‘అది పాలసీ నిర్ణయం’, కేరళ కొత్త కేబినెట్ లో చోటు దక్కని మాజీ మంత్రి కె.కె. శైలజ వ్యాఖ్య, దానికి కట్టుబడి ఉన్నానని స్పష్టీకరణ
కేరళ సీఎం పినరయి విజయన్ నేతృత్వంలో ఏర్పడబోయే కొత్త మంత్రివర్గంలో తనకు చోటు దక్కకపోవడంపై మాజీ ఆరోగ్య శాఖ మంత్రి కె.కె.శైలజ స్పందించారు. అది పాలసీ నిర్ణయమని, దాన్ని తాను..
కేరళ సీఎం పినరయి విజయన్ నేతృత్వంలో ఏర్పడబోయే కొత్త మంత్రివర్గంలో తనకు చోటు దక్కకపోవడంపై మాజీ ఆరోగ్య శాఖ మంత్రి కె.కె.శైలజ స్పందించారు. అది పాలసీ నిర్ణయమని, దాన్ని తాను అంగీకరిస్తున్నానని ఆమె చెప్పారు. ఇదివరకటి మంత్రులనందరినీ డ్రాప్ చేయాలని ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సీపీఎం నిర్ణయించింది. నూతన మంత్రివర్గంలో అన్నీ కొత్త ముఖాలే ఉంటాయి. అయితే శైలజ పార్టీ విప్ గా కొనసాగుతారు. నాకు ఈ నూతన మంత్రివర్గంలో స్థానం కల్పించరాదని పార్టీ తీసుకున్న పాలసీ నిర్ణయమని, దానికి నేను కూడా కట్టుబడి ఉంటానని శైలజ అన్నారు. నిజానికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని , పార్టీలో ఇంకా చాలామంది కార్యకర్తలు ఉన్నారని, వారికి కూడా అవకాశం ఇస్తే పార్టీకోసం కష్టపడతారని ఆమె పేర్కొన్నారు. తననే కాకుండా ఇతర పాత మంత్రులను కూడా నూతన కేబినెట్ లోకి తీసుకోలేదు కదా అని ఆమె వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లలో ఎన్నో సవాళ్లు, క్లిష్ట సమస్యలు ఎదుర్కొన్నానని, ఇందుకు గర్వ పడుతున్నానని శైలజ చెప్పారు.కోవిడ్, నిఫా వైరస్ వంటి పాండమిక్ లను సమర్థంగా అదుపు చేయగలిగానని అన్నారు.
శైలజను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడంపై సోషల్ మీడియాలో చాలామంది విమర్శలతో ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. అయితే అది ఎమోషనల్ అని ఆమె వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కూడా ఆమెను ప్రశంలతో ముంచెత్తారు. ఆరోగ్య శాఖ మంత్రిగా ఆమె ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించారని ఆయన ట్వీట్ చేశారు. గత సెప్టెంబరులో బ్రిటన్ లోని ఓ మ్యాగజైన్ శైలజను ‘టాప్ థింకర్ ఆఫ్ ది ఇయర్-2020’ గా అభివర్ణించింది.
మరిన్ని చదవండి ఇక్కడ: Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ఇంట్లో తీవ్ర విషాదం.. చివరి చూపు కూడా దక్కలేదంటూ ఎమోషనల్..