BBL : ఐపీఎల్ కంటే ముందే టీ20 పండగ.. ఇండియాలో అడుగుపెట్టనున్న బిగ్ బాష్ లీగ్
BBL : ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్ల హవా కొనసాగుతోంది. ఐపీఎల్ సృష్టించిన ప్రభంజనంతో ప్రతి దేశం తమ సొంత లీగ్ను ప్రారంభించింది. అయితే ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో ఒక అద్భుతమైన మార్పు చోటుచేసుకోబోతోంది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, క్రికెట్ ఆస్ట్రేలియా ఈ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.

BBL : ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్ల హవా కొనసాగుతోంది. ఐపీఎల్ సృష్టించిన ప్రభంజనంతో ప్రతి దేశం తమ సొంత లీగ్ను ప్రారంభించింది. అయితే ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో ఒక అద్భుతమైన మార్పు చోటుచేసుకోబోతోంది. ఐపీఎల్ తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన లీగ్గా పేరుగాంచిన ఆస్ట్రేలియాకు చెందిన బిగ్ బాష్ లీగ్ భారత్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, క్రికెట్ ఆస్ట్రేలియా ఈ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. బిగ్ బాష్ లీగ్ తదుపరి సీజన్ ఆరంభ వేడుకలు, మొదటి మ్యాచ్ను భారత గడ్డపై నిర్వహించాలని ఆస్ట్రేలియా బోర్డు యోచిస్తోంది.
ఆస్ట్రేలియన్ మీడియా కథనాల ప్రకారం.. బిగ్ బాష్ లీగ్ 2026-27 సీజన్ ప్రారంభ మ్యాచ్ ఆస్ట్రేలియాలో కాకుండా భారత్లో జరగనుంది. భారతీయ మార్కెట్ను ఆకట్టుకోవడంతో పాటు, ఇక్కడి అభిమానులకు తమ లీగ్ను మరింత దగ్గర చేయడమే లక్ష్యంగా క్రికెట్ ఆస్ట్రేలియా ఈ మాస్టర్ ప్లాన్ వేసింది. దీనికోసం క్రికెట్ ఆస్ట్రేలియాకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు ఇప్పటికే భారత్లో పర్యటించారు. ఇక్కడి స్టేడియాల సౌకర్యాలు, లాజిస్టిక్స్ మరియు ఇతర సాంకేతిక అంశాలను వారు నిశితంగా పరిశీలించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదన గనుక కార్యరూపం దాల్చితే, ఐపీఎల్ 2027 ప్రారంభానికి ముందే భారత క్రీడాభిమానులకు విదేశీ లీగ్ మజా రుచి చూసే అవకాశం దక్కుతుంది.
ఈ చారిత్రాత్మక మ్యాచ్కు వేదికగా చెన్నైలోని ఎం.ఏ.చిదంబరం స్టేడియం (చెపాక్) నిలిచే అవకాశం ఉందని SEN నివేదిక వెల్లడించింది. ప్రస్తుత ఛాంపియన్ పెర్త్ స్కార్చర్స్ తన మొదటి మ్యాచ్ను చెన్నైలో ఆడే ఛాన్స్ ఉంది. పెర్త్ టైమ్ జోన్ భారత కాలమానంతో దాదాపు దగ్గరగా ఉండటం దీనికి ప్రధాన కారణం. ఈ విషయంలో వెస్ట్రన్ ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్ (WACA) అధికారులు కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా ఇంకా తన ఎనిమిది క్లబ్లకు ఈ విషయంపై అధికారిక సమాచారం ఇవ్వలేదు. కేవలం ప్రాథమిక చర్చలు మరియు క్షేత్రస్థాయి పరిశీలనలు మాత్రమే జరుగుతున్నాయి.
క్రికెట్ ఆస్ట్రేలియా ఇంత భారీ సాహసం చేయడానికి బలమైన కారణం ఉంది. బిగ్ బాష్ లీగ్లో ఉన్న 8 క్లబ్లలో కనీసం రెండింటిలో వాటాలను విక్రయించాలని బోర్డు భావిస్తోంది. ఇందుకోసం ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానులను ఆకర్షించడమే వారి ప్రధాన ఉద్దేశం. ఇప్పటికే ఇంగ్లాండ్కు చెందిన ద హండ్రెడ్ లీగ్లో ఐపీఎల్ యజమానులు పెట్టుబడులు పెట్టారు. అదే బాటలో బిగ్ బాష్ క్లబ్లను కూడా ఐపీఎల్ దిగ్గజాల చేతుల్లో పెట్టడం ద్వారా లీగ్ ఆర్థిక స్థితిని పెంచాలని ఆస్ట్రేలియా చూస్తోంది. ఒకవేళ ఇది జరిగితే, విదేశీ లీగ్ మ్యాచ్ భారత్లో జరగడం చరిత్రలో ఇదే మొదటిసారి అవుతుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
