Kavya Maran: కావ్య మారన్ నిర్ణయంపై గవాస్కర్ ఫైర్.. కప్పు కోసం మన సైనికుల ప్రాణాలు పోవాల్సిందేనా?

Kavya Maran:పాక్ ఆటగాడు అబ్రార్ అహ్మద్‌ను సన్ రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడంపై సునీల్ గవాస్కర్ తీవ్రంగా మండిపడ్డారు. పాక్ ఆటగాళ్లకు ఇచ్చే డబ్బు మన సైనికుల మరణాలకు కారణమవుతుందని ఆయన హెచ్చరించారు. గవాస్కర్ తన విశ్లేషణలో చాలా లోతైన అంశాన్ని లేవనెత్తారు.

Kavya Maran: కావ్య మారన్ నిర్ణయంపై గవాస్కర్ ఫైర్.. కప్పు కోసం మన సైనికుల ప్రాణాలు పోవాల్సిందేనా?
Sunil Gavaskar

Updated on: Mar 17, 2026 | 8:00 AM

Kavya Maran: భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) యజమానులపై నిప్పులు చెరిగారు. ఇంగ్లండ్‌లో జరిగే ది హండ్రెడ్ (The Hundred) 2026 లీగ్ కోసం సన్ రైజర్స్ లీడ్స్ జట్టు, పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను భారీ ధరకు కొనుగోలు చేయడం ఈ వివాదానికి కారణమైంది. సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్, సీఈఓ కావ్య మారన్ లండన్ వేలంలో పాల్గొని సుమారు రూ.2.34 కోట్లు (190,000 GBP) వెచ్చించి ఈ పాక్ ఆటగాడిని సొంతం చేసుకున్నారు. భారతీయ యజమానులు పాక్ ఆటగాళ్లకు ఇచ్చే డబ్బు చివరికి భారత సైనికుల ప్రాణాలకే ముప్పుగా మారుతుందని గవాస్కర్ తన కాలమ్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.

గవాస్కర్ వాదన ఏంటి?

గవాస్కర్ తన విశ్లేషణలో చాలా లోతైన అంశాన్ని లేవనెత్తారు. భారతీయ ఫ్రాంచైజీలు పాక్ ఆటగాళ్లకు ఫీజుల రూపంలో చెల్లించే సొమ్ముపై ఆ ఆటగాళ్లు పాకిస్థాన్ ప్రభుత్వానికి ఆదాయపు పన్ను కడతారని ఆయన గుర్తు చేశారు. ఆ పన్ను డబ్బుతో పాక్ ప్రభుత్వం ఆయుధాలు కొనుగోలు చేస్తుందని, అవే ఆయుధాలు సరిహద్దుల్లో మన భారతీయ సైనికులను, అమాయక పౌరులను బలి తీసుకుంటున్నాయని ఆయన విమర్శించారు. 2008 ముంబై దాడుల తర్వాత ఐపీఎల్ నుంచి పాక్ ఆటగాళ్లను దూరం పెట్టడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం ఇదేనని ఆయన స్పష్టం చేశారు.

యజమానుల బాధ్యతపై విమర్శలు

సన్ రైజర్స్ లీడ్స్ కోచ్ డానియల్ వెట్టోరీ న్యూజిలాండ్ వాసి కాబట్టి అతనికి ఈ రాజకీయ, భావోద్వేగ పరిస్థితులు తెలియకపోవచ్చు.. కానీ భారతీయ యజమానులైన మారన్ కుటుంబానికి ఆ అవగాహన ఉండాలి కదా అని గవాస్కర్ ప్రశ్నించారు. కేవలం ఒక లీగ్ గెలవడం కోసం భారత సైనికుల ప్రాణాలను పణంగా పెడతారా? అని ఆయన నిలదీశారు. విదేశీ లీగ్ లో పెట్టుబడి పెట్టినా, దాని యజమాని భారతీయుడు అయినప్పుడు భారత ప్రయోజనాలను విస్మరించకూడదని ఆయన హితవు పలికారు.

టెన్షన్ లో ఈసీబీ.. బహిష్కరణ సెగ

ఈ కొనుగోలు వార్త బయటకు రావడంతో భారత్‌లో సన్ రైజర్స్ బ్రాండ్‌ను బహిష్కరించాలనే (Boycott SRH) డిమాండ్లు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) ముందుగానే అన్ని జట్లకు లేఖ రాస్తూ.. ఆటగాళ్ల ఎంపికలో వివక్ష చూపకూడదని, ప్రతిభ ఆధారంగానే తీసుకోవాలని సూచించింది. అయినప్పటికీ, భారతీయ ఫ్రాంచైజీలు పాక్ ప్లేయర్లను తీసుకోవడం వెనుక ఉన్న వివాదాస్పద అంశం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయం సన్ రైజర్స్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us