Rain Effect: అగ్ర నేతల రాకకు వర్షం ఎఫెక్ట్.. అమిత్ షా, ప్రియాంక పర్యటనలు వాయిదా.. నిరాశలో రెండు పార్టీలు

వ్యూహప్రతివ్యూహాలతో ప్రత్యర్థులను దెబ్బకొట్టాలని ఉత్సాహ పడుతున్న తెలంగాణ రాజకీయ పార్టీల వేగానికి భారీ వర్షాలు కల్లెం వేశాయి.

Rain Effect: అగ్ర నేతల రాకకు వర్షం ఎఫెక్ట్.. అమిత్ షా, ప్రియాంక పర్యటనలు వాయిదా.. నిరాశలో రెండు పార్టీలు
Telangana Political Scene
Follow us

|

Updated on: Jul 27, 2023 | 8:10 PM

అసెంబ్లీ ఎన్నికల దిశగా శరవేగంతో అడుగులు వేయాలని, వ్యూహప్రతివ్యూహాలతో ప్రత్యర్థులను దెబ్బకొట్టాలని ఉత్సాహ పడుతున్న తెలంగాణ రాజకీయ పార్టీల వేగానికి భారీ వర్షాలు కల్లెం వేశాయి. జులై 25 తేదీ నుంచి తెలంగాణవ్యాప్తంగా దంచి కొడుతున్న వర్షాలు తాజాగా రాజకీయ పార్టీ కార్యకలాపాలపై ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా ముందుగా అనుకున్న షెడ్యూళ్ళను మార్చుకోవాల్సిన అవసరాన్ని పొలిటికల్ పార్టీలకు ప్రకృతి కల్పించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనాలు ఓ వైపు, చురుకుగా కదులుతున్న నైరుతీ రుతుపవనాలు మరోవైపు తెలుగు రాష్ట్రాలతోపాటు చాలా రాష్ట్రాలలో కుంభవృష్టి వర్షాలకు కారణమవుతున్నాయి. తెలంగాణలో అయితే కొన్ని ప్రాంతాల్లో ఏడాది మొత్తం మీద కురవాల్సిన వర్షపాతం ఒకటి, రెండ్రోజుల్లోనే నమోదైన పరిస్థితి. నిజామాబాద్ జిల్లా వేల్పూరులో ఏకంగా 46 సెంటీమీటర్ల వర్షపాతం 24 గంటల వ్యవధిలో నమోదైంది. తాజాగా ములుగు జిల్లా వెంకటాపూర్‌ ఏరియాలో 24 గంటల వ్యవధిలో ఏకంగా 65 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జులై 25 నుంచి 28వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. వారి హెచ్చరికకు అనుగుణంగానే చాలా జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురిశాయి. తాజాగా జులై 28వ తేదీతో వర్షాలకు బ్రేక్ పడుతుందని తెలుస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలను వాయిదా వేసుకోవడం ప్రారంభించాయి.

అమిత్ షా రాక వాయిదా

తెలంగాణలో అధికార పార్టీ బీఆర్ఎస్ తామంటే తాము ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు జులై నెలాఖరులో కీలక అగ్రనేతల పర్యటనలను ఖరారు చేసుకున్నారు. జులై 29న కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనను ముందుగా ఖమ్మంలో అనుకున్న బీజేపీ నేతలు ఆ తర్వాత పార్టీ రాష్ట్ర యంత్రాంగాన్ని అసెంబ్లీ ఎన్నికలకు సిద్దం చేయాలన్న వ్యూహంతో అమిత్ షా పర్యటనను హైదరాబాద్‌కు పరిమితం చేయాలని నిర్ణయించారు. ఒకరోజు పర్యటనలో అమిత్ షా .. పూర్తిస్థాయిలో రాష్ట్ర యంత్రాంగానికి దిశానిర్దేశం చేయాలనే విధంగా కార్యక్రమాలను రూపొందించారు. ముందుగా రాష్ట్ర నేతలో భేటీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత బీజేపీ అనుబంధ మోర్చాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. పర్యటన ముగింపులో భాగంగా కీలక నేతలతో ప్రత్యేకంగా సమావేశం కూడా ప్లాన్ చేశారు. అయితే తెలంగాణ బీజేపీ నేతల ఈ ప్రయత్నాలకు భారీ వర్షాలు బ్రేక్ వేశాయి. తాజాగా అమిత్ షా పర్యటన నిరవధికంగా వాయిదా పడినట్లు టీ.బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలను ఆదుకునే కార్యక్రమాలు చేపట్టాలని అమిత్ షా ఆదేశించారని, సహాయ చర్యలకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని షా చెప్పారని కిషన్ రెడ్డి తెలిపారు. ‘‘ తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న వరదల పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మాట్లాడారు.. తెలంగాణ ప్రజలను సురక్షితంగా కాపాడేందుకు రెస్క్యూ, రిలీఫ్ పనులలో సాధ్యమైన అన్ని సహాయాన్ని అందజేస్తామని హామీ ఇచ్చారు.. ప్రస్తుతం రెండుహెలికాప్టర్లు సేవలు అందిస్తున్నాయి.. అయిదు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రెస్క్యూ ఆపరేషన్ పనుల కోసం మోహరించారు.. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి..’’ అని కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.

ప్రియాంక రాక ఎప్పుడో?

ఇక మొన్నీమధ్యే రాహుల్ గాంధీ పర్యటన తర్వాత కదనోత్సాహంతో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా తాము నిర్దేశించుకున్న ప్రియాంక గాంధీ వధేరా పర్యటనను వాయిదా వేశారు. జులై 30న ప్రియాంక కొల్లాపూర్‌లో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు హాజరవ్వాల్సి వుంది. చాలా కాలంగా కాచుకుని కూర్చున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ కండువా కప్పుకునే ఉద్దేశంతో కొల్లాపూర్ బహిరంగ సభను టీ.కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేశారు. అదే సభలో మహిళా డిక్లరేషన్ పేరిట వచ్చే అసెంబ్లీ ఎన్నికలల్లో తమను గెలిపిస్తే మహిళల కోసం ఏం చేస్తామనే హామీలను గుప్పించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ తాజాగా ప్రియాంక గాంధీ పర్యటన వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అయిదు రోజుల పాటు కురిసిన వర్షాల కారణంగా తెలంగాణ ప్రజానీకం ఇబ్బందుల్లో పడ్డారని, చాలా ప్రాంతాల్లో కనీసం వారం రోజుల పాటు సహాయ చర్యలు నిర్వహించాల్సి వుంటుందని అందుకే ప్రియాంక పర్యటనను వాయిదా వేశామని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ప్రకటించారు. ‘‘ ప్రియాంక గాంధీ కొల్లాపూర్ సభను వాయిదా వేశాం.. మరో తేదీని త్వరలో ప్రకటిస్తాం.. భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఉన్నారు ’’ అని మల్లు రవి వివరించారు. మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోపాటు జూపల్లి కృష్ణారావు కూడా కాంగ్రెస్ పార్టీలో ఖమ్మంలో నిర్వహించిన రాహుల్ గాంధీ సభలోనే చేరాల్సి వుండింది. కానీ, తన సొంత బలం చాటుకునేలా కొల్లాపూర్‌లో సభ నిర్వహించాలని, పొంగులేటి రాహుల్ సమక్షంలో పార్టీలో చేరితే.. తాను ప్రియాంక సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని జూపల్లి భావించారు. దానికోసం ప్రియాంక సమయమిచ్చే దాకా వెయిట్ చేశారు. ముందుగా జులై 20వ తేదీన కొల్లాపూర్ సభ నిర్వహణకు ప్లాన్ చేశారు. కానీ ఆ తేదీ దగ్గరపడుతున్నా ప్రియాంక రాక కన్ఫర్మ్ కాకపోవడంతో జూపల్లి ఒకింత కలవరపడినా.. చివరికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జోక్యంతో ప్రియాంక రాకకు తేదీ ఖరారు చేశారు. జులై 30న ఆమె వస్తారని, ఆమె సమక్షంలో జూపల్లి పార్టీలో చేరతారని ప్రకటించారు. అయితే.. ఈ ఏర్పాట్లకిపుడు భారీ వర్షాలు గండి కొట్టాయనే భావించారు. అటు అమిత్ షా పర్యటన వాయిదాతో టీ.బీజేపీ, ఇటు ప్రియాంక రాక వాయిదాతో టీ.కాంగ్రెస్ నేతలు కాస్త నిరాశలో పడినట్లయ్యింది.