AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇకపై సరికొత్త పాత్రలో వైభవ్ సూర్యవంశీ.. ప్రత్యర్థులు లగేజీ సర్దేయాల్సిందేగా..!

Vaibhav Sooryavanshi: భారత క్రికెట్‌లో సంచలనంగా ఎదుగుతున్న 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి టీమిండియా కొత్త బాధ్యతలు అప్పగించే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న ఈ యువ ఆటగాడిని భవిష్యత్తులో ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దే ప్రణాళికపై భారత జట్టు మేనేజ్‌మెంట్ దృష్టి సారించినట్లు బౌలింగ్ కోచ్ సునీల్ జోషి వెల్లడించారు. దీంతో క్రికెట్ వర్గాల్లో ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.

ఇకపై సరికొత్త పాత్రలో వైభవ్ సూర్యవంశీ.. ప్రత్యర్థులు లగేజీ సర్దేయాల్సిందేగా..!
Vaibhav Suryavanshi
Venkata Chari
|

Updated on: Jul 25, 2026 | 2:07 PM

Share

Vaibhav Sooryavanshi: భారత క్రికెట్‌లో మరో స్టార్ ఆల్‌రౌండర్‌ను తయారు చేయాలనే లక్ష్యంతో టీమిండియా ముందుకు సాగుతోంది. ఇప్పటికే తక్కువ వయసులోనే అసాధారణ బ్యాటింగ్‌తో గుర్తింపు పొందిన వైభవ్ సూర్యవంశీని క్రమంగా బౌలింగ్‌లోనూ తీర్చిదిద్దాలని భారత జట్టు యోచిస్తోంది. ఈ విషయాన్ని భారత తాత్కాలిక బౌలింగ్ కోచ్ సునీల్ జోషి తాజాగా వెల్లడించారు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ రికార్డు స్థాయి ప్రదర్శనతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో సీనియర్ జట్టులో అరంగేట్రం చేసినా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అయితే జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో కేవలం 18 బంతుల్లోనే అర్ధశతకం బాది తన ప్రతిభను మరోసారి నిరూపించాడు.

ఈ నేపథ్యంలో వైభవ్‌ను కేవలం బ్యాటర్‌గానే కాకుండా బౌలింగ్ ఆప్షన్‌గా కూడా అభివృద్ధి చేయాలని భారత జట్టు భావిస్తోంది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో అవకాశం దొరికినప్పుడల్లా అతని బౌలింగ్‌పై ప్రత్యేకంగా పని చేస్తామని సునీల్ జోషి తెలిపారు. అయితే తొందరపడకుండా ముందుగా అతని బ్యాటింగ్‌పైనే పూర్తి దృష్టి పెట్టి, ఆ తర్వాత క్రమంగా బౌలింగ్ నైపుణ్యాలను మెరుగుపరుస్తామని స్పష్టం చేశారు.

వాస్తవానికి వైభవ్ సూర్యవంశీ పార్ట్‌టైమ్ ఎడమచేతి స్పిన్నర్‌గా మాత్రమే కొంత అనుభవం కలిగి ఉన్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అతని ఖాతాలో రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి. లిస్ట్-ఏ క్రికెట్‌లో మూడు ఇన్నింగ్స్‌లలో బౌలింగ్ చేసి 56 పరుగులు ఇచ్చాడు. టీ20ల్లో రెండు మ్యాచ్‌ల్లో బంతి వేసినా వికెట్ సాధించలేకపోయాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు. దీంతో అతడిని పూర్తిస్థాయి బౌలర్‌గా కాకుండా అవసరమైనప్పుడు ఉపయోగపడే పార్ట్‌టైమ్ ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దాలనే ఆలోచనలో భారత జట్టు ఉన్నట్లు తెలుస్తోంది.

గౌతమ్ గంభీర్ కోచింగ్ వ్యవస్థలో ఆల్‌రౌండర్లకు ఎక్కువ ప్రాధాన్యం లభిస్తున్న నేపథ్యంలో వైభవ్ బౌలింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టడం ఆశ్చర్యకరం కాదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణిస్తే జట్టుకు అదనపు సమతుల్యత లభించే అవకాశం ఉంటుంది.

ఇదే సందర్భంగా యువ ఆల్‌రౌండర్ సూర్యాంశ్ షెడ్గేపైనా సునీల్ జోషి స్పందించారు. అతడిని హార్దిక్ పాండ్యా లేదా శివమ్ దూబేతో పోల్చడం సరైంది కాదని, అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంకా నేర్చుకునే దశలో ఉన్నాడని చెప్పారు. యువ ఆటగాళ్లకు సమయం ఇవ్వాలని, వారి అభివృద్ధికి ఓర్పుతో మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

కాగా, భారత్-జింబాబ్వే మధ్య రెండో టీ20 మ్యాచ్ హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా శనివారం జరగనుంది. తొలి మ్యాచ్‌లో ఆధిపత్యం చాటిన భారత జట్టు అదే జోరును కొనసాగించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతుండగా, యువ ఆటగాళ్ల ప్రదర్శనపై మరోసారి అందరి దృష్టి నిలవనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us