2,000 అండర్వేర్లు పాతిపెట్టిన సైంటిస్టులు.. ఫలితం వారిని షాకయ్యేలా చేసింది!
నేల ఎంత బలంగా, సారవంతంగా ఉందో తెలుసుకునేందుకు స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు ఓ వింత ప్రయోగం చేశారు. వెయ్యి మంది వాలంటీర్ల సహాయంతో రకరకాల ప్రాంతాలైన పార్కులు, మైదానాల్లో ఏకంగా రెండు వేల కాటన్ అండర్వేర్లను మట్టిలో పాతిపెట్టించారు. రెండు నెలల తర్వాత వాటిని బయటకు తీసి చూస్తే షాకింగ్ ఫలితం కనిపించింది.

ఈ వినూత్న పరిశోధనకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రతిష్టాత్మక ‘ప్లాంట్స్, పీపుల్, ప్లానెట్’ సైన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. జ్యూరిచ్ యూనివర్సిటీ పరిశోధకులు చేపట్టిన “సిటిజన్ సైన్స్ ప్రాజెక్ట్” స్టడీలో వెయ్యి మంది వాలంటీర్లు పాల్గొని.. వేర్వేరు మట్టి రకాలలో ఏకంగా 2,000 లోదుస్తులు, 12,000 టీ బ్యాగులను పాతిపెట్టారు. రెండు నెలల తర్వాత వాటిని తవ్వి చూస్తే వింతగా అనిపించింది. ఫొటోలు తీసుకుని మట్టి శాంపిల్స్తో సహా ల్యాబ్కు పంపి పరీక్షించారు. కొన్ని చోట్ల దుస్తులు పూర్తిగా కుళ్లిపోయి కరిగిపోతే, మరికొన్ని చోట్ల మాత్రం కేవలం చిన్న రంధ్రాలు మాత్రమే పడ్డాయి. కాటన్ లో దుస్తులు కరగకుండా, రంధ్రాలు పడకుండా ఉండటానికి కారణం ఆ నేలలో మంచి బ్యాక్టీరియా, వానపాములు, ఇతర సూక్ష్మజీవులు లేకపోవడమేనని శాస్త్రవేత్తలు తేల్చారు
రైతు పొలాల్లో, ఇళ్ల ముందున్న లాన్లు, ఇతర గడ్డి మైదానాల్లో మట్టిలోని సారం తగ్గినట్లు స్టడీలో తేలింది. ఈ ప్రాంతాల్లో మట్టిలో పాతిపెట్టిన లోదుస్తులు కేవలం 40 శాతం మాత్రమే కుళ్లిపోయాయి. అదే సమయంలో, అడవులు, సహజమైన గడ్డి మైదానాల్లో మాత్రం మట్టిలోని సూక్ష్మజీవులు చాలా చురుగ్గా పనిచేయడం వల్ల దుస్తులు దాదాపు పూర్తిగా కరిగిపోయాయి.
సేంద్రీయ ఎరువులతో సంరక్షించే ప్రైవేట్ తోటల్లో వానపాములు, శిలీంధ్రాలు, మంచి బ్యాక్టీరియా ఎక్కువగా ఉండటం గుర్తించారు. దీని వల్ల కాటన్ దుస్తులు 58 శాతం వరకు వేగంగా కుళ్లిపోయాయి. మనం తినే ఆహారంలో 95 శాతం పై మట్టి (టాప్ సాయిల్) నుంచే వస్తుంది. అయితే పైకి నేల బాగానే కనిపిస్తున్నా, రసాయన ఎరువులను ఎక్కువగా వాడటం వల్ల అందులోని ఫాస్ఫరస్ నీటి వనరులకు, జీవవైవిధ్యాకి తీవ్ర నష్టం కలిగిస్తోందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. భూమిని వాడుకునే పద్ధతులను మార్చుకుంటేనే నేల ఆరోగ్యాన్ని, సారాన్ని కాపాడుకోగలమని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త మార్సెల్ వాన్ డెర్ హెజ్డెన్ తెలిపారు.