AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samatha Kumbh: సమతా కుంభ్‌‌ సంరంభం షురూ.. కనుల పండవగా శ్రీరామానుజాచార్య దివ్యదేశాల బ్రహ్మోత్సవాలు

వందే గురుపరాంపరాం..ఓం నమో నారాయణాయ.. శ్రీరామానుజాచార్య 108 దివ్యదేశాల నాలుగవ బ్రహ్మోత్సవాలకు వేళాయింది. నేటి నుంచే సమతా కుంభ్‌-2026 మహోత్సవాల ప్రారంభం. భగవద్రామానుజ సన్నిధిలో ఆధ్మాత్మిక ఝరి.. అదివో అల్లదివో ఇలపైన అల వైకుంఠపురి.. అంటూ సమతా కుంబ్ మార్మోగింది. నిత్యం జరిగే కైంకర్యాలతో పాటు విశేషోత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

Samatha Kumbh: సమతా కుంభ్‌‌ సంరంభం షురూ.. కనుల పండవగా శ్రీరామానుజాచార్య దివ్యదేశాల బ్రహ్మోత్సవాలు
Samatha Kumbh Muchintal, 108 Divya Desams Brahmotsavam
Balaraju Goud
|

Updated on: Jan 30, 2026 | 8:00 AM

Share

వందే గురుపరాంపరాం..ఓం నమో నారాయణాయ.. శ్రీరామానుజాచార్య 108 దివ్యదేశాల నాలుగవ బ్రహ్మోత్సవాలకు వేళాయింది. నేటి నుంచే సమతా కుంభ్‌-2026 మహోత్సవాల ప్రారంభం. భగవద్రామానుజ సన్నిధిలో ఆధ్మాత్మిక ఝరి.. అదివో అల్లదివో ఇలపైన అల వైకుంఠపురి.. అంటూ సమతా కుంబ్ మార్మోగింది.

ఆధ్యాత్మిక నగరం మహాద్భుత ఘట్టానికి వేదిక కానుంది. ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో నేటి నుంచి సమతాకుంభ్‌ ప్రారంభం అవుతుంది. 108 దివ్యదేశాల నాలుగో వార్షిక బ్రహ్మోత్సవాలకు చిన్నజీయర్‌ స్వామి అంకురార్పణ చేయనున్నారు. కన్నులపండుగగా సాగే ఉత్సవాలను కన్నులారా వీక్షించడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అశేష సంఖ్యలో తరలిరానున్నారు.

త్రిదండి చిన్నజీయర్‌ స్వామి పర్యవేక్షణలో సమతాకుంభ్‌ 2026 శ్రీరామానుజాచార్య-108 దివ్యదేశాల నాలుగో వార్షిక తృతీయ బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఫిబ్రవరి 9 వరకు జరుగనున్నాయి. ఉత్సవారంభ స్నపనం, అంకురార్పణతో బ్రహ్మోత్సవాలను స్వామివారు ప్రారంభించనున్నారు. పది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ప్రతిరోజూ విశేష కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అలాగే రోజూ సుప్రభాతం, అష్టాక్షరీ మంత్ర జపంతో పాటు విష్ణు సహస్రనామ పారాయణం చేయనున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ముచ్చింతల్‌ ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది.

భగవద్రామానుజాచార్యుల జన్మ నక్షత్రం ఆరుద్ర! ఈ నక్షత్రం రోజునే ఉత్సవాలను ఆరంభించడం ఆనవాయితీ. రామానుజ సువర్ణమూర్తికి ఉత్సవారంభ స్నపనం, సాయంత్రం ఆరుగంటలకు అంకురారోపణతో సమతా కుంభ్‌ నాలుగవ బ్రహ్మోత్సవాల మహారంభం మొదలు కానుంది. శ్రీరామనామ స్మరణతో సమతా కుంభ్ మార్మోగుతోంది.

జనవరి 31 తేదీన ధ్వజారోహణం.. గరుడ ప్రసాద వితరణతో బ్రహోత్వవాలు ప్రారంభమవుతాయి. మొదటి రోజు ఉదయం అగ్ని ప్రతిష్ట , సూర్యప్రభ వాహన సేవ, సాయంత్రం శేషవాహన సేవ, 108 దివ్యదేశాధీశులకు 18 గరుడ సేవలు నిర్వహించనున్నట్లు సమతా కుంభ్‌‌ నిర్వాహకులు తెలిపారు. ఇక ఫిబ్రవరి 01న దివ్యదేశమూర్తులకు తిరుమంజన సేవ, శ్రీరామ అష్టోత్తర శతనామార్చన జరుగుతుంది. సాయంత్రం చంద్రవాహన సేవ, దివ్యదేశాధీశులకు 18 సేవలు ఉంటాయి.

ఫిబ్రవరి 2వ తేదీన ఉదయం రామానుజ నూత్తందాది, సాయంత్రం హనుమద్వాహన సేవ ఉంటుంది. ఫిబ్రవరి 3వ తేదీ డోలోత్సవం, గజవాహన సేవ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 4న శాంతి కల్యాణ మహోత్సవం కనుల పండువగా సాగనుంది. ఫిబ్రవరి 5వ తేదీన వసంతోత్సవం, అశ్వవాహన సేవ నిర్వహిస్తారు. ఇక ఫిబ్రవరి 6వ తేదీన సామూహిక లక్ష్మీపూజ, గద్యత్రయ పారాయణము, గరుడ వాహన సేవ ఉంటుంది. ఫిబ్రవరి 7వ తేదీన ఆచార్య వరివస్య, తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 8వ తేదీన రథోత్సవం కనుల పండువగా సాగనుంది. అదే రోజు సాయంత్రం చక్రస్నానం జరుగుతుంది. ఫిబ్రవరి 9వ తేదీన శ్రీపుష్పయాగం, సాయంత్రం మహాపూర్ణాహుతి కార్యక్రమంలో సమతాకుంభ్ సంబరం ముగియనుంది.

భగవద్రామానుజ సమతా స్పూర్తిగా.. సంకల్ప సారధి సారథ్యాన .. సమత్‌ కుంభ నాలుగవ బ్రహ్మోత్సవాల వేళ సకల జనులకు ప్రేమపూర్వక శుభసందేశం అందించారు చినన జీయర్‌ స్వామిజీ. సమతా కుంభ్‌-2026 పది రోజుల వేడుకల్లో ప్రతి రోజూ పండగే. ప్రతినిత్యం.. సుప్రభాతం, అష్టాక్షరీ మంత్రజపం, విష్ణు సహస్రనామ పారాయణం, విశేష వాహన సేవలు నిర్వహిస్తారు. ఉత్సవాలకు విశేషంగా తరలివస్తున్నారు భక్తులు.. నిత్యం జరిగే కైంకర్యాలతో పాటు విశేషోత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రతి ఘట్టం అద్భుతం.. ప్రతీ దృశ్యం అనిర్వచనీయం! శ్రీరామానుజాచార్య – 108 దివ్యదేశాల నాల్గవ బ్రహ్మోత్సవాలకు అందరూ ఆహ్వానితులే. సకల జనులకు ప్రేమపూర్వక శుభ స్వాగతం!!

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..