నకిలీ పత్రాలతో పోలీసులకే భూమిని అమ్మిన బీజేపీ నేత.. ఎలా బయట పడిందంటే!

UP BJP Leader Dupes Police: నకిలీ పత్రాలను సృష్టించి కోట్ల విలువ చేసే భూమిని పోలీసులకు అమ్మాలని చూశాడు ఓ బీజేపీ నేత.

నకిలీ పత్రాలతో పోలీసులకే భూమిని అమ్మిన బీజేపీ నేత.. ఎలా బయట పడిందంటే!
Up Police
Follow us

|

Updated on: Mar 28, 2023 | 3:27 PM

నకిలీ పత్రాలను సృష్టించి కోట్ల విలువ చేసే భూమిని పోలీసులకు అమ్మాలని చూశాడు ఓ బీజేపీ నేత. పోలీస్ లైన్ నిర్మాణం కోసం నకిలీ పత్రాల సాయంతో రూ.2 కోట్లకు భూమిని పోలీసులకు విక్రయించాడు. అదే భూమిపై ఇప్పటికే రూ.78 లక్షల రుణం తీసుకున్నారు. ఎట్టకేలకు అసలు వ్యవహారం బయటపడటంతో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఆమేథీలో వెలుగు చూసింది.

బిజెపి నాయకుడు ఓంప్రకాష్ అలియాస్ ప్రకాష్ మిశ్రా ఫోర్జరీకి పాల్పడ్డాడని, అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ ఎలమారన్‌ తెలిపారు. నిందితుడు తన భూమిని తనఖా పెట్టి బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రుణం తీసుకున్నాడని ఎస్పీ తెలిపారు. అయితే నకిలీ పత్రాల ద్వారా పోలీస్ లైన్ల నిర్మాణానికి భూమిని విక్రయించినట్లు వెల్లడించారు.

జూలై 27, 2017న, మిశ్రా సదర్ తహసీల్ గౌరీగంజ్‌ పరిధిలోని చౌహాన్‌పూర్ గ్రామంలోని తన 0.253 చదరపు మీటర్ల స్థలం సేల్ డీడ్‌ చేశారు. విక్రయించే ముందు తన భూమిని తనఖా పెట్టి బ్యాంకులో రూ.78 లక్షల రుణం తీసుకున్నాడు. సేల్ డీడ్‌ చేసిన తర్వాత అమేథీ పోలీసులకు అదే భూమిని విక్రయించాడు. ఇందుకు గానూ రూ.1.97 కోట్లను ఒప్పందం మేరకు నగదును కూడా పొందాడు. అంతేకాదు రిజిస్ట్రీ సమయంలో ప్రకాష్.. దానిపై ఏదైనా రుణం లేదా బకాయిలు ఉన్నాయా అనే దానిపై ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అయితే జనవరి 3, 2023న అలహాబాద్‌లోని డెబ్ట్స్ రికవరీ ట్రిబ్యునల్‌లోని రికవరీ అధికారి స్థల సేకరణకు నోటీసు పంపారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.

అమేథీలోని పోలీస్ లైన్స్‌లో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మార్చి 24న మిశ్రాపై కేసు నమోదు చేశారు. సెక్షన్‌లు 409, 419, 420, 467, 468, 471 కింద ప్రకాష్ మిశ్రాపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఇదే ఆంశానికి సంబంధించి అమేథీ జిల్లా బీజేపీ చీఫ్ దుర్గేష్ త్రిపాఠిని స్పందిస్తూ.. మిశ్రా పార్టీ కార్యకర్త అని, అతనిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుంటుందని, దోషిగా తేలితే మిశ్రాపై చర్యలు తీసుకోవాలని త్రిపాఠి కోరారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..