AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gen Z Spiritual Tourism: పబ్స్, బీచ్‌లను వదిలి దేవాలయాల బాట.. జెన్ Zలో ఆధ్యాత్మిక యాత్రల క్రేజ్ ఎందుకు పెరుగుతోంది?

Gen Z Travel Trends: భారతదేశంలో ఆధ్యాత్మిక పర్యాటకం కొత్త ఊపందుకుంటోంది. రెడ్‌బస్ గణాంకాల ప్రకారం ఆధ్యాత్మిక యాత్రల్లో 53 శాతానికి పైగా జెన్ Z యువతే పాల్గొంటున్నారు. తిరుపతి, రిషికేశ్, వారణాసి వంటి పుణ్యక్షేత్రాలు యువతకు తొలి ఎంపికగా మారుతుండగా, విశ్వాసం-సంస్కృతి-అనుభవాల కలయికతో ఆధ్యాత్మిక పర్యాటకం వేగంగా విస్తరిస్తోంది.

Gen Z Spiritual Tourism: పబ్స్, బీచ్‌లను వదిలి దేవాలయాల బాట.. జెన్ Zలో ఆధ్యాత్మిక యాత్రల క్రేజ్ ఎందుకు పెరుగుతోంది?
Gen Z Spiritual Tourism
Rajashekher G
|

Updated on: Jun 08, 2026 | 4:30 PM

Share

Gen Z Travel Trends: భారతదేశంలో ఆధ్యాత్మిక పర్యాటకం కొత్త దశలోకి అడుగుపెడుతోంది. ఒకప్పుడు ప్రధానంగా పెద్దవారి యాత్రగా భావించిన తీర్థయాత్రలు ఇప్పుడు యువతను కూడా ఆకర్షిస్తున్నాయి. రెడ్‌బస్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, 2026 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక గమ్యస్థానాలకు జరిగిన ప్రయాణాల్లో 53 శాతానికి పైగా జెన్ Z, యువతరానిదే వాటా ఉండటం గమనార్హం. 2025తో పోలిస్తే ఈ సంఖ్య గణనీయంగా పెరగడం విశేషం.

ఈ మార్పు కేవలం ప్రయాణ ధోరణి మాత్రమే కాదు.. యువతలో చోటుచేసుకుంటున్న సాంస్కృతిక, ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకగా నిలుస్తోంది. బీచ్‌లు, పార్టీ హబ్‌లు, నైట్‌లైఫ్ గమ్యస్థానాల కంటే దేవాలయాలు, యోగా కేంద్రాలు, ధ్యాన క్షేత్రాల వైపు యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. వారు కేవలం దర్శనం కోసం కాకుండా, స్థానిక సంస్కృతిని అనుభవించడం, ఆధ్యాత్మిక ప్రశాంతతను పొందడం, జీవితానికి అర్థవంతమైన అనుభూతులను జోడించుకోవడం కోసం ఈ ప్రయాణాలను ఎంచుకుంటున్నారు.

యువ యాత్రికుల తొలి ఎంపికగా తిరుపతి

జెన్ Z తరానికి అత్యంత ఇష్టమైన ఆధ్యాత్మిక గమ్యస్థానంగా తిరుపతి నిలిచింది. ముఖ్యంగా బెంగళూరు–తిరుపతి మార్గం యువ యాత్రికులలో అత్యంత ప్రజాదరణ పొందిన రూట్‌గా అవతరించింది. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం కోసం లక్షలాది మంది యువకులు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. హైదరాబాద్–తిరుపతి మార్గం కూడా భారీ స్పందనను నమోదు చేసింది. దీంతో దక్షిణ భారతదేశ యువతలో తిరుపతి అత్యంత ప్రాధాన్యమైన పుణ్యక్షేత్రంగా నిలిచింది.

ఇవి కూడా చదవండి

యువతను ఆకర్షిస్తున్న ఇతర ఆధ్యాత్మిక కేంద్రాలు

తిరుపతి తర్వాత రిషికేశ్, తంజావూరు, వారణాసి(కాశీ), ఉజ్జయిని, నాందేడ్ వంటి ప్రాంతాలు యువ యాత్రికుల మన్ననలు పొందుతున్నాయి. ముఖ్యంగా యోగా, ధ్యానానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన రిషికేశ్‌కు వెళ్లిన వారిలో 59 శాతం మంది జెన్ Z యువతే కావడం విశేషం. మిలీనియల్స్‌ను కలుపుకుంటే దాదాపు మొత్తం సందర్శకుల్లో యువతరమే అధికంగా కనిపించింది.

అలాగే చెన్నై–తంజావూరు, ఇండోర్–ఉజ్జయిని మార్గాలు కూడా యువ ప్రయాణికుల ఆదరణను పొందాయి. ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయానికి 2025 డిసెంబర్ చివరి వారం నుంచి 2026 జనవరి ప్రారంభం వరకు 12 లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చారు.

దేశవ్యాప్తంగా పెరుగుతున్న భక్తి పర్యాటకం

వారణాసి, పూరీ, అమృత్‌సర్, హరిద్వార్ వంటి సంప్రదాయ ఆధ్యాత్మిక కేంద్రాలు కూడా యువతతో కిటకిటలాడుతున్నాయి. వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయానికి 2026 నూతన సంవత్సర రోజునే ఐదు లక్షల మందికి పైగా భక్తులు చేరుకోవడంతో క్యూలు మూడు కిలోమీటర్ల మేర విస్తరించాయి. మరోవైపు అయోధ్యలో రామ మందిర ప్రభావంతో సందర్శకుల సంఖ్య భారీగా పెరిగింది. పూరీ జగన్నాథ ధామ్‌లో కూడా యాత్రికుల రద్దీ రికార్డు స్థాయికి చేరుకుంది.

ఆధ్యాత్మిక పర్యాటకానికి ఉజ్వల భవిష్యత్తు

నిపుణుల అంచనాల ప్రకారం భారత ఆధ్యాత్మిక పర్యాటక రంగం 2033 నాటికి 4.6 బిలియన్ డాలర్ల మార్కెట్‌గా ఎదగనుంది. జెన్ Z తరం ఆధ్యాత్మిక యాత్రలను కేవలం భక్తి కార్యక్రమాలుగా కాకుండా, సంస్కృతి, ఆరోగ్యం, వ్యక్తిత్వ వికాసంతో ముడిపడిన అనుభవాలుగా చూస్తోంది. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, సోషల్ మీడియా, ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యాలు ఈ మార్పును మరింత వేగవంతం చేస్తున్నాయి.

సాంస్కృతిక పునరుజ్జీవనానికి ప్రతిబింబం

భారత యువతలో పెరుగుతున్న ఆధ్యాత్మిక యాత్రల ఆసక్తి ఒక కొత్త సాంస్కృతిక పునరుజ్జీవనానికి సంకేతంగా కనిపిస్తోంది. వినోదం, విలాసాలకు మాత్రమే పరిమితం కాకుండా విశ్వాసం, సంప్రదాయం, ఆత్మపరిశీలన, అర్థవంతమైన అనుభవాల కోసం యువత ముందడుగు వేస్తోంది. ఈ ధోరణి రాబోయే కాలంలో భారత ఆధ్యాత్మిక పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేసే అవకాశం కనిపిస్తోంది.

Follow Us