పాకిస్తాన్లో బయటపడిన 13 వందల ఏళ్ల నాటి మహావిష్ణువు ఆలయం
పాకిస్తాన్లో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాలలో 13 వందల ఏళ్ల నాటి పురాతన హిందూ దేవాలయం బయటపడింది.. వాయువ్య పాకిస్తాన్లోని స్వాట్ జిల్లాలో బరీకోట్ ఘుండాయ్ దగ్గర గత కొన్ని రోజులుగా పాకిస్తాన్, ఇటలీకి చెందిన పురావస్తుశాఖ పరిశోధకులు తవ్వకాలు జరుపుతున్నారు.
పాకిస్తాన్లో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాలలో 13 వందల ఏళ్ల నాటి పురాతన హిందూ దేవాలయం బయటపడింది.. వాయువ్య పాకిస్తాన్లోని స్వాట్ జిల్లాలో బరీకోట్ ఘుండాయ్ దగ్గర గత కొన్ని రోజులుగా పాకిస్తాన్, ఇటలీకి చెందిన పురావస్తుశాఖ పరిశోధకులు తవ్వకాలు జరుపుతున్నారు. ఆ తవ్వకాలలో ఇవాళ ఓ పురాతన ఆలయం బయటపడింది.. ఇది మహావిష్ణువు ఆలయం అని ఖైబర్ ఫక్తుంక్వా పురావస్తు శాఖకు చెందిన ఫజల్ ఖాలిక్ అనే అధికారి తెలిపారు. 13 వందల ఏళ్ల కిందట ఈ ప్రాంతాన్ని హిందూ షాహీస్ అనే వంశస్తులు పరిపాలించారు.. వీరినే కాబూల్ షాహీస్ అని కూడా అంటారు.. క్రీస్తుశకం 850 -1026 మధ్యలో హిందూ షాహీస్ వంశస్తులు కాబూల్ లోయ, గాంధారా ప్రాంతాలను పాలించారు.. వీరు కట్టించిన ఆలయమే తవ్వకాలలో వెలుగులోకి వచ్చింది.. ఆలయ పరిసరాలలో సైనికస్థావరాల అవశేషాలను, కోట బురుజును కూడా అధికారులు కనుగొన్నారు. అలాగే ఓ పెద్ద కోనేరు కూడా వెలుగులోకి వచ్చింది.. భగవంతుడి దర్శనానికి ముందు ఈ కోనేరులో భక్తులు స్నానమాచరించేవారు. స్వాట్ జిల్లాలో వెయ్యేళ్ల కిందటి పురావస్తు ప్రదేశాలు అనేకం ఉన్నాయి. అయితే హిందూ షాహీస్ నాటి జాడలు కనిపించడం మాత్రం ఇదే ప్రథమం. గాంధార నాగరికతకు చెందిన ఆలయం వెలుగులోకి రావడం ఇదే తొలిసారి అని ఇటలీ పురావస్తు శాఖ అధినేత డాక్టర్ లుకా గాంధా అన్నారు. స్వాట్ జిల్లాలో అనేక బౌద్ధ ఆరామాలు కూడా బయటపడ్డాయి..