World Test Championship 2026 : త్వరలో 12 జట్లతో టెస్ట్ ఛాంపియన్షిప్.. ఇకపై సింగిల్ టెస్ట్ సిరీస్లకు కూడా డబ్ల్యూటీసీ పాయింట్లు
World Test Championship 2026 : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC)లో త్వరలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటివరకు కేవలం 9 జట్లకే పరిమితమైన ఈ మెగా టోర్నీని 12 జట్లకు విస్తరించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కసరత్తు చేస్తోంది. తదుపరి సైకిల్ నుంచి ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్, జింబాబ్వే జట్లను కూడా ఈ ఛాంపియన్షిప్లో చేర్చే అవకాశం ఉంది.

World Test Championship 2026 : ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కేవలం 9 ప్రధాన జట్లు మాత్రమే తలపడుతున్నాయి. అయితే టెస్ట్ క్రికెట్ను ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఐసీసీ ఇప్పుడు 12 జట్ల మోడల్ను పరిశీలిస్తోంది. దీనివల్ల పూర్తిస్థాయి సభ్యత్వం ఉన్నప్పటికీ ఇప్పటివరకు డబ్ల్యూటీసీకి దూరంగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్, జింబాబ్వే జట్లకు ఈ ప్రతిష్టాత్మక లీగ్లో ఆడే అవకాశం లభిస్తుంది. న్యూజిలాండ్ మాజీ బ్యాటర్ రోజర్ ట్వోస్ నేతృత్వంలోని ఐసీసీ బృందం మే నెలలో ఈ మేరకు సిఫార్సులు చేసే అవకాశం ఉంది.
ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం.. డబ్ల్యూటీసీలో కనీసం రెండు టెస్టులు ఉన్న సిరీస్లనే పరిగణనలోకి తీసుకుంటున్నారు. దీనివల్ల ఆర్థికంగా వెనుకబడిన క్రికెట్ బోర్డులకు ఒకే ఒక్క టెస్ట్ నిర్వహించడం నష్టదాయకంగా మారింది. కానీ కొత్త ప్రతిపాదన ప్రకారం, ఇకపై సింగిల్ టెస్ట్ మ్యాచ్ సిరీస్లు కూడా ఛాంపియన్షిప్లో భాగంగా మారుతాయి. దీనివల్ల పెద్ద జట్లు ఐర్లాండ్ లేదా ఆఫ్ఘనిస్తాన్ వంటి జట్లతో ఒక మ్యాచ్ ఆడినా, ఆ పాయింట్లు ఫైనల్ రేసులో లెక్కించబడతాయి. ఉదాహరణకు టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే ముందు ఐర్లాండ్లో ఆడే ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఇకపై డబ్ల్యూటీసీ పాయింట్ల వేటలో కీలకం కానుంది.
చిన్న జట్లతో టెస్టులు ఆడేందుకు పెద్ద దేశాలు ఆసక్తి చూపకపోవడానికి ప్రధాన కారణం వాటికి డబ్ల్యూటీసీ పాయింట్లు లేకపోవడమే. ఒకవేళ ఐసీసీ ఈ కొత్త రూల్ను అమలు చేస్తే.. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి జట్లు కూడా జింబాబ్వే లేదా అఫ్గాన్తో మ్యాచ్లు ఆడేందుకు ఉత్సాహం చూపిస్తాయి. ఇది చిన్న దేశాల్లోని క్రికెటర్లకు మంచి ఎక్స్పోజర్ను ఇస్తుంది. గతేడాది రెండు డివిజన్ల మోడల్ను ఐసీసీ పరిశీలించినప్పటికీ, కొన్ని దేశాలు అభ్యంతరం చెప్పడంతో ఇప్పుడు ఈ 12 జట్ల ఏకీకృత విధానాన్ని తీసుకువచ్చేలా కనిపిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్ల హవా పెరుగుతున్న తరుణంలో టెస్ట్ క్రికెట్ను బతికించుకోవడం ఐసీసీకి సవాలుగా మారింది. 12 జట్ల విస్తరణ వల్ల షెడ్యూలింగ్ పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, అన్ని జట్లకు సమాన అవకాశం కల్పించడం వల్ల ఈ ఫార్మాట్కు పునర్వైభవం వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే నెలలో జరగబోయే ఐసీసీ సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర పడితే, టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొదలవుతుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
