Venkata Narayana |
Updated on: Apr 02, 2021 | 8:14 PM
తైవాన్లో ఒక సొరంగం లోపల ప్రయాణికుల రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య తాజా సమాచారం ప్రకారం 51కి చేరింది.
మరో 146 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. అంతేకాదు, ఇంకా 200 మంది వరకూ రైలులో చిక్కుకునిపోయి ఉంటారని అంచానా వేస్తున్నారు. ప్రమాదానికి గురైన ఈ రైలులో సుమారు 500 మంది ప్రయాణిస్తున్నారు.
సొరంగ ప్రవేశం దగ్గర పట్టాల మీద జారిపడిన ఒక నిర్మాణ రంగ వాహనాన్నిఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ రైలులో మొత్తం 8 బోగీలు ఉన్నాయి.
తైవాన్ రాజధాని తైపై నుంచి తైతుంగ్ కి ప్రయాణిస్తున్న ఈ రైలులో వారాంతం సెలవుల కోసం ప్రయాణిస్తున్న ప్రయాణీకులు ఉన్నారు. రైలు కిక్కిరిసి ఉండటంతో చాలా మంది ప్రయాణీకులు రైలులో నిలబడే ఉన్నారు.
రైలు వెనక భాగంలో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయట పడగలిగారు. రైలు ముందు భాగంలో ఉన్న 4 బోగీల నుంచి దాదాపు 100 మందిని రక్షించారు. ఈ ప్రమాదం స్థానిక కాలమానం ప్రకారం పొద్దున 9 గంటలకు జరిగింది. తైవాన్లో 2018 లో జరిగిన భారీ రైలు ప్రమాదంలో 18 మంది మరణించారు. 1991లో రెండు రైళ్లు ఢీకొని 30 మంది ప్రయాణికులు మరణించగా, 112 మంది గాయపడ్డారు.