ఇండియా దెబ్బకు పాకిస్థాన్లో PSL దుకాణం బంద్..! పెట్టేబేడా సర్దుకొని ఆ దేశానికి పరార్..
పహల్గాం దాడి తరువాత భారతదేశం చేపట్టిన ప్రతీకార చర్యల నేపథ్యంలో పాకిస్తాన్లో తీవ్ర భయాందోళన నెలకొంది. భారత దాడుల భయంతో పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) మ్యాచ్లను దుబాయ్ లేదా దోహాకు మార్చే ఆలోచనలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఉంది. విదేశీ ఆటగాళ్ళు పాకిస్తాన్ను విడిచి వెళుతుండటంతో PCB ఈ నిర్ణయం తీసుకుంటోంది.

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఇండియా ప్రతీకార చర్యలు తీసుకోవడంతో పాకిస్తాన్లో భయానక వాతావరణం నెలకొంది. అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే.. ఇండియా ఎక్కడ ఎటాక్ చేస్తుందో అనే భయంతో పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) టోర్నమెంట్ను వేరే దేశానికి తరలించాలని నిర్ణయించినట్లు సమాచారం. PSLలో మిగిలిన మ్యాచ్లను దుబాయ్ లేదా దోహాకు మార్చే అవకాశం ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. గురువారం మధ్యాహ్నం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారులు ఈ అంశంపై చర్చించారు. భారత దాడులకు భయపడి విదేశీ ఆటగాళ్ళు ఇప్పటికే పాకిస్తాన్ను విడిచి వెళ్ళడం ప్రారంభించారు.
అందువల్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇబ్బంది పడకుండా ఉండటానికి లీగ్ను వేరే చోటికి మార్చాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. పైన చెప్పినట్లుగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు PSL మిగిలిన మ్యాచ్లను విదేశాలలో నిర్వహించాలని యోచిస్తోంది. ఎందుకంటే ఈ లీగ్లో చాలా మంది విదేశీ ఆటగాళ్ళు ఆడుతున్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ నుండి చాలా మంది ఆటగాళ్ళు పాకిస్తాన్ సూపర్ లీగ్లో భాగమయ్యారు. పాకిస్తాన్ పై భారతదేశం దాడి చేస్తుందని ఇంగ్లాండ్ ఆటగాళ్ళు భయాందోళనకు గురవుతున్నారని, ఇప్పటికే ECB సహాయం కోరినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్లను దోహా లేదా దుబాయ్కి తరలిస్తే PCBకి భారీ ఆర్థిక నష్టం జరుగుతుంది.
మంగళవారం రాత్రి పీఓకే, పాకిస్తాన్లలో భారత వైమానిక దాడుల తర్వాత, గురువారం ఉదయం లాహోర్, రావల్పిండిలలో ఇండియా డ్రోన్ దాడులు నిర్వహించింది. ఈ దాడుల తర్వాత పాకిస్తాన్లో భయానక వాతావరణం నెలకొంది. గురువారం రాత్రి పీఎస్ఎల్ మ్యాచ్ జరగాల్సిన రావల్పిండి స్టేడియంలో కూడా డ్రోన్ దాడి జరిగింది. అందువల్ల మ్యాచ్ వాయిదా పడింది. అంతే కాదు, పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రతి మ్యాచ్ ప్రస్తుతానికి కరాచీకి మార్చినట్లు సమాచారం. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని ఇంకా ధృవీకరించలేదు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి