Asian Games 2023: ఆసియా క్రీడల్లో ముగిసిన భారత్ జైత్రయాత్ర.. రికార్డు స్థాయిలో పతకాలు.. మొత్తం ఎన్నంటే?

ఇక జ్యోతి సురేఖ..భారత్‌ వదిలిన బాణంగా మారింది. గురి తప్పకుండా పసిడి లక్ష్యాన్ని పదేపదే ఛేదించింది. చైనాలోని హాంగ్జౌ వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో తెలుగు క్రీడాకారులు సత్తా చాటారు. తెలుగు తేజం, విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ సంచలనం సృష్టించారు. మహిళల కాంపౌండ్ ఆర్చరీ ఈవెంట్‌లో సత్తా చాటారు. ఈ కేటగిరీలో స్వర్ణ పతకాన్ని సాధించారు.

Asian Games 2023: ఆసియా క్రీడల్లో ముగిసిన భారత్ జైత్రయాత్ర.. రికార్డు స్థాయిలో పతకాలు.. మొత్తం ఎన్నంటే?
Asian Games 2023

Updated on: Oct 08, 2023 | 6:53 AM

28 స్వర్ణం, 38 రజతం, 41 కాంస్యం.. మొత్తం 107 పతకాలతో ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో పతకాల వేటలో ఆటాడేసుకుంది ఇండియా. ఇంతకు ముందెన్నడూ లేని స్థాయిలో.. .భారత్‌ వందకు పైగా పతకాలు కైవసం చేసుకుంది. శనివారం ఒక్క రోజే భారత్‌ 6 స్వర్ణాలు సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో మన దేశం నాలుగో స్థానంలో నిలిచింది. ఇక జ్యోతి సురేఖ..భారత్‌ వదిలిన బాణంగా మారింది. గురి తప్పకుండా పసిడి లక్ష్యాన్ని పదేపదే ఛేదించింది. చైనాలోని హాంగ్జౌ వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో తెలుగు క్రీడాకారులు సత్తా చాటారు. తెలుగు తేజం, విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ సంచలనం సృష్టించారు. మహిళల కాంపౌండ్ ఆర్చరీ ఈవెంట్‌లో సత్తా చాటారు. ఈ కేటగిరీలో స్వర్ణ పతకాన్ని సాధించారు. జ్యోతి సురేఖను అభినందిస్తూ ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. ఒకటి కాదు రెండు కాదు..ఆర్చరీలో మొత్తం 3 బంగారు పతకాలు సాధించింది ఈ బంగారు లేడీ. దీంతో ఈ ఏడాది ఏషియన్ గేమ్స్‌లో అత్యంత విజయవంతమైన భారత క్రీడాకారిణిగా తెలుగమ్మాయి జ్యోతి సురేఖ నిలిచింది. విజయవాడలోని జ్యోతి సురేఖ ఇంట్లో ఆమె కుటుంబ సభ్యులు స్వీట్లు పంచుకుని సంతోషం వ్యక్తం చేశారు. తన బిడ్డ స్వర్ణ పతకం సాధించడం గర్వంగా ఉందన్నారు ఆమె తండ్రి సురేంద్ర. ఇప్పటివరకు ఆమె 53కుపైగా పతకాలు సాధించిందన్నారు.

చరిత్ర సృష్టించిన తెలుగు తేజాలు..

ఇక తెలుగు బిడ్డలు నిఖత్‌ జరీన్‌ బాక్సింగ్‌లో కాంస్యం సాధిస్తే, షూటింగ్‌లో ఈషా సింగ్‌ రజతంతో మెరిసింది. మన హైదరాబాదీ తిలక్‌వర్మ..ఏషియన్‌ గేమ్స్‌ టీ20 క్రికెట్‌లో భారత్‌ స్వర్ణం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో ఫైనల్ మ్యాచ్‌ వర్షం కారణంగా నిలిచిపోవడంతో..రన్‌రేట్ ప్రకారం భారత్‌ విజేతగా నిలిచింది. మెన్స్‌ కబడ్డీలో భారత్‌కు మరో గోల్డ్ మెడల్‌ వచ్చింది. ఫైనల్‌లో 32-29 తేడాతో ఇరాన్‌పై భారత్‌ పురుషుల జట్టు గెలిచింది. భారత మహిళల జట్టు కూడా స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. మహిళల కబడ్డీ ఫైనల్‌లో చైనీస్‌ జట్టును చిత్తు చేస్తూ భారత్‌ స్వర్ణంతో మెరిసింది. ఇక రెజ్లింగ్‌ 86 కిలోల విభాగంలో దీపక్‌ పునియా రతజ పతకం సాధించాడు. అలాగే ఆర్చరీ ఈవెంట్‌లో మొత్తం నాలుగు పతకాలను భారత్‌ కైవసం చేసుకుంది. ఈ విభాగంలో అదితి గోపీచంద్ కాంస్యం సాధించింది. ఆర్చరీ పురుషుల విభాగంలో ఓజాస్‌ స్వర్ణం గెలుచుకోగా.. అభిషేక్‌ రజతం సాధించాడు. హెప్టాథ్లాన్‌ విభాగంలో అగసర నందిని కాంస్య పతకం సాధించింది. బ్యాడ్మింటన్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌శెట్టి జోడీ దక్షిణ కొరియా జంటపై విజయంతో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది. హాకీలో భారత మహిళల జట్టు కాంస్య పతకం దక్కించుకుంది. చెస్‌లో భారత్ రెండు రజత పతకాలు సాధించింది. కోనేరు హంపీ, హారిక ద్రోణవల్లి, వైశాలి, వంతిక, సవితలతో కూడిన మహిళా బృందం రజత పతకాలు అందుకుంది. పురుషుల జట్టులో ప్రజ్ఞానంద, గుకేష్, విదిత్ గుజరాతీ, అర్జున్, హరికృష్ణలు రజతాలు దక్కించుకున్నారు. దీంతో ఈసారి భారత్‌కు పతకాల పంట పండింది. భారత క్రీడాకారులకు అభినందనలు తెలుపుతూ ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

ప్రధాని మోడీ అభినందనలు..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..