IPL 2026: ఐపీఎల్ హిస్టరీలో తోపు కెప్టెన్లు వీరే.. టాప్ 5 లిస్ట్ చూస్తే పరేషానే..?
IPL 2026: ఐపీఎల్ హిస్టరీలో ఎంతోమంది కెప్టెన్లు ఉన్నారు. అయితే, అత్యధిక మ్యాచ్లకు కెప్టెన్లుగా వ్యవహరించిన లిస్ట్లో కేవలం ఐదుగురు మాత్రమే చోటు దక్కించుకున్నారు. ఈ లిస్ట్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ ఎంఎస్ ధోని అగ్రస్థానంలో నిలిచాడు. మిగతా నలుగురు ఎవరో ఓసారి చూద్దాం..

ఐపీఎల్ 2008 ప్రారంభ ఎడిషన్లో ఆడిన కొద్ది మంది ఆటగాళ్లు మాత్రమే 2026 సీజన్లో కూడా కనిపించనున్నారు. దాదాపు 18 సీజన్లుగా సాగిన ఐపీఎల్ ప్రయాణంలో 100కి పైగా మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించిన ఆటగాళ్లు చాలా కొద్దిమందే మాత్రమే ఉన్నారు. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు 100కి పైగా మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించిన వారు కేవలం నలుగురు మాత్రమే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్గా అత్యధిక మ్యాచ్లు ఆడిన టాప్ 5 ఆటగాళ్ల జాబితాను ఓసారి చూద్దాం. ఈ లిస్టులో మాజీ కెప్టెన్లు, ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న కెప్టెన్లు కూడా ఉన్నారు.
1. ఎంఎస్ ధోనీ – 235 మ్యాచ్లు: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్, లెజెండరీ వికెట్కీపర్ – బ్యాటర్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్లకు కెప్టెన్గా నిలిచిన ఆటగాడిగా నిలిచాడు. తన ఐపీఎల్ కెరీర్లో ధోనీ రెండు ఫ్రాంచైజీలకు (చెన్నై, రైజింగ్ పుణే సూపర్జెయింట్స్) మొత్తం 235 మ్యాచ్లకు నాయకత్వం వహించాడు. ఈ మ్యాచ్ల్లో ధోనీ 136 విజయాలు, 97 ఓటములు నమోదు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఏ కెప్టెన్కైనా ఇవే అత్యధిక విజయాలు. అంతేకాదు, ధోనీ IPLలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు. IPLలో కెప్టెన్గా అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కూడా అతను రెండో స్థానంలో ఉన్నాడు.
2. రోహిత్ శర్మ – 158 మ్యాచ్లు: ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్, ఆధునిక కాలపు గొప్ప బ్యాటర్లలో ఒకడైన రోహిత్ శర్మ కూడా IPL చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు. కెప్టెన్గా రోహిత్ శర్మ మొత్తం 8 ట్రోఫీలు గెలుచుకున్నాడు. అందులో ముంబై ఇండియన్స్ తరపున 5 IPL ట్రోఫీలు, టీమ్ ఇండియా తరపున టీ20 వరల్డ్ కప్, ఆసియా కప్, అలాగే ముంబై తరపున ఛాంపియన్స్ లీగ్ టైటిల్ ఉన్నాయి. IPLలో 158 మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించిన రోహిత్, ఈ లిస్టులో రెండో స్థానంలో ఉన్నాడు. అలాగే IPL చరిత్రలో కెప్టెన్గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.
3. విరాట్ కోహ్లీ – 143 మ్యాచ్లు: ఆర్సీబీ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన మొత్తం ఐపీఎల్ కెరీర్లో ఒకే ఫ్రాంచైజీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)కి ప్రాతినిధ్యం వహించిన ఏకైక ఆటగాడు. 2008 నుంచి 2010 వరకు ఆటగాడిగా ఆడిన కోహ్లీ, 2011లో కెప్టెన్గా నియమితుడయ్యాడు. 2011 నుంచి 2023 వరకు కోహ్లీ RCBకి 143 మ్యాచ్లకు నాయకత్వం వహించాడు. ఈ కాలంలో RCB 66 మ్యాచ్లు గెలిచింది. 70 మ్యాచ్లు ఓడింది. 3 మ్యాచ్లు టైగా ముగిశాయి, 4 మ్యాచ్లు నో రిజల్ట్గా ముగిశాయి. 143 మ్యాచ్లతో కోహ్లీ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.
4. గౌతమ్ గంభీర్ – 129 మ్యాచ్లు: కేకేఆర్ తరపున రెండుసార్లు IPL టైటిల్ గెలిపించిన కెప్టెన్ గౌతమ్ గంభీర్, ఢిల్లీ క్యాపిటల్స్కు కూడా 21 మ్యాచ్లకు నాయకత్వం వహించాడు. మొత్తం 129 మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించిన గంభీర్, అందులో 71 విజయాలు సాధించాడు. 57 మ్యాచ్లు ఓడగా, ఒక మ్యాచ్ టైగా ముగిసింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్లకు కెప్టెన్గా నిలిచిన ఆటగాళ్ల జాబితాలో గంభీర్ నాలుగో స్థానంలో ఉన్నాడు. అంతేకాదు, IPLలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కూడా గంభీర్ నాలుగో స్థానంలోనే ఉన్నాడు. అతను 127 ఇన్నింగ్స్లో 3518 పరుగులు చేశాడు.
5. శ్రేయస్ అయ్యర్ – 87 మ్యాచ్లు: దాదాపు 12 ఏళ్ల IPL కెరీర్లో శ్రేయస్ అయ్యర్ 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా నియమితుడయ్యాడు. 2020 వరకు ఢిల్లీకి 41 మ్యాచ్లకు నాయకత్వం వహించి జట్టును ఫైనల్కు చేర్చాడు (రన్నరప్). 2022లో కేకేఆర్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టి, 2024లో జట్టుకు టైటిల్ అందించాడు. 2025 IPLలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా 17 మ్యాచ్లకు నాయకత్వం వహించి జట్టును ఫైనల్కు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. మూడు వేర్వేరు ఫ్రాంచైజీలను మూడు వేర్వేరు ఎడిషన్లలో ఫైనల్కు తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ చరిత్రలో నిలిచాడు. అత్యధిక మ్యాచ్లకు కెప్టెన్గా నిలిచిన జాబితాలో శ్రేయస్ అయ్యర్ ఐదో స్థానంలో ఉన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
