9 ఫోర్లు, 10 సిక్స్లతో అభిషేక్ ఊచకోత.. రోహిత్ రికార్డు బద్దలు కొట్టిన కాటేరమ్మ కొడుకు..!
భారత క్రికెట్ జట్టు (Team India) యువ సంచలనం అభిషేక్ శర్మ (Abhishek Sharma) అంతర్జాతీయ టీ20 (T20I) క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించారు. ఢిల్లీ వేదికగా అఫ్గానిస్థాన్ (Afghanistan) జట్టుతో జరిగిన మ్యాచ్లో కేవలం 30 బంతుల్లోనే మెరుపు శతకం బాది మన దేశంలో అత్యంత వేగవంతమైన టీ20 సెంచరీ సాధించిన బ్యాటర్గా చరిత్ర పుటల్లో నిలిచారు.

ఢిల్లీ మైదానంలో అఫ్గానిస్థాన్ (Afghanistan) జట్టుతో జరుగుతున్న పోరులో భారత క్రికెట్ జట్టు (Team India) యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) బ్యాటింగ్లో విశ్వరూపం ప్రదర్శించాడు. ప్రత్యర్థి బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడె. ఈ అసాధారణ ఇన్నింగ్స్ ద్వారా భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అంతర్జాతీయ టీ20 సెంచరీ సాధించిన ఆటగాడిగా సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గతంలో భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) 2017లో ఇండోర్ వేదికగా శ్రీలంకపై 35 బంతుల్లో సాధించిన ఆల్ టైమ్ రికార్డును అభిషేక్ అధిగమించాడు. గతంలో 2025 సీజన్లో ముంబై వాంఖడే స్టేడియంలో ఇంగ్లండ్పై 37 బంతుల్లో శతకం బాదిన ఈ డాషింగ్ బ్యాటర్, ఇప్పుడు కేవలం 30 బంతుల్లోనే మూడంకెల మార్కును తాకి అభిమానులను అమితంగా అలరించాడు. ఈ అద్భుత ప్రదర్శనతో స్టేడియం మొత్తం హోరెత్తిపోగా, భారత ఇన్నింగ్స్ తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది.
ప్రపంచ అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రను పరిశీలిస్తే, అతి తక్కువ బంతుల్లో శతకాలు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో అభిషేక్ ప్రపంచంలోనే మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ విభాగంలో ఎస్టోనియా (Estonia) బ్యాటర్ సాహిల్ చౌహాన్ (Sahil Chauhan) 2024లో సైప్రస్పై 27 బంతుల్లోనే శతకం సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత టర్కీ (Turkey) ప్లేయర్ మహమ్మద్ ఫహద్ (Muhammad Fahad) 2025లో బల్గేరియాపై 29 బంతుల్లో సెంచరీ బాది రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. తాజాగా నమోదైన ఈ 30 బంతుల ఇన్నింగ్స్ ద్వారా అభిషేక్ అంతర్జాతీయ స్థాయిలో మూడో వేగవంతమైన సెంచరీ సాధించిన వీరుడిగా నిలిచాడు.
గతంలో నమోదైన ఎన్నో మేటి రికార్డులను సైతం ఈ భారత ఓపెనర్ అధిగమించారు. నమీబియా (Namibia) ఆటగాడు జాన్ నికోల్ లోఫ్టీ-ఈటన్ (Jan Nicol Loftie-Eaton) 2024లో నేపాల్పై 33 బంతుల్లో శతకం కొట్టారు. జింబాబ్వే (Zimbabwe) ఆల్రౌండర్ సికందర్ రజా (Sikandar Raza) గాంబియాపై, న్యూజిలాండ్ (New Zealand) బ్యాటర్ ఫిన్ అలెన్ (Finn Allen) కోల్కతా వేదికగా దక్షిణాఫ్రికాపై 33 బంతుల్లో సెంచరీలు నమోదు చేశారు. నేపాల్కు చెందిన కుశాల్ మల్లా (Kushal Malla) 2023లో మంగోలియాపై 34 బంతుల్లో శతకం సాధించారు. వీరందరి కంటే వేగంగా మూడంకెల స్కోరును అందుకుని అభిషేక్ సరికొత్త ప్రమాణాన్ని నిర్దేశించారు.
క్రీజులో అడుగుపెట్టిన క్షణం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన ఆయన, జట్టుకు కొండంత స్కోరు సాధించే అవకాశాన్ని అందించారు. పరుగుల వేటలో నూతన రికార్డును నెలకొల్పడం టీమిండియా ఆధిపత్యాన్ని చాటిచెప్పింది.
