AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harmanpreet Kaur : పాకిస్తాన్‌ను ఊచకోత కోసినా హర్మన్‌ప్రీత్ అసంతృప్తి.. టీమిండియాను హెచ్చరించిన కెప్టెన్

Harmanpreet Kaur : పాకిస్తాన్‌పై 64 పరుగుల భారీ విజయానంతరం భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టు ప్రదర్శనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. స్మృతి మంధాన, రిచా ఘోష్ బ్యాటింగ్‌ను ప్రశంసించిన ఆమె, ఆటగాళ్లు అనవసర ఒత్తిడిని తగ్గించుకోవాలని హెచ్చరించింది. దీప్తి శర్మ బౌలింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Harmanpreet Kaur : పాకిస్తాన్‌ను ఊచకోత కోసినా హర్మన్‌ప్రీత్ అసంతృప్తి.. టీమిండియాను హెచ్చరించిన కెప్టెన్
Harmanpreet Kaur
Rakesh
|

Updated on: Jun 15, 2026 | 7:56 AM

Share

Harmanpreet Kaur : ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్తాన్‌పై 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన తర్వాత భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. మ్యాచ్‌ను తాము సులువుగానే గెలిచినప్పటికీ, ఇన్నింగ్స్ ప్రారంభంలో జట్టు ఆటగాళ్లు తమపై తామే అనవసరమైన ఒత్తిడిని పెంచుకున్నారని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా లోయర్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ సమయంలో ఒత్తిడిని ఎలా జయించాలో తాము నేర్చుకున్నామని చెప్పారు.

స్మృతి మంధాన ఇన్నింగ్స్ పై ప్రశంసలు

ఈ మ్యాచ్‌లో వైస్ కెప్టెన్ స్మృతి మంధాన పాకిస్తాన్ ఫీల్డర్లు ఇచ్చిన రెండు లైఫ్ లైన్లను అద్భుతంగా వాడుకుందని హర్మన్‌ప్రీత్ కొనియాడారు. స్మృతి 44 బంతుల్లో 68 రన్స్ చేసి జట్టుకు భారీ స్కోరు అందించింది. “మొదటి రెండు వికెట్లు త్వరగా పడిపోయినప్పుడు మేము కాస్త ప్రెజర్‌లోకి వెళ్లాం. కానీ నేను, స్మృతి క్రీజులో ఉన్నప్పుడు మ్యాచ్‌ను పూర్తిగా మా కంట్రోల్‌లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించాం. మా ఇద్దరి మధ్య కుదిరిన 91 పరుగుల భాగస్వామ్యం వల్లే పాకిస్తాన్‌పై టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక స్కోరు (170/6) చేయగలిగాం” అని హర్మన్ వివరించారు.

రిచా ఘోష్ బ్యాటింగ్ ఆర్డర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు

ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లలో కేవలం 17 బంతుల్లో 34 రన్స్ చేసి పాక్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టిన వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ పై కెప్టెన్ ప్రశంసల జల్లు కురిపించారు. రిచా బ్యాటింగ్ ఆర్డర్ గురించి హర్మన్‌ప్రీత్ మాట్లాడుతూ.. “నా చేతుల్లో గనుక ఉంటే, రిచా ఘోష్‌ను మ్యాచ్ మొదటి బంతి నుంచే బ్యాటింగ్‌కు పంపించేదాన్ని. అంతలా ఆమె హిట్టింగ్ చేయగలదు. కానీ జట్టులో ఆమెకంటూ ఒక ప్రత్యేకమైన రోల్ ఉంది. ఫినిషర్‌గా ఆమె తన బాధ్యతను వంద శాతం నెరవేరుస్తోంది. దీప్తి శర్మతో కలిసి ఆఖరిలో ఆమె చేసిన 45 పరుగుల భాగస్వామ్యం మ్యాచ్‌ను మలుపు తిప్పింది” అని అన్నారు.

స్పిన్ మాయాజాలంపై దీప్తి శర్మ ఓపెన్ టాక్

ఈ మ్యాచ్‌లో 5 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న ఆల్‌రౌండర్ దీప్తి శర్మ తన బౌలింగ్ ప్లాన్ గురించి మాట్లాడారు. అంతర్జాతీయ టీ20ల్లో 166 వికెట్లతో ప్రపంచంలోనే నంబర్ వన్ బౌలర్‌గా నిలిచిన దీప్తి.. తనకు ఇలాంటి స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లు అంటే చాలా ఇష్టమని చెప్పారు. “నాకు ఐసీసీ టోర్నమెంట్లలో ఆడటం చాలా ఇష్టం. ఈ పిచ్‌పై బంతి బాగా టర్న్ అవుతోంది. అందుకే నేను ప్రతి ఓవర్లోనూ బంతి వేగాన్ని మారుస్తూ బౌలింగ్ చేశాను. బంతి స్లోగా వేయడం వల్లే పాక్ బ్యాటర్లు షాట్లు ఆడలేక వికెట్లు సమర్పించుకున్నారు” అని దీప్తి శర్మ తన సక్సెస్ సీక్రెట్‌ను పంచుకున్నారు.

బౌలర్ల సమిష్టి కృషి వల్లే విజయం

171 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టును భారత బౌలర్లు 106 పరుగులకే కట్టడి చేయడంపై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సంతోషం వ్యక్తం చేశారు. దీప్తి శర్మ (5/10) కెరీర్ బెస్ట్ బౌలింగ్‌కు తోడుగా.. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీ చరణి (3/21), ఓపెనర్ షెఫాలీ వర్మ (1/22)లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారని కొనియాడారు. సీనియర్ ప్లేయర్లు సమయానికి ఫామ్‌లోకి రావడం, యువ బౌలర్లు రాణించడం రాబోయే నెదర్లాండ్స్ మ్యాచ్‌కు జట్టులో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపిందని భారత కెప్టెన్ ముగించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us