
విశాఖలో క్రికెట్ ఫీవర్ అపుడే స్టార్ట్ అయిపోయింది..భారత్-ఆస్ట్రేలియా మధ్య విశాఖ వేదికగా జరగనున్న టీ20 మ్యాచ్కు ఆఫ్లైన్లో టికెట్ల అమ్మకం ప్రారంభమైంది. ఇప్పటికే ఆన్లైన్ టికెట్ల విక్రయం పూర్తి కాగా. శుక్రవారం (నవంబర్ 17) నుంచి ఆఫ్లైన్లో అమ్ముతున్నారు.దీంతో టికెట్ల కోసం కౌంటర్ల వద్ద యువత ఎగబడ్డారు. మహిళలు సైతం టికెట్లకు పోటీపడ్డారు. మధురవాడలోని క్రికెట్ స్టేడియంతో పాటు మున్సిపల్ స్టేడియం, గాజువాకలోని ఇండోర్ స్టేడియంలో టికెట్లను విక్రయిస్తున్నారు. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి..
ఆన్లైన్లో టిక్కెట్లు దొరక్కపోవడంతో ఆఫ్లైన్లో టిక్కెట్లు కోసం ఫ్యాన్స్ బారులు తీరారు. చాలా రోజుల తర్వాత విశాఖలో క్రికెట్ మ్యాచ్ జరుగుతుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. మొత్తానికి విశాఖకు క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. కాగా ఈ మ్యాచ్కు సంబంధించి రూ.600, 1,500, 2,000, 3,000, 3,50, 6,000 ధరల్లో టికెట్లను అందుబాటులో ఉంచారు. టికెట్లను కొనుగోలు చేసేందుకు జనాలు పెద్ద ఎత్తున రావడంతో విశాఖలో సందడి వాతావరణం కనిపిస్తోంది. టికెట్ల కోసం కొందరు యువకులు గురువారం రాత్రి స్టేడియాల దగ్గరే నిద్రపోయారు. మహిళలు సైతం శుక్రవారం వేకువజాము నుంచే క్యూలైన్లలోకి చేరుకుని టికెట్ల కోసం పోటీ పడ్డారు.
కాగా ప్రతిష్ఠాత్మక వరల్డ్ కప్ పూర్తికాగానే నవంబర్ 23 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనుంది. విశాఖపట్నం, తిరువనంతపురం, గౌహతి, నాగ్పూర్, బెంగళూరు వేదికల్లో ఈ మ్యాచ్లు జరుగుతాయి. రెండో మ్యాచ్ నవంబర్ 26న, మూడో మ్యాచ్ నవంబర్ 28న, నాలుగో మ్యాచ్ డిసెంబర్ 1న, ఐదో, చివరి మ్యాచ్ డిసెంబర్ 3న హైదరాబాద్లో కాకుండా బెంగళూరులో జరగనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయడి