June 07, 2026
Subhash
హైదరాబాద్లో చికెన్ ధరలు గరిష్ట స్థాయిలోనే కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలలో డిమాండ్ను బట్టి ఒక కేజీ స్కిన్లెస్ చికెన్ ధర రూ. 280 నుండి రూ. 300 వరకు విక్రయిస్తున్నారు.
ప్రధాన మార్కెట్లు, ఇతర ఏరియాల్లో ఈ రేటు రూ. 300 తాకుతుండగా, సాధారణ రిటైల్ దుకాణాల్లో 280 రూపాయల వరకు పలుకుతోంది.
తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొంది. మార్కెట్లో కేజీ స్కిన్లెస్ చికెన్ ధర రూ. 280 గా స్థిరంగా కొనసాగుతోంది. కొన్ని ఏరియాలో 300పైగా విక్రయిస్తున్నారు.
వేసవి తీవ్రత తగ్గు ముఖం పడుతున్నప్పటికీ, కోళ్ల ఉత్పత్తి వ్యయం పెరగడం, అలాగే వారాంతపు డిమాండ్ కారణంగానే ధరలు ఈ స్థాయిలో ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
మరోవైపు ఏపీలో ధరలను చూసుకుంటే ప్రాంతాన్ని బట్టి చికెన్ ధరల్లో కాస్త ఊరట లభిస్తోంది. తక్కువగా బాపట్లలో కేజీ స్కిన్లెస్ చికెన్ ధర రూ. 220గా నమోదు కాగా, విశాఖపట్నంలో రూ.250.
దేశవ్యాప్తంగా కోళ్ల ఉత్పత్తిని 25 శాతం మేర తగ్గించాలని ఆలిండియా పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ (AIPBA) నిర్ణయించింది.
పెరిగిన మేత, రవాణా ఖర్చులు, అలాగే జులై నుంచి అక్టోబర్ వరకు పండుగల సీజన్లో చికెన్ వినియోగం తగ్గే అవకాశం ఉండటమే ఈ నిర్ణయానికి కారణమని AIPBA ఛైర్మన్ బహదూర్ అలీ తెలిపారు.
కోళ్ల దాణాలో కీలకమైన సోయాబీన్ మీల్ ధరలు 40 శాతానికి పైగా పెరగడంతో పౌల్ట్రీ రైతులపై ఆర్థిక భారం అధికమైందన్నారు. ఉత్పత్తి తగ్గితే మార్కెట్లో సరఫరా కూడా తగ్గే అవకాశం ఉంది.