Electric Scooters: దేశంలో తొలిసారిగా ఈ-స్కూటర్ల రీకాల్.. వాహనాలను వెనక్కి రప్పించనున్న కంపెనీ
Electric Scooters: పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. అత్యాధునిక ఫీచర్స్తో ఎలక్ట్రిక్ స్కూటర్స్ (Electric Scooters)అందుబాటులోకి వస్తున్నాయి..
Updated on: Apr 17, 2022 | 1:48 PM

Electric Scooters: పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. అత్యాధునిక ఫీచర్స్తో ఎలక్ట్రిక్ స్కూటర్స్ (Electric Scooters)అందుబాటులోకి వస్తున్నాయి. ఇక కొన్ని కంపెనీలకు చెందిన స్కూటర్లలో పలు సమస్యలు ఉండటంతో రీ-కాల్ చేస్తున్నాయి.

తాజాగా ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఒకినావా ఆటోటెక్.. ప్రెయిజ్ ప్రో మోడల్కు చెందిన 3,215 యూనిట్ల వాహనాలను తక్షణమే రీకాల్ చేస్తున్నట్లు శనివారం ప్రకటించింది.

వాటి బ్యాటరీల్లో ఏదైనా సమస్యలున్నాయా అని పరీక్షించి, పరిష్కరించేందుకే వెనక్కి రప్పిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. దేశంలో ఎలక్ట్రిక్ వెహికిల్ కంపెనీ తన వాహనాలను రీకాల్ చేయడం ఇదే తొలిసారి.

ఈ మధ్యకాలంలో పలు చోట్ల విద్యుత్ ద్విచక్ర వాహనాల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన సంఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఒకినావా తన వాహనాలను వెనక్కి రప్పించింది.

పుణెలో ఓలా ఈ-స్కూటర్ కాలిపోయిన ఉదంతంపై గతనెలలో కేంద్ర సర్కార్ దర్యాప్తునకు ఆదేశించింది. వాహనాలను వెనక్కి రప్పించేందుకు డీలర్లతో సంప్రదింపులు జరుపుతున్నామని.. కస్టమర్ల వెసులుబాటుకు అనుగుణంగా వాహనాన్ని వెనక్కి రప్పించి బ్యాటరీలో లోపాలేమైనా ఉన్నాయని పరీక్షించి, ఉచితంగా మరమ్మతులు చేసి ఇవ్వనున్నట్లు ఒకినావా వెల్లడించింది.




