Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maha Shivaratri: శివరాత్రి రోజున అందరి చూపు తలపాగా పైనే… న‌వ‌ నందుల‌ను క‌లుపుతూ పాగాల అలంకరణ

శ్రీశైలంలో తరాలుగా వస్తున్న సాంప్రదాయాన్ని ఈ ఏడాది కొనసాగించారు. బ్రహ్మోత్సవాల్లో శ్రీశైల మల్లన్నకు చేసే పాగాలంకరణ పృథ్వి వంశీయులు పూర్తి చేశారు.

Maha Shivaratri: శివరాత్రి రోజున అందరి చూపు తలపాగా పైనే... న‌వ‌ నందుల‌ను క‌లుపుతూ పాగాల అలంకరణ
Srisalam Mallanna Temple
Follow us
Surya Kala

|

Updated on: Feb 18, 2023 | 6:38 AM

మ‌హాశివ‌రాత్రి పర్వదినాన శ్రీశైల మల్లన్నకు అలంకరించే తలపాగా అలంకరణకు ప్రత్యేక విశిష్టత ఉంది. శైవ క్షేత్రాల్లో మ‌రెక్కడా జ‌ర‌గని విధంగా శ్రీశైల జ్యోతిర్లింగ‌మూర్తికి అద్వితీయ సేవే ఈ పాగాలంక‌ర‌ణ‌. శ్రీశైలంలో కొలువుదీరిన మల్లన్నకు ఎంతటి ఖ్యాతి ఉందో  ..పెళ్లి కుమారునిగా మల్లన ధరించే తలపాగా కు సైతం అంతే ఖ్యాతి దాగివుంది. లింగోద్భవ సమయంలో ఆలయంపై ఉన్న నవ నందులకు అలంకరించే ఈ పాగాను బాపట్ల జిల్లా, చీరాల మండలంలోని పృథ్వి వంశీయులే తరాలుగా నేస్తున్నారు. జాండ్రపేట పంచాయతీ హస్తినాపురానికి చెందిన పృథ్వి వెంకటేశ్వర్లు గత మూడు తరాలుగా ఈ సంప్రదాయాన్నికొనసాగిస్తూ వస్తున్నారు. 14 లోకాల్లో మ‌ల్లన్న అనుగ్రహం ప‌రిపూర్ణంగా ఉండాల‌ని లోక‌ క‌ళ్యాణాన్ని కాంక్షిస్తూ నిర్వహించే సేవగా ఈ సంప్రదాయాన్ని బావిస్తుంటారు.

తమ సొంత మగ్గంపై రోజుకి మూర చొప్పున నియమనిష్ఠలతో తయారుచేస్తారు. అలా 300 మూర్ల చొప్పున వస్త్రాన్ని రూపొందిస్తారు. ప్రస్తుతం తన కుమారుడు వెంకట సుబ్బారావు సహకారంతో రూపొందించి స్వామివారికి సమర్పిస్తారు. మహాశివరాత్రి పర్వదినానికి పదిరోజుల ముందే తలపాగా తయారీ ప్రక్రియ పూర్తవుతుంది. అనంతరం ఇంటిలోనే ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

శ్రీశైలానికి తరలివెళ్లే ముందురోజు తలపాగాను పృథ్వి వంశీయుల ఇంటి నుంచి జాండ్రపేట, వేటపాలెం, పందిళ్లపల్లి ప్రాంతాల్లో  మేళతాళాల మధ్య ఊరేగింపు నిర్వహిస్తారు. స్వామివారి క‌ళ్యాణానికి ముందు పెండ్లి కుమారుడికి త‌ల‌పాగా చుట్టే ఆచార‌శైలిని అనుస‌రించే పృథ్వీ వెంక‌టేశ్వర్లు కుటుంబం త‌ర‌త‌రాలుగా పాగాలంక‌ర‌ణ సేవ చేస్తున్నారు. మ‌హా శివ‌రాత్రి ప‌ర్వదినాన చిమ్మ చీక‌ట్లో దిగంబ‌రులై స్వామివారి గ‌ర్భాల‌య విమాన క‌ల‌శాలు, ముఖమండ‌వ న‌వ‌ నందుల‌ను క‌లుపుతూ పాగాల‌ను అలంక‌రిస్తారు. అసలు మ‌హా శివ‌రాత్రి రోజున మ‌ల్లన్న స్వామికి నిర్వహించే పాగాలంక‌ర‌ణ‌ను ద‌ర్శించ‌డం ద్వారా ప‌ర‌మేశ్వరుడి అనుగ్రహం క‌లిగి.. ఆ ఏడాదంతా శుభాలు చేకూరుతాయ‌ని భ‌క్తుల ప్రగాఢ న‌మ్మకం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)