IPL 2025: రద్దు దిశగా ఐపీఎల్ 2025.. బీసీసీఐ కీలక నిర్ణయం?
India-Pakistan Border: ఐపీఎల్ 2025 కు సంబంధించి శుక్రవారం సమావేశం జరుగుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలియజేశారు. ఈ సమావేశంలో టోర్నమెంట్ నిర్వహణపై చర్చ జరుగుతుంది. దీంతో పాటు, భద్రతా పరిస్థితిని కూడా సమీక్షించనున్నారు. ఆ తర్వాతే భారత బోర్డు తన నిర్ణయం తెలియజేస్తుంది.

IPL 2025: భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) 18వ సీజన్ ప్రమాదంలో పడినట్లు కనిపిస్తోంది. గురువారం ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ మధ్య జరగాల్సిన మ్యాచ్ అకస్మాత్తుగా రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రేక్షకులు, ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అదే సమయంలో, ఐపీఎల్ 2025 కి సంబంధించి బీసీసీఐ సమావేశం నిర్వహించబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఐపీఎల్ 2025 రద్దు అవుతుందా?
మే 7న ఆపరేషన్ సింధూర్ తర్వాత, భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావారణం నెలకొంది. మే 8న, పొరుగు దేశం జమ్మూ నుంచి జైసల్మేర్ వరకు అనేక నగరాలపై దాడి చేసింది. దీని కారణంగా సరిహద్దులో ఉన్న నగరాల్లో బ్లాక్అవుట్ ప్రకటించారు. ఇంతలో, ధర్మశాలలో జరిగిన పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ కూడా ఫలితం లేకుండా రద్దు చేశారు.
పంజాబ్ ఇన్నింగ్స్ 10.1 ఓవర్ల తర్వాత, ఫ్లడ్ లైట్లు ఆపివేశారు. ఆటగాళ్లు, ప్రేక్షకులను మైదానం నుంచి ఖాళీ చేయాలని కోరారు. అదే సమయంలో, ఐపీఎల్ 2025 కి సంబంధించి బీసీసీఐ నేడు సమావేశం నిర్వహించబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.
బీసీసీఐ సమావేశం..
ఐపీఎల్ 2025 కు సంబంధించి శుక్రవారం సమావేశం జరుగుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలియజేశారు. ఈ సమావేశంలో టోర్నమెంట్ నిర్వహణపై చర్చ జరుగుతుంది. దీంతో పాటు, భద్రతా పరిస్థితిని కూడా సమీక్షించనున్నారు. ఆ తర్వాతే భారత బోర్డు తన నిర్ణయం తెలియజేస్తుంది. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. “ఈ సమయంలో పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ రద్దు చేశారు. స్టేడియం ఖాళీ చేశాం. రేపు పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఐపీఎల్ 2025 భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతానికి ఆటగాళ్ల భద్రతే మా ప్రాధాన్యత” అని తెలిపాడు.
ఆటగాళ్లకు ప్రత్యేక ఏర్పాట్లు..
ధర్మశాలలో చిక్కుకున్న ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ ఆటగాళ్ల కోసం బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ధర్మశాల దగ్గర నుంచి బోర్డు ప్రత్యేక రైలును ఏర్పాటు చేస్తుందని రాజీవ్ శుక్లా తెలిపారు. దీని ద్వారా ఆటగాళ్లను సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ 11వ ఓవర్లోనే ఆగిపోయింది. మ్యాచ్ సమయంలో ఈ స్టేడియం దాదాపు 80 శాతం నిండిపోయింది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..