శాంతి నెపంతో కొనసాగుతున్న మారణహోమం.. మూల్యం చెల్లించుకుంటున్న యావత్ ప్రపంచం..!

మనం.. (భారతీయులు మాత్రమే కాదు) కోరుకున్నది కాదు. అయినా సరే అందరం మూల్యం చెల్లించుకుంటున్నాం. 'కరోనా'ను మించిన ఒక విపత్కర సంక్షోభంలోకి మెల్లమెల్లగా అడుగుపెడుతున్నాం. గ్లోబలైజేషన్ కారణంగా ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా దాని ప్రభావం, పర్యవసానాలను యావత్ ప్రపంచం ఎదుర్కోవాల్సి వస్తోంది.

శాంతి నెపంతో కొనసాగుతున్న మారణహోమం.. మూల్యం చెల్లించుకుంటున్న యావత్ ప్రపంచం..!
Petrol Diesel Bunk Rush

Edited By:

Updated on: Mar 22, 2026 | 8:34 AM

మనం.. (భారతీయులు మాత్రమే కాదు) కోరుకున్నది కాదు. అయినా సరే అందరం మూల్యం చెల్లించుకుంటున్నాం. ‘కరోనా’ను మించిన ఒక విపత్కర సంక్షోభంలోకి మెల్లమెల్లగా అడుగుపెడుతున్నాం. గ్లోబలైజేషన్ కారణంగా ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా దాని ప్రభావం, పర్యవసానాలను యావత్ ప్రపంచం ఎదుర్కోవాల్సి వస్తోంది.

మొన్నటి ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా ప్రపంచ ‘గోధుమ పాత్ర’గా పేరుగాంచిన ఉక్రెయిన్ – రష్యా ప్రాంతం నుంచి ఆహారధాన్యాల ఉత్పత్తిపై ప్రభావం పడింది. గోధుమ దిగుమతులపై ఆధారపడ్డ ప్రపంచ దేశాలు ప్రభావితమయ్యాయి. రష్యాపై ఆంక్షలు విధించి.. ఆ దేశం నుంచి చమురు, సహజవాయువు దిగుమతులపై ఆధారపడ్డ యూరోపియన్ సమాజం ప్రభావితమైంది. ఈ సంక్షోభంలో వైద్య విద్య కోసం ఉక్రెయిన్ వెళ్లిన భారతీయులు ప్రభావితమయ్యారు. రష్యా నుంచి చవక ధరకు చమురు కొని భారతదేశం సంక్షోభంలో అవకాశాన్ని వెతుక్కుంది.

కానీ తాజా ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం సృష్టిస్తున్న సంక్షోభం ఎలాంటి అవకాశాన్ని సృష్టించే పరిస్థితి నాకైతే కనిపించడం లేదు. భారతదేశ అవసరాలు తీర్చే చమురులో 88% వరకు దిగుమతులపైనే ఆధారపడ్డ మన దేశం ఇప్పటికే గ్యాస్, పెట్రోలియం ఉత్పత్తుల కొరత ప్రభావాన్ని ఎదుర్కొంటోంది. వీటిపై ఆధారపడ్డ అనేక రంగాలు ఇప్పటికే ప్రభావితమయ్యాయి. కమర్షియల్ గ్యాస్ ఆధారిత పరిశ్రమలు మూతపడుతున్నాయి. ఆ పరిశ్రమలపై ఆధారపడ్డ కార్మికులు ఇంటి బాట (Reverse Migration) పట్టారు. సంక్షోభాన్ని కాసుల వేటగా మార్చుకునే కక్కుర్తితో బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ.. గ్యాస్ సిలిండర్లను 4-5 రెట్లు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఫలితంగా చిన్న చిన్న బడ్డీ కొట్ల నుంచి స్టార్ హోటళ్ల వరకు ప్రభావితమై.. యావత్ ఆతిథ్య రంగమే దెబ్బతింటోంది.

‘చమురు’ కొరత దాని ధరను పెంచుతుంది. ఇప్పటికే ఇరుగు పొరుగు ఆసియా దేశాల్లో వాటి ధరలు బాగా పెరిగిపోయాయి. భారత్‌లోనూ ‘పెంపు’ అనివార్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రీమియం పెట్రోల్, కమర్షియల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఇక సాధారణ పెట్రోల్, డీజిల్ ధరల పెంపు మాత్రమే మిగిలింది. ఈ ధరల పెరుగుదలతో సరకు రవాణా ధరలు పెరుగుతాయి. ఓవరాల్ ద్రవ్యోల్బణం పెరుగుతుంది. సామాన్యుడి ఆదాయం పెరగకపోగా.. దెబ్బతిన్న రంగాల్లో పనిచేస్తున్నవారైతే ఉపాధి కోల్పోవాల్సి వస్తుంది.

ప్రపంచ చమురు అవసరాలు తీర్చే గల్ఫ్ దేశాల్లోని చమురు, సహజవాయు క్షేత్రాలు దాడులకు గురవుతున్నాయి. ఒకవేళ యుద్ధం పూర్తిగా ఆగిపోయినా.. గల్ఫ్ దేశాల చమురు, సహజవాయువు ఉత్పత్తి సాధారణ స్థితికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. అంటే మనం దీర్ఘకాలిక ప్రభావానికి గురవ్వక తప్పదు అనిపిస్తోంది. ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసుకోవడం, పరిస్థితులకు తగినట్టు జాగ్రత్తపడడం (3 చేపల కథలో ‘సుమతి’లా.. లేదంటే కనీసం ‘కాలమతిలా వ్యవహరించడం) ఉత్తమం.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us