AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asian Games 2026: ఆసియా గేమ్స్ 2026కు టీమిండియా రెడీ.. నీరజ్ చోప్రా అవుట్.. వైభవ్ సూర్యవంశీపైనే అందరి కళ్లు

Asian Games 2026: జపాన్‌లో జరిగే ఆసియా గేమ్స్ 2026కు 503 మందితో కూడిన భారత అథ్లెట్ల బృందం సిద్ధమైంది. నీరజ్ చోప్రా దూరం కాగా, మెడళ్ల శతకమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది. గాయాలు, డోపింగ్ వివాదాల సవాళ్లు ఎదురైనప్పటికీ, భారత అథ్లెట్లు అసాధారణ పట్టుదలతో ఉన్నారు. 

Asian Games 2026: ఆసియా గేమ్స్ 2026కు టీమిండియా రెడీ.. నీరజ్ చోప్రా అవుట్.. వైభవ్ సూర్యవంశీపైనే అందరి కళ్లు
Asian Games 2026
Rakesh
|

Updated on: Sep 03, 2026 | 2:40 PM

Share

Asian Games 2026: జపాన్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఆసియా గేమ్స్ 2026కు భారత దళం ఉరకలేస్తోంది. గతసారి సాధించిన 106 పతకాల రికార్డును తిరగరాస్తూ, మరోసారి వందకు పైగా మెడళ్లు సాధించడమే లక్ష్యంగా 503 మంది క్రీడాకారులు సమరానికి సిద్ధమయ్యారు. ఈసారి ఆసియా క్రీడల్లో మొత్తం 45 దేశాల నుంచి వచ్చిన వేలాది మంది అథ్లెట్లు 43 క్రీడల్లో పోటీపడుతున్నారు. భారత్ తరఫున మొత్తం 768 మందితో కూడిన ప్రతినిధి బృందం జపాన్ వెళ్తుండగా, అందులో 503 మంది క్రీడాకారులు ఉన్నారు. క్రీడా మంత్రిత్వ శాఖ చొరవతో ఆటగాళ్ల సంఖ్య పెరిగింది. ఇందులో 269 మంది పురుషులు, 234 మంది మహిళా అథ్లెట్లు ఉన్నారు. మొత్తం 36 వేర్వేరు క్రీడల్లో వీరు భారత్ తరఫున పతకాల కోసం తలపడనున్నారు. చరిత్రలో మొదటిసారిగా భారత్ ఈ ఆసియా గేమ్స్‌లో సర్ఫింగ్ క్రీడలో అరంగేట్రం చేస్తుండటం విశేషం.

ఈ ప్రతిష్టాత్మక క్రీడల ప్రారంభానికి ముందే భారత బృందానికి కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. పారిస్ ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా టపాకాయ లాంటి టఖను గాయం కారణంగా ఆసియా గేమ్స్ నుంచి వైదొలిగారు. క్రికెట్‌లో కీలక మిడిలార్డర్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యారు. డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు రెజ్లర్లు ముకులు దహియా, దీపాంశులతో పాటు షూటర్ గౌరవ్ కుమార్‌లపై వేటు పడింది. గౌరవ్ స్థానంలో ఆకాష్ భరద్వాజ్ జట్టులోకి వచ్చారు.

అత్యధిక పతకాలు తెచ్చిపెట్టిన అథ్లెటిక్స్‌పైనే ఈసారి కూడా భారీ ఆశలు ఉన్నాయి. ఇప్పటివరకు అథ్లెటిక్స్‌లో భారత్ 85 స్వర్ణాలతో సహా 283 పతకాలు సాధించింది. ఒలింపిక్ విజేతలు పివి సింధు, మీరాబాయి చానూ, మను భాకర్ తమ విభాగాల్లో పతకాల వేటను నడిపించనున్నారు. పురుషుల క్రికెట్ జట్టుకు శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహిస్తుండగా, 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి నెలకొంది. కబడ్డీలో పురుషుల, మహిళల జట్లు స్వర్ణ పతకాలను నిలబెట్టుకోవాలని పట్టుదలతో ఉన్నాయి.

పురుషుల హాకీ జట్టు ఐదోసారి ఆసియా గేమ్స్ ఛాంపియన్‌గా నిలవాలని పట్టుదలతో ఉంటే, మహిళల జట్టు 1982 నుంచి కొనసాగుతున్న గోల్డ్ మెడల్ కరువుకు ముగింపు పలకాలని భావిస్తోంది. 2018లో 70 పతకాలు, 2022లో ఏకంగా 106 పతకాలతో అద్భుత పురోగతి సాధించిన భారత క్రీడాకారులు, ఈసారి కూడా సరికొత్త చరిత్ర సృష్టించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us