AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: జట్టు మొత్తం ముసలోళ్లే..! CSK పతనానికి 5 ప్రధాన కారణాలు!

చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఐపీఎల్ 2025లో దారుణంగా వెనుకబడి ఉంది. వరుస ఓటములతో ప్లే ఆఫ్స్‌లోకి చేరడం కష్టమవుతోంది. ఈ పతనానికి ఐదు ప్రధాన కారణాలు ఉన్నాయి. మరి ఆ ఐదు కారణాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

IPL 2025: జట్టు మొత్తం ముసలోళ్లే..! CSK పతనానికి 5 ప్రధాన కారణాలు!
Csk Team
Follow us
SN Pasha

|

Updated on: Apr 12, 2025 | 8:03 PM

ప్రతిష్టాత్మక ఐపీఎల్‌లో ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఈ ఏడాది ఓ పసికూన జట్టును తలపిస్తోంది. వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓడిపోయి.. దాదాపు ప్లే ఆఫ్స్‌ నుంచి తప్పుకున్నట్లే కనిపిస్తోంది. అధికారికంగా కాకపోయినా.. టీమ్‌ ప్రదర్శన చూస్తే మాత్రం ఇక్కడి నుంచి సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయితే అది కచ్చితంగా ప్రపంచపు 8వ వింత అవుతుంది. ఐపీఎల్‌ హిస్టరీలోనే అత్యధిక ట్రోఫీలు గెలిచిన జట్టు, భారీ బ్యాన్‌ బేస్‌, హైలీ ఎక్స్‌పీరియన్డ్స్‌ కోచింగ్‌ స్టాఫ్‌, మెరికల్లాంటి ఆటగాళ్లను పట్టే మేనేజ్‌మెంట్‌, అన్నింటికి మించి మిస్టర్‌ కూల్‌, వికెట్ల వెనుక నుంచి మ్యాచ్‌లు మలుపుతిప్పే మాస్టర్‌ మైండ్‌ ధోని ఇంకా ఆడుతున్నా.. సీఎస్‌కే చెత్త ప్రదర్శన చేస్తోంది. మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ టీమ్‌, ఎక్కువ సార్లు ప్లే ఆఫ్స్‌కు వెళ్లిన జట్టు.. ఇంతలా దారుణ స్థితికి పడిపోవడానికి కారణం ఏంటి? క్రికెట్‌ అభిమానులను, ముఖ్యంగా ధోని ఫ్యాన్స్‌ను వేధిస్తున్న ప్రశ్న. ఈ సీజన్‌లో సీఎస్‌కే పరిస్థితి ఇలా కావాడానికి ఓ ఐదు కారణాల గురించి మాట్లాడుకుంటే..

1. రాంగ్‌ రిటెన్షన్స్‌

ఐపీఎల్‌ 2025కి ముందు జరిగిన రిటెన్షన్స్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ మేనేజ్‌మెంట్‌ అంటిపెట్టుకున్న ప్లేయర్లను ఒకసారి చూస్తే.. రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, మతీషా పతిరానా, శివమ్ దూబే, ఎంఎస్ ధోనీ. ఈ ఐదుగురి రిటేన్‌ చేసుకున్నారు. మిగతా ఏ టీమ్‌తో పోల్చుకున్నా.. మోస్ట్‌ వీకెస్ట్‌ రిటెన్షన్స్‌ సీఎస్‌కేదే. ఆరుగురిని రిటేన్‌ చేసుకోవచ్చు అని బీసీసీఐ అన్ని టీమ్స్‌కు అనుమతి ఇచ్చింది. కేకేఆర్‌, రాజస్థాన్‌, ఎస్‌ఆర్‌హెచ్‌ లాంటి టీమ్స్‌ తమ కోర్‌ టీమ్‌ను కాపాడుకోవడానికి ఎక్కువ రిటెన్షన్స్‌ చేసుకున్నాయి. కానీ, సీఎస్‌కే కోర్‌ టీమ్‌లో ఇద్దరు ఆటగాళ్లు రిటైర్మెంట్‌ వయసును కూడా దాటేశారు. సో.. వాళ్లకంటూ ఒక కోర్‌ టీమ్‌ లేదు. ఏదో లాయల్టీగా ఉన్నారని, వాళ్లతో ఫ్యాన్‌బేస్‌ ఉంటుందని.. ధోని, జడేజాను రిటేన్‌ చేసుకున్నారు కానీ, నిజంగా మాట్లాడుకుంటే.. వాళ్లు ఇప్పటికే ఐపీఎల్‌ నుంచి రిటైర్‌ అయిపోవాల్సింది. జడేజా కూడా ఆల్రెడీ ఇంటర్నేషనల్‌ టీ20లకు రిటైర్మెంట్‌ ఇచ్చేశాడు. అంతకంటే ముందు కూడా టీ20ల్లో పెద్దగా రాణించడం లేదు. ఐపీఎల్‌ 2023తోనే ఈ ఇద్దరు దిగ్గజాల పదును అయిపోయింది. ఇక రుతురాజ్‌ను కెప్టెన్సీ కోసం, యంగ్‌ ప్లేయర్లు శివమ్‌ దూబే, పతిరానాలను రిటేన్‌ చేసుకున్నారు. కానీ వాళ్లు ఆశించినంత రాణించడం లేదు. పైగా వీళ్లు ముగ్గురు కూడా మ్యాచ్‌ విన్నర్లు కాదు. సో.. సీఎస్‌కే ఒక కోర్‌ టీమ్‌ అంటూ రిటెన్షన్స్‌తో సెట్‌ అవ్వలేదు.

2. వరెస్ట్‌ ఆక్షన్‌

రిటెన్షన్స్‌లో తేలిపోయిన సీఎస్‌కే, మెగా వేలంలో అయినా అద్భుతమైన స్ట్రాటజీని ఉపయోగించిందా అంటే అదీ లేదు. ఎంత సేపు ధోని, ధోని అంటూ జపం చేస్తూ కూర్చుంది కానీ, టీమ్‌ని రీబిల్డ్‌ చేయడంలో సూపర్‌ ప్లాప్‌ అయింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అదరగొడుతున్న యంగ్‌ బ్లడ్‌ను పట్టుకోలేకపోయింది, సాంప్రదాయ క్రికెట్‌కు సరితూగే ప్లేయర్లపై కోట్లు కుమ్మరించింది.. దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తుంది. కాన్వె, రచిన్‌ రవీంద్రా లాంటి పాత పచ్చడినే మళ్లీ కొనుకుంది. ఆటగాళ్లను నమ్మడంలో తప్పులేదు.. కానీ, ఐపీఎల్‌ లాస్ట్‌ ఇయర్‌ నుంచి పూర్తిగా మారిపోయిందనే నిజంగాన్ని సీఎస్‌కే గ్రహించలేకపోతుంది. ఇప్పుడు ధనాధన్‌ క్రికెట్‌ కాదు.. అప్డేటెడ్‌ అల్ట్రా మోడ్రన్‌ అగ్రెసివ్‌ క్రికెట్‌ నడుస్తుంది. వికెట్లు పడుతున్నా.. తర్వాత వచ్చే బ్యాటర్‌ తొలి బంతికే సిక్స్‌ కొట్టాలని చూస్తున్నాడు. అంతలా ఐపీఎల్‌లో గేమ్‌ స్ట్రాటజీ మారిపోయింది. ప్రత్యర్థి అగ్రెసివ్‌ ఇంటెంట్‌తో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. 7, 8 వికెట్లు పడినా.. భారీ షాట్లు ఆడే బ్యాటర్లు క్రీజ్‌లోకి వస్తున్నారు. అందుకే అగ్రెసివ్‌ బ్రాండ్‌ ఆఫ్‌ క్రికెట్‌కు తగ్గ ప్లేయర్లను ఆక్షన్‌లో సీఎస్‌కే పట్టుకోలేకపోయింది. ఇదే ప్రధానంగా సీఎస్‌కే వైఫల్యానికి కారణంగా నిలుస్తోంది.

3. అవుట్‌ డేటెడ్‌ ప్లేయర్స్‌ పికింగ్‌

రిటేన్‌ చేసుకున్న ప్లేయర్లు, ఫారెన్‌ ప్లేయర్లు, యంగ్‌ ప్లేయర్లు కాకుండా.. సీఎస్‌కే వేలంలో కొన్న ఆటగాళ్ల పేర్లు చూసినప్పుడే చాలా మందికి సీఎస్‌కే పతనం ఇక్కడి నుంచి మొదలైందని అనిపించింది. రాహుల్‌ త్రిపాఠి, విజయ్‌ శంకర్‌, దీపక్‌ హుడా.. వీళ్లా సీఎస్‌కే తీసుకోవాల్సిన ఆటగాళ్లు? టీమిండియాకు ఆడట్లేదు, అలా అని డొమెస్టిక్‌లో అదరగొట్టట్లేదు.. పచ్చిగా చెప్పాలంటే.. షెడ్డుకు వెళ్లిపోయి.. కామెంట్రీ చేసుకోవాల్సిన ఆటగాళ్లను తీసుకొచ్చి ఎల్లో జెర్సీ వేసి ఆడిస్తున్నారు. వీళ్లను నమ్ముకొని.. సీఎస్‌కే కప్పు కొట్టాలని ఎలా అనుకుందో ఇప్పటికీ ఆ టీమ్‌ ఫ్యాన్స్‌కూడా అర్థం కావడం లేదు. పైగా ఒక్కసారి సీఎస్‌కే స్క్వాడ్‌ను చూస్తే.. ఏకంగా 11 మంది ఆటగాళ్లకు 30 ఏళ్లకు పైబడిన వాళ్లే. దాదాపు ఒక సీనియర్‌ సిటిజన్‌ బ్యాచ్‌ ఇది. అందుకే చాలా మంది సోషల్‌ మీడియాలో ఇది ముసలోళ్ల టీమ్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. గతంలో రహానె విషయంలో వర్క్‌ అవుట్‌ అయినట్లు వీళ్ల విషయంలో కూడా అవుతుంది అనుకోవడం సీఎస్‌కే చేసిన బ్లండర్‌ మిస్టేక్‌. నిజంగా చెప్పాలంటే.. అంబటి రాయుడు రిటైర్మెంట్‌ ఇచ్చాడు కానీ, లేదంటే అతన్ని కూడా ఇంకా ఆడించే వాళ్లు. ఇలా అవుట్‌ డేటెడ్‌ ప్లేయర్లపై అతి నమ్మకం పెట్టుకున్న న్న సీఎస్‌కే.. ఇప్పుడు ఈ సీజన్‌లో వరుస ఓటములు చవిచూస్తోంది.

4. సీనియర్‌ ప్లేయర్స్‌ ఫెల్యూర్‌

సరే రిటెన్షన్స్‌, ఆక్షన్‌ ఎలాగోలా అయిపోయింది అనుకుంటే.. ఎంతో నమ్మకం పెట్టుకున్న సీనియర్‌ ఆటగాళ్లు దారుణంగా తేలిపోతున్నారు. ధోని, జడేజా, లోకల్‌ మ్యాన్‌ అశ్విన్‌.. పెద్దగా ఇంప్యాక్ట్‌ చూపించడం లేదు. సీఎస్‌కే హోం గ్రౌండ్‌ చెపాక్‌లో స్పిన్‌ బలంతో నెగ్గాలని జడేజాకు తోడు అశ్విన్‌ను కూడా తీసుకుంది సీఎస్‌కే. కానీ, అశ్విన్‌ ఆశించనంతగా రాణించకపోవడం జట్టుకు అదనపు భారంగా మారింది. నూర్‌ అహ్మద్‌ లాంటి ఒక యంగ్‌ స్పిన్నర్‌ కనుక సీఎస్‌కేలో లేకుంటే.. ఈ కాస్త పోటీ కూడా కచ్చితంగా ఇచ్చి ఉండేది కాదు. తొలి మ్యాచ్‌ నెగ్గడంలో నూర్‌దే కీలక పాత్ర. ఆ తర్వాత అతనొక్కడు మాత్రం ఏం చేయగలుగుతాడు. ధోని అంటే 43 ఏళ్ల వయసు, మోకాళ్ల నొప్పులతో ఆడలేకపోతున్నాడు అంటే.. జడేజా కూడా జట్టుకు భారంగా మారాడు. ఇలాగే కొనసాగితే.. ఈ సీజన్‌తో ధోని, జడేజా, అశ్విన్‌.. రిటైర్మెంట్‌ ప్రకటించడం ఖాయంగా కనిపిస్తోంది.

5. ప్లేయింగ్‌ ఎలెవన్‌

జట్టులో 11 మంది 30 ప్లస్‌ వయసున్న వాళ్లు ఉన్నా.. మరి మిగతా టీమ్‌ యంగ్‌ టీమే కదా అని అనుకోవచ్చు. కానీ, కుర్రాళ్లుకు సీఎస్‌కే పెద్దగా అవకాశాలు ఇవ్వడం లేదు. వరుసగా విఫలం అవుతున్నా.. రాహుల్‌ త్రిపాఠి, దీపక్‌ హుడా, విజయ్‌ శంకర్‌లను డ్రాప్‌ చేసి కూడా మళ్లీ ఛాన్సులు ఇస్తోంది. కానీ, షేక్‌ రషీద్‌, వంశ్ బేడి వంటి కుర్రాళ్లకు మాత్రం అవకాశాలు ఇవ్వడం లేదు. 2007లో కుర్రాళ్లతో సౌతాఫ్రికా వెళ్లి మొట్టమొదటి టీ20 కెప్టెన్‌ ధోని.. కుర్రాళ్లకు ఛాన్సులు ఇవ్వకుంటే ఇంకెవరు ఇస్తారు. రిటెన్షన్ష్‌, ఆక్షన్‌లో కొన్న ప్లేయర్లను ఇప్పుడెలాగో మార్చలేరు. అది సీఎస్‌కే చేతుల్లో లేదు. కానీ, వాళ్ల చేతుల్లో ఉన్నది.. ప్లేయింగ్‌ ఎలెవన్‌లో మార్పు. అదైనా సరిగ్గా చేసి.. కుర్రాళ్లకు అవకాశం ఇస్తే కాస్త బెటర్‌ అవ్వొచ్చు. మూలిగే నక్కపై తాటికాయ పడ్టట్టు. రుతురాజ్‌ కూడా టోర్నీకి దూరం అయ్యాడు. ఇప్పుడు ధోని చేతుల్లో ఉంది.. ప్లేయింగ్‌ ఎలెవన్‌లో సమూల మార్పులు చేసి.. కుర్రాళ్లకు ఛాన్సులు ఇచ్చి.. రానున్న మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శన కనబర్చి.. ప్లే ఆఫ్స్‌కు వెళ్లలేకపోయినా.. బాటమ్‌ ఆఫ్‌ ది టేబుల్‌ కాకుండా.. కాస్త గౌరవ ప్రదంగా ఈ సీజన్‌ ముగిస్తే బాగుటుంది. ఇది సగటు సీఎస్‌కే అభిమాని ఆకాంక్ష.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి