AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Triple Century: 31 ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసం.. ఒక్క టెస్టుకు పక్కనబెడితే త్రిపుల్ సెంచరీతో సమాధానం చెప్పాడు

సౌతాఫ్రికాలో బంగ్లాదేశ్ ఏ కెప్టెన్ తౌహీద్ హృదోయ్ 300 పరుగులు చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. విదేశీ గడ్డపై బంగ్లా ప్లేయర్ చేసిన తొలి త్రిపుల్ సెంచరీ ఇది. ఒత్తిడి సమయంలో నాయకుడిగా నిలబడి ఆడిన ఈ ఇన్నింగ్స్ తౌహీద్ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిపోతుంది. 

Triple Century: 31 ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసం.. ఒక్క టెస్టుకు పక్కనబెడితే త్రిపుల్ సెంచరీతో సమాధానం చెప్పాడు
Tawhid Hridoy
Rakesh
|

Updated on: Sep 02, 2026 | 7:27 PM

Share

Triple Century: బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో సెప్టెంబర్ 2వ తేదీ నిలిచిపోతుంది. సౌతాఫ్రికాలోని పోచెఫ్‌స్ట్రూమ్ మైదానంలో బంగ్లాదేశ్ ఏ జట్టు కెప్టెన్ తౌహీద్ హృదోయ్ చారిత్రాత్మక త్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. విదేశీ గడ్డపై ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ బాదిన తొలి బంగ్లాదేశ్ బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. సౌతాఫ్రికా ఏ జట్టుతో జరిగిన రంజీ స్థాయి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో రైట్ హ్యాండ్ బ్యాటర్ తౌహీద్ హృదోయ్ క్రీజులో పాతుకుపోయి ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ ఏకంగా 450 బంతుల్లో త్రిపుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్‌లో 25 ఫోర్లు, 6 భారీ సిక్సర్ల సాయంతో మైదానం నలుమూలలా బాండరీల వర్షం కురిపించాడు. ఒక విదేశీ పర్యటనలో బంగ్లాదేశ్ బ్యాటర్ ఈ స్థాయి స్కోరు సాధించడం క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారింది.

బంగ్లాదేశ్ ఏ జట్టు మొదట్లోనే తీవ్ర కష్టాల్లో పడింది. ఓపెనర్లు మహముదుల్ హసన్ జోయ్, పర్వేజ్ హుస్సేన్ ఇమాన్, మహమ్మద్ నయీమ్ వికెట్లను త్వరత్వరగా కోల్పోయి జట్టు ఒత్తిడిలో కూరుకుపోయింది. ఆ క్లిష్ట సమయంలో కెప్టెన్ బాధ్యతలను తన భుజాలపై వేసుకున్న తౌహీద్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వికెట్ కీపర్ జాకిర్ అలీతో కలిసి ఐదో వికెట్‌కు 292 బంతుల్లో 151 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. జాకిర్ అలీ 94 పరుగుల వద్ద ఔటై తృప్తిలో సెంచరీ చేజార్చుకున్నా తౌహీద్ మాత్రం ఏకాగ్రత కోల్పోలేదు.

జాకిర్ అలీ అవుటైన తర్వాత ఆల్‌రౌండర్ మహమ్మద్ సైఫుద్దీన్‌తో కలిసి ఆరో వికెట్‌కు ఏకంగా 185 పరుగులు జత చేశాడు. సౌతాఫ్రికా పేసర్ల బౌన్స్, స్వింగ్‌లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను కొండంత స్కోరు వైపు నడిపించాడు. గతంలో బంగ్లాదేశ్ నుంచి రకీబుల్ హసన్, తమీమ్ ఇక్బాల్ మాత్రమే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో త్రిశతకాలు సాధించారు. అయితే వారంతా స్వదేశీ పిచ్‌లపైనే ఆ ఘనత సాధించగా, విదేశీ మైదానంలో ఈ అరుదైన రికార్డు నమోదు చేసిన ఏకైక క్రికెటర్‌గా తౌహీద్ నిలిచాడు.

సాధారణంగా వన్డేలు, టీ20లలో వేగంగా ఆడే అటాకింగ్ బ్యాటర్‌గా తౌహీద్ హృదోయ్‌కు మంచి గుర్తింపు ఉంది. రెడ్ బాల్ క్రికెట్‌లోనూ తనకు తిరుగులేదని ఈ మ్యాచ్ ద్వారా నిరూపించాడు. కేవలం ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడిన తర్వాతే అతడిని జాతీయ జట్టు యాజమాన్యం పక్కనబెట్టింది. ప్రస్తుతం ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో నాలుగు సెంచరీలు పూర్తి చేసుకున్న తౌహీద్, ఈ తొలి త్రిశతకంతో బంగ్లాదేశ్ ప్రధాన టెస్టు జట్టులోకి తిరిగి రావడానికి బలమైన దావా వేసాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us