Manipur Violence: మణిపుర్లో ఆగని ఉద్రిక్తతలు.. స్కూల్లు తెరిచిన మరుసటి రోజే కాల్పులు
మణిపూపుర్లో చెలరేగిన ఉద్రిక్తత పరిస్థితులు ఇంకా చల్లారడం లేదు. తాజాగా ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని ఓ పాఠశాల బయట దుండగుడు ఓ మహిళను కాల్చి చంపడం కలకలం రేపింది. శిశు నిష్తా నికేతన్ స్కూల్ బయట ఈ దుర్ఘటన జరిగింది. పాఠశాలలు తెరిచిన మరుసటి రోజే ఈ హత్య జరగడం ఆందోళన కలిగిస్తోంది.
Updated on: Jul 06, 2023 | 6:30 PM

మణిపూపుర్లో చెలరేగిన ఉద్రిక్తత పరిస్థితులు ఇంకా చల్లారడం లేదు. తాజాగా ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని ఓ పాఠశాల బయట దుండగుడు ఓ మహిళను కాల్చి చంపడం కలకలం రేపింది. శిశు నిష్తా నికేతన్ స్కూల్ బయట ఈ దుర్ఘటన జరిగింది. పాఠశాలలు తెరిచిన మరుసటి రోజే ఈ హత్య జరగడం ఆందోళన కలిగిస్తోంది.

గత రెండు నెలలుగా మణిపుర్లో అల్లర్లు జరుగుతున్న కారణంగా అక్కడ విద్యాసంస్థలు మూతపడ్డాయి. అయితే జులై 5 వ తేదీన ఆ రాష్ట్రంలో పాఠశాలలు తెరిచారు. అల్లర్ల భయంతో మొదటి రోజున తక్కువ విద్యార్థులే వచ్చారు. ఇప్పుడు పాఠశాల బయట మహిళను చంపడం ప్రజల్లో మరింత గుబులు మొదలైంది.

అలాగే బుధవారం రోజున థౌబల్ జిల్లాలో ఇండియన్ రిజర్వ్ బెటాలియన్లో పనిచేసే ఓ జవాను ఇంటిని అల్లరి మూకలు దహనం చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన ఆయుధశాల నుంచి తుపాకులు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నిస్తే దాన్ని అడ్డుకున్నందుకే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

మణిపుర్లో ఉద్రిక్తతలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఇంటర్నేట్ సేవలు కూడా నిలిపివేశారు. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తు పలువురు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. కానీ ఈ పిటీషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అలాగే సేవలు నిలిపివేసిన దానికి సంబంధించి మణిపుర్ హైకోర్టు ఇంతకుముందే విచారణ జరిపింది.

అయితే ఇంటర్నెట్ సేవలు మళ్లీ పునరుద్ధరించాలా లేదా అనే దానిపై కూడా నిపుణుల కమిటీ వేసింది. కానీ వ్యవహారం ఇంకా పెండింగ్లోనే ఉంది. దీంతో ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తెలిపింది. మణిపుర్ హైకోర్టులోనే స్వతంత్ర పిటిషన్ను దాఖలు చేయవచ్చని పిటిషనర్కు సూచించింది.




