AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: ఓటమి ప్రమాదంలో టీమిండియా.. న్యూజిలాండ్ ఆధిక్యం ఎంతంటే?

పుణె టెస్టులోనూ టీమిండియా ఓటమి ప్రమాదంలో నిలిచింది. ఇప్పటికే బెంగళూరు టెస్టులో పరాజయం పాలైన భారత జట్టు రెండో మ్యాచ్ లోనూ ఓటమి దిశగా సాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.

IND vs NZ: ఓటమి ప్రమాదంలో టీమిండియా.. న్యూజిలాండ్ ఆధిక్యం ఎంతంటే?
India Vs New Zealand
Basha Shek
|

Updated on: Oct 25, 2024 | 6:22 PM

Share

పుణె వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసి భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. అంతకు ముందు కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులు చేసింది. బదులుగా టీమిండియా కేవలం 156 పరుగులకే ఆలౌటైంది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ జట్టు మొత్తం ఆధిక్యం 300 పరుగులు దాటింది. ఈ టెస్టు మ్యాచ్ ఇంకా మూడు రోజుల సమయం ఉండగా, ఈ మ్యాచ్ ఫలితం వెలువడడం ఖాయం. బంతి తిరుగుతున్న తీరు చూస్తుంటే నాలుగో ఇన్నింగ్స్‌లో 300 పరుగులకు పైగా లక్ష్యాన్ని ఛేదించడం టీమ్ ఇండియాకు అంత తేలికైన విషయం కాదు. రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ 133 బంతుల్లో 10 బౌండరీలతో 86 పరుగులు చేయగా, వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ 30 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మూడో రోజు బ్యాటింగ్‌ను కొనసాగించాడు. వీరిద్దరు కాకుండా డెవాన్ కాన్వే 17 పరుగులు, విల్ యంగ్ 23 పరుగులు, రచిన్ రవీంద్ర 9 పరుగులు, డారిల్ మిచెల్ 18 పరుగులు చేశారు. టీమిండియా తరఫున తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు తీసిన వాషింగ్టన్ సుందర్ రెండో ఇన్నింగ్స్‌లోనూ రాణించి ఇప్పటి వరకు 4 వికెట్లు తీయగా, రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ తీసుకున్నాడు.

అంతకు ముందు ఓవర్ నైట్ స్కోరు 16/1 తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ 140 పరుగుల తేడాలో మిగిలిన 9 వికెట్లను కోల్పోయింది. రెండో రోజు ఆట ఆరంభంలోనే 30 పరుగులు చేసిన గిల్.. సాంట్నర్ బౌలింగ్ లో వికెట్ చేజార్చుకోగా, ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ కూడా ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. రిషబ్ పంత్ 18 పరుగులు, సర్ఫరాజ్ ఖాన్ 11 పరుగులు, ఆర్ అశ్విన్ 4 పరుగులు, ఆకాశ్ దీప్ 6 పరుగులు, బుమ్రా ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. జట్టు తరఫున రవీంద్ర జడేజా అత్యధికంగా 38 పరుగులు చేయగా, వాషింగ్టన్ సుందర్ 18 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

ఇవి కూడా చదవండి

టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్:

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా

న్యూజిలాండ్ ప్లేయింగ్ XI:

టామ్ లాథమ్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, ఐజాజ్ పటేల్, విలియం ఓ’రూర్క్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..