Balaraju Goud |
Updated on: Jan 29, 2022 | 1:26 PM
ఏపీలో పీఆర్సీ వివాదం కొనసాగుతూనే ఉంది. మంత్రుల కమిటీతో చర్చలు జరిపేందుకు ఉద్యోగ సంఘాల నేతలు ముందుకు రాకపోవడంతో అటు మంత్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇటు ఉద్యోగులు మాత్రం వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు.
తాజాగా నేటి నుంచి ఆర్టీసీ కార్మికులు నిరాహార దీక్షలు చేస్తున్నారు. పీఆర్సీపై ఉద్యోగుల సమ్మెకు ఆర్టీసీ కార్మికులు మద్దతు ప్రకటించారు. ఫిబ్రవరి 3న చేపట్టిన ఛలో విజయవాడకు ఆర్టీసీ కార్మికులు మద్దతు ప్రకటించారు.
అటు ఉద్యోగులతో చర్చలు జరిపేందుకు మంత్రుల కమిటీ ప్రయత్నిస్తున్నా, ఎవరూ రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజుల పాటు మంత్రుల కమిటీ సమావేశమైనా ఉద్యోగ సంఘాల నేతలు రావడం లేదు. ఇకపై ఎదురు చూపులు ఉండవని, వాళ్లు వస్తేనే చర్చలని స్పష్టం చేసింది మంత్రుల కమిటీ. చట్టం తన పని తాను చేసుకుపోతుందని హెచ్చరించారు మంత్రి బొత్స .
మరోవైపు ఉద్యోగుల సమ్మె నోటీస్ను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సమ్మె నోటీసును రాజ్యాంగ, చట్ట విరుద్ధమని ప్రకటించాలని పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్ట్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె సర్వీసు నిబంధనలకు విరుద్ధమని పిటిషన్ పేర్కొన్నారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. విశాఖకు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ ఎన్ సాంబశివరావు ఈ పిటిషన్ దాఖలు చేశారు.