Lakhimpur Kheri: ఉత్తరప్రదేశ్ లో దారుణం.. ఇద్దరు అక్కా, చెల్లెళ్ల కిడ్నాప్.. ఆతర్వాత..

ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. ఇద్దరు అక్కా, చెల్లెళ్ల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించడం లఖింపూర్ ఖేరిలో కలకలం రేపింది. తమ పిల్లలను హత్యాచారం చేసి.. ఇలా చెట్టుకు వేలాడదీశారని..

Lakhimpur Kheri: ఉత్తరప్రదేశ్ లో దారుణం.. ఇద్దరు అక్కా, చెల్లెళ్ల కిడ్నాప్.. ఆతర్వాత..
Up Police

Updated on: Sep 15, 2022 | 9:56 AM

Lakhimpur Kheri: ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. ఇద్దరు అక్కా, చెల్లెళ్ల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించడం లఖింపూర్ ఖేరిలో కలకలం రేపింది. తమ పిల్లలను హత్యాచారం చేసి.. ఇలా చెట్టుకు వేలాడదీశారని బాలికల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. లఖింపూర్ ఖేరిలో ఓ దళిత కుటుంబం నివాసం ఉంటోంది. కొందరు గుర్తుతెలియనివ్యక్తులు బైకులపై వచ్చి తమ కుమార్తెలను కిడ్నాప్ చేశారని బాధితుల తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కిడ్నాప్ అయిన తమ కూతుళ్లు బుధవారం మధ్యాహ్నం చెట్టుకు ఉరివేసుకున్నట్లుగా వేలాడుతూ కనిపించారంటూ మృతుల తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. తన కూతుళ్లు ఇద్దరు మైనర్లని, వారిని కిడ్నాప్ చేసిన నిందితులు అత్యాచారం చేసి హత్య చేసి ఇలా చెట్టుకు వేలాడదీశారని ఆమె ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బాలికల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఈఘటనపై ప్రతిపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వ వైఫల్యమే ఈఘటనకు కారణమని ఆరోపిస్తున్నాయి. నిఘాసన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు దళిత అక్కా చెల్లెళ్లను కిడ్నాప్ చేసి, హత్య చేయడం దుర్మార్గమైన చర్య అని ఎస్పీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. లఖింపూర్‌లో గతంలో రైతుల దుర్ఘటన జరిగిన తర్వాత, ఇప్పుడు దళితులను చంపేశారంటూ ట్వీట్ చేశారు. ఈఘటనపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ట్విట్టర్ లో స్పందించారు. లఖింపూర్ లో ఇద్దరు అక్కాచెల్లెళ్లను చంపిన ఘటన హృదయ విదారకంగా ఉందన్నారు. ఆ బాలికలను పట్టపగలు కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యులు చెప్పారని, దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా లేవని ప్రియాంక ఆరోపించారు. గత ప్రభుత్వాలతో పోల్చితే ఉత్తరప్రదేశ్ లో మహిళలపై అత్యాచారాలు, హత్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని.. ప్రభుత్వం ఎప్పుడు మేల్కొంటుందని ప్రశ్నించారు. గతంలో రైతుల దుర్ఘటనతో వార్తలో నిలిచిన లఖింపూర్ ఖేరీ, అక్కా, చెల్లెల మృతితో మరోసారి వార్తలో నిలిచింది. అయితే ఈఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతామని ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి


మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..