TG20: ఆక్షన్లో డీజీపీ సీవీ ఆనంద్ కుమారుడికి భారీ ధర! టోర్నీలోనే సెకండ్ కాస్ట్లీయస్ట్ ప్లేయర్
తెలంగాణ తొలి టీజీ20 లీగ్ వేలంలో భారత టీ20 వైస్ కెప్టెన్ తిలక్ వర్మ అత్యధికంగా రూ.33 లక్షలకు మెదక్ ఫాల్కన్స్కు దక్కాడు. హైదరాబాద్ మాజీ కెప్టెన్ CV మిలింద్ రెండో అత్యధిక ధర పలిన ఆటగాడిగా నిలిచాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

తెలంగాణ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా నిర్వహించనున్న టీజీ20 ఫ్రాంచైజీ లీగ్కు సంబంధించిన ఆటగాళ్ల వేలం ఆసక్తికరంగా సాగింది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ వేలంలో భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్ తిలక్ వర్మ అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. ఐకాన్ ప్లేయర్ విభాగంలో రూ.5 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన తిలక్ కోసం మెదక్ ఫాల్కన్స్, పాలమూరు స్ట్రైకర్స్ జట్లు తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు మెదక్ ఫాల్కన్స్ అతడిని రూ.33 లక్షలకు సొంతం చేసుకుంది.
ఈ మొత్తంతో తిలక్ వర్మ టీజీ20 లీగ్ తొలి సీజన్లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అయితే భారత జట్టుతో పాటు ఇండియా ‘ఎ’ జట్టులోనూ అతడికి బాధ్యతలు ఉండటంతో టోర్నమెంట్లో అతని లభ్యతపై కొంత అనిశ్చితి నెలకొంది. వేలంలో మరో ప్రధాన ఆకర్షణగా హైదరాబాద్ మాజీ కెప్టెన్, ఎడమచేతి వాటం పేసర్ సీవీ మిలింద్ నిలిచాడు. అన్విత ఖమ్మం ఏసెస్ ఫ్రాంచైజీ అతడిని రూ.17 లక్షలకు కొనుగోలు చేసింది. దీంతో మిలింద్ లీగ్లో రెండో అత్యధిక ధర పొందిన ఆటగాడిగా నిలిచాడు. టీమిండియా స్టార్ బౌలర్ సిరాజ్ కంటే మిలింద్కు ఎక్కువ ధర రావడం విశేషం. దేశీయ క్రికెట్లో ఎన్నో సంవత్సరాలుగా నిలకడైన ప్రదర్శనలు కనబరుస్తున్న మిలింద్కు ఈ ధర రావడం విశేషంగా మారింది.
జూన్ 21 నుంచి ప్రారంభం కానున్న టీజీ20 లీగ్ కోసం ఆరు ఫ్రాంచైజీలు తమ జట్లను బలోపేతం చేసుకుంటుండగా, వేలంలో ఆటగాళ్ల కోసం జరిగిన పోటీ తెలంగాణ క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచింది. ఈ లీగ్ రాష్ట్ర యువ క్రికెటర్లకు తమ ప్రతిభను చాటుకునేందుకు మంచి వేదికగా మారనుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
