Dangerous Food: పప్పు కూరతో క్యాన్సర్ ప్రమాదం.. ఆరోగ్య నిపుణుల హెచ్చరిక
కొందరు వ్యాపారులు అధిక లాభాలకు కక్కుర్తిపడి రసాయన రంగులు కలిపిన పప్పులను కందిపప్పులో కలుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో పప్పులు చూసేందుకు ఆకర్షణీయంగా కనిపిస్తాయని, వీటిని వినియోగదారులు కొనేందుకు అధికంగా ఇష్టపడుతున్నారని తాజా పరిశోధనలో తేలింది. కానీ ఇలా రసాయనాలు కలిపిన పప్పును తీసుకోవడం వల్ల ..
Updated on: Mar 17, 2025 | 1:43 PM

భోజన ప్రియులకు ఆహార శాఖ అధికారులు షాకింగ్ న్యూస్ చెప్పారు. కొందరు వ్యాపారులు అధిక లాభాలకు కక్కుర్తిపడి రసాయన రంగులు కలిపిన పప్పులను కందిపప్పులో కలుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో పప్పులు చూసేందుకు ఆకర్షణీయంగా కనిపిస్తాయని, వీటిని వినియోగదారులు కొనేందుకు అధికంగా ఇష్టపడుతున్నారని తాజా పరిశోధనలో తేలింది. కానీ ఇలా రసాయనాలు కలిపిన పప్పును తీసుకోవడం వల్ల పక్షవాతం, వైకల్యం, క్యాన్సర్కు దారితీసే తీవ్రమైన నాడీ సంబంధిత సమస్యలు వస్తాయని అధికారులు హెచ్చరించారు.

అలాగే ఆకారంలో అచ్చంగా కందిపప్పును పోలిన పప్పులు కలుపు మొక్కలకు కాస్తాయి. ఇవి ఎక్కువగా అడవుల్లో దొరుకుతాయి. ఇలాంటి పప్పులను సేకరించి కందిపప్పులో కలుపుతున్నారని అధికారుల పరిశోధనలో తేలింది. ఇవి విషపూరిత అంశాలతో నిండి ఉంటాయని, వీటిని తినడం ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మహారాష్ట్రలోని కొండ ప్రాంతాలలో ఈ విధమైన కలుపుమొక్కలు ఎక్కువగా కనిపిస్తాయి. వీటి గింజనలు ఆహారంలో తరచూ తీసుకోవడం వల్ల నీరసానికి గురవుతారు. రెండు కాళ్ల నరాలు, కండరాలలో కోలుకోలేని లోపాలు సంభవిస్తాయి. దీంతో శాశ్వత వైకల్యం వచ్చే అవకాశం ఉంది. దీని దుష్ప్రభావాలు పెరిగితే, పక్షవాతానికి కూడా కారణమవుతుందని వైద్యులు చెప్పారు.

అలాగే తేనె ఉత్పత్తిలో కూడా దారుణంగా కల్తీ చేస్తున్నారు. తేనెలో రసాయన రంగులు వాడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. అందువల్ల రాష్ట్రవ్యాప్తంగా అమ్ముడవుతున్న వివిధ తేనె నమూనాలను పరీక్షించినట్లు ఆహార భద్రతా శాఖ అధికారులు తెలిపారు.

ఆహార శాఖ దాడుల్లో పేపర్ కప్పులను కూడా పరీక్షించింది. వాటి వాడకం క్యాన్సర్కు కారణమవుతుందని కనుగొంది. పేపర్ కప్పులలో 20 శాతం ప్లాస్టిక్ వాడుతున్నారని, దీని కారణంగా వాటిలో వేడి టీ లేదా కాఫీ పోస్తే ప్లాస్టిక్ కరిగిపోతుంది. కరిగిన ప్లాస్టిక్ మానవ శరీరంలోకి ప్రవేశిస్తే క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్లాస్టిక్ రహిత కప్పులను వాడాలని ఆరోగ్య శాఖ సూచనలు జారీ చేసింది.





























