Asian Games: ఆసియా గేమ్స్కు తుఫాన్ ముప్పు.. యథావిధిగా జరుగుతాయా..? బ్రేక్ పడుతుందా..?
జపాన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్కు తుఫాన్ ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే స్థానిక వాతావరణశాఖ తుఫాన్ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో నిర్వాహకులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ భారీ వరదలు వస్తే క్రీడాకారులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాాధారణ పరిస్థితు ఉంటే క్రీడలు యథావిధిగా జరుగుతాయి.

జపాన్లోని ఐచి నగోయాలో జరగాల్సిన 2026 ఆసియా క్రీడల్లో గందరగోళం నెలకొంది. ఈ టోర్నమెంట్ శనివారం నుంచి ప్రారంభమవుతున్నాయి. అయితే ఈ క్రీడలకు తుఫాను ముప్పు పొంచి ఉంది. ఈ క్రీడలు జరిగే ఐచి-నగోయా ప్రాంతంలో బలమైన గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తుఫాన్ ఏర్పడే ఛాన్స్ ఉందని స్థానిక వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో తుఫాన్ ఏర్పడితే క్రీడల నిర్వహణకు ఇబ్బందులు తలెత్తే అవకాశముంటుంది. గంటకు 126 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన దుజువాన్ తుఫాను గురువారం జపాన్లోని మధ్య ప్రాంతాల వైపు దూసుకువస్తోంది. ఆదివారం ఐచి-నగోయాకు సమీపంగా తుఫాన్ రావొచ్చని వాతావరణశాఖ అంచనా వేసింది. దీంతో ఆసియా క్రీడలపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ క్రమంలో ఆసియా గేమ్స్ 2026 ఉపాధ్యక్షుడు ఇచిరో హిరోసావా మాట్లాడుతూ.. వర్షపాతం సాధారణంగా ఉంటే టోర్నమెంట్ కొనసాగుతుందని, కుండపోత వర్షం కురిస్తే అత్యవసర చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తెలిపారు. భారీ వర్షాలు కురిస్తే క్రీడాకారులను తాత్కాలికంగా తరలించడానికి ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. గత వారం నగోయాలో కురిసిన భారీ వర్షాలు కురవడడంతో అథ్లెట్లను వారి కంటైనర్ల నుండి కొద్దిసేపు ఖాళీ చేయించారు. క్రీడా వేదికల్లో నీటి లీకేజీ సమస్యలను ఎదుర్కొన్నాయి.
అటు ఆసియా క్రీడలలో క్రీడాకారులకు వసతి సమస్య నెలకొంది. దీంతో భారత క్రీడా మంత్రిత్వ శాఖ అక్కడి ప్రవాస భారతీయుల సహాయం కోరుతోంది. నాగోయాలోని సుమారు 2000 కుటుంబాలను భారత రాయబార కార్యాలయం సంప్రదించింది. వసతి కొరత ఏర్పడినప్పుడు సహాయం చేయడానికి వారిలో చాలామంది ముందుకు వచ్చారు. క్రీడాకారులకు మంచి హోటళ్లలో వసతి కల్పించడమే మొదటి ప్రాధాన్యత అని, కానీ ఇంకా గదులు అవసరమైతే ఆదుకోవడానికి ప్రవాస భారతీయులు ఉన్నారని క్రీడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే సుమారు 35 మంది భారత అథ్లెట్లను ఇప్పటికే హోటళ్లకు తరలించారు. మరికొంతమంది కూడా త్వరలో రానున్నాయి. తమకు కేటాయించిన వసతి పొందడంలో జాప్యం ఎదురవడంతో బ్యాడ్మింటన్ బృందాన్ని కూడా ఒక హోటల్కు తరలించారు. ప్రవాస భారతీయుల మద్దతుతో పరిస్థితిని చక్కదిద్దవచ్చని మంత్రిత్వ శాఖ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. అంతేకాకుండా విమానాశ్రయంలో అథ్లెట్లకు స్వాగతం పలకడానికి షెఫ్ డి మిషన్ సిబ్బందిలోని ఇద్దరు సభ్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. కాగా ప్రత్యేక అథ్లెట్లకు కంటైనర్ తరహా గుడిసెలు, లంగరు వేసిన క్రూయిజ్ షిప్, హోటళ్లలో వసతి కల్పించడంతో.. భారతీయులతో సహా పలువురు అథ్లెట్లు గదులు పొందడంలో ఆలస్యాన్ని ఎదుర్కొన్నారు
