రపంచంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య పోరు ఎప్పుడూ అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనున్నట్లు అక్కడి క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. కివీస్ గడ్డపై ఒకే పర్యటనలో ఒక విదేశీ జట్టు ఇన్ని మ్యాచ్లు ఆడటం ఆ దేశ క్రికెట్ చరిత్రలోనే ఇదే తొలిసారి. ఈ చారిత్రక పర్యటనలో భాగంగా భారత్ మొత్తం 5 టీ20లు, 5 వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది. దాదాపు ఏడేళ్ల తర్వాత భారత జట్టు న్యూజిలాండ్లో టెస్ట్ సిరీస్ ఆడబోతుండటంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
వచ్చే 2027 వన్డే ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని ఈ సిరీస్ భారత జట్టుకు అత్యంత కీలకంగా మారనుంది. విండీస్ పర్యటన ముగిసిన తర్వాత తగినంత విశ్రాంతి దొరకనుండటంతో, వన్డే సిరీస్ కోసం సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ బరిలోకి దిగడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే, రోహిత్ శర్మ ఎంపిక కేవలం అతని పూర్వ రికార్డుల ఆధారంగా కాకుండా ప్రస్తుత ఫామ్, శారీరక దృఢత్వం (ఫిట్నెస్) ఆధారంగానే ఉంటుందని సమాచారం. యువ ఆటగాళ్లతో పాటు జస్ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లీల రాకతో న్యూజిలాండ్ స్టేడియాలు భారతీయ అభిమానుల కోలాహలంతో నిండిపోవడం ఖాయమని కివీస్ క్రికెట్ బోర్డు ప్రతినిధులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మొదటి టీ20: అక్టోబర్ 22 – క్రైస్ట్చర్చ్
రెండో టీ20: అక్టోబర్ 24 – క్రైస్ట్చర్చ్
మూడో టీ20: అక్టోబర్ 27 – వెల్లింగ్టన్
నాలుగో టీ20: అక్టోబర్ 30 – ఆక్లాండ్
ఐదో టీ20: నవంబర్ 1 – హామిల్టన్
మొదటి వన్డే: నవంబర్ 4 – ఆక్లాండ్
రెండో వన్డే: నవంబర్ 7 – వెల్లింగ్టన్
మూడో వన్డే: నవంబర్ 10 – హామిల్టన్
నాలుగో వన్డే: నవంబర్ 13 – మౌంట్ మౌంగనుయ్
ఐదో వన్డే: నవంబర్ 15 – మౌంట్ మౌంగనుయ్
మొదటి టెస్ట్: నవంబర్ 19 నుంచి 23 – వెల్లింగ్టన్
రెండో టెస్ట్: నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 – క్రైస్ట్చర్చ్
న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కమర్షియల్ ఆఫీసర్ గ్లెన్ క్రిచ్లీ మాట్లాడుతూ.. “భారత జట్టుతో సిరీస్ అంటే కేవలం మైదానంలో జరిగే ఆట మాత్రమే కాదు. ఇది రెండు దేశాల మధ్య ఉన్న సత్సంబంధాలకు, సాంస్కృతిక బంధానికి ప్రతీక. భారత జట్టుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ అమోఘం. ఈ సిరీస్ ద్వారా కివీస్ ప్రజలకు, ఇక్కడి క్రికెట్ ప్రేమికులకు ఒక మరుపురాని అనుభూతిని అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం” అని తెలిపారు. మొత్తంగా ఎనిమిది వేర్వేరు నగరాల్లో దాదాపు 41 రోజుల పాటు అంతర్జాతీయ క్రికెట్ పండుగ వాతావరణాన్ని తలపించనుంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..