
కోట్లాది హిందువుల కల గత ఐదు శతాబ్దాల పోరాటాల ఫలితంగా రామ జన్మభూమి ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. సరయు తీరంలో రూపుదిద్దుకుంటున్న శ్రీరామ జన్మభూమి లో భవ్య శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాన గర్భాలయం ప్రాణప్రతిష్ఠ మహోత్సవాల్లో భాగంగా ఒక్కొక్క ఘట్టం ఆవిష్కరణ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈనెల 5న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీరామ అక్షింతల పూజా కార్యక్రమం జరుగుతుంది.
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో పూజా కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఆ అక్షింతలను ప్రతి రాష్ట్రం నుంచి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనబోతున్న ఇద్దరు ప్రతినిధులకు ఇవ్వనున్నారు. శ్రీ రామ అక్షింతలు అందుకున్న తర్వాత తెలంగాణా రాష్ట్ర శ్రీరామ జన్మభూమి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ సమితి ప్రతి నిధులు 6వ తేదీ సోమవారం ఉదయం 10:30 గం. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్నారు.
రామయ్య అక్షింతలు భాగ్యనగరానికి చేరుకున్న తర్వాత ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్షతలు స్వాగతం పలికేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు శోభాయాత్రగా వెళ్లనున్నారు. అక్కడ నుంచి ప్రత్యేక వాహనంలో RCI రోడ్, బడంగ్పేట్, అల్మాస్ గూడ, మీర్ పేట్, జిల్లెలగూడ మీదుగా అక్షతలను తీసుకుని వచ్చి కర్మన్ఘాట్ హనుమాన్ దేవాలయంలో స్వామిజీల సమక్షంలో హనుమాన్ సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
భవ్య రామ మందిరం ప్రారంభోత్సవం జనవరి 22 న జరగనున్న నేపథ్యంలో కొత్త సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి 15 వరకూ దేశ వ్యాప్తంగా జన జాగరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ జనజాగరణ కార్యక్రమంలో దేశంలోని ఇంటికి శ్రీరాముని అక్షింతలు, శ్రీరాముని చిత్రపటం తో పాటు స్వామివారి గర్భాలయంలో రామయ్య విగ్రహ ప్రాణప్రతిష్ఠ రోజున ప్రతి హిందూ కుటుంబం నిర్వహించాల్సిన కార్యక్రమాల వివరాలతో కూడిన ఒక పత్రాన్ని ఇవ్వనున్నారు.
జనవరి 22న గర్భాలయంలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట నిర్వహించనున్నారు. ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్న సమయంలో ప్రతి కుటుంబం వివిధ మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వీక్షించే అవకాశాన్ని కల్పిస్తోంది. అనంతరం జన జాగరణ కార్యక్రమంలో ఇచ్చిన శ్రీరామ అక్షింతలు నెత్తిపై చల్లుకొని స్వామి వారి ఆశీర్వాదం తీసుకోవాలని ట్రస్ట్ సూచిస్తోంది. అంతేకాదు ప్రాణ ప్రతిష్ట జరిగిన రోజు రాత్రి ప్రతి ఇంటి ముందర 5 దీపాలను వెలిగించి పండుగ చేసుకోవాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఇప్పటికే పిలుపు నిచ్చింది.
శ్రీరామ అక్షింతలు భాగ్యనగరానికి 6వ తేదీ సోమవారం చేరనున్నాయి. ఈ సమాచారం విస్తృతంగా చేరడంతో ఈ నేపథ్యంలో రాములోరి అక్షింతలకు స్వాగతం పలకడానికి నగరం సిద్ధమవుతుంది. అంతేకాదు ఈ సమాచారం ప్రతి ఒక్కరికీ తెలియజేయాలని కోరుతున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.