ఉరిశిక్ష కాకుండా తక్కువ నొప్పితో మరణశిక్ష అమలు చేయాలన్న సుప్రీంకోర్టు

నేరగాళ్లకు విధించే ఉరి శిక్ష అమలుపై సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉరిశిక్షకు బదులు తక్కువ నొప్పితో మరణం సంభవించే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని కేంద్రాన్ని ఆదేశించింది.

ఉరిశిక్ష కాకుండా తక్కువ నొప్పితో మరణశిక్ష అమలు చేయాలన్న సుప్రీంకోర్టు
Supreme Court Of India
Follow us

|

Updated on: Mar 22, 2023 | 6:32 AM

నేరగాళ్లకు విధించే ఉరి శిక్ష అమలుపై సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉరిశిక్షకు బదులు తక్కువ నొప్పితో మరణం సంభవించే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ప్రాణాలు పోయే వరకూ ఉరి తీసే పాత పద్ధతి స్థానంలో సులభంగా ఉండే ప్రత్యామ్నాయ ఆధునిక మార్గాల ఎంపికకు నిపుణుల కమిటీని నియమించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహాల ధర్మాసనం మంగళవారం సుముఖత వ్యక్తం చేసింది. కమిటీలో జాతీయ న్యాయ వర్సిటీలకు చెందిన నిపుణులు, ఎయిమ్స్‌ వైద్యులు, శాస్త్రవేత్తలు ఉంటే బాగుంటుందని తెలిపింది.

ఉరి చాలా బాధాకరమైన ముగింపు అన్న ధర్మాసనం… దీనికంటే తక్కువ బాధతో మరణ శిక్ష అమలు చేసేలా చర్చించాలని పేర్కొంది. ఇందుకు అవసరమైన సమాచారాన్ని సేకరించాలని కేంద్రానికి ఆదేశించింది. ఉరి శిక్ష పడిన ఖైదీలకు నొప్పి లేకుండా జీవితాన్ని ముగించే అవకాశమివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ మేరకు స్పందించింది. ఈ కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం.. ఉరిశిక్షకు ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చించింది. నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. తుపాకీతో కాల్చడం, ప్రాణాంతక ఇంజెక్షన్‌ ఇవ్వడం, విద్యుత్‌ కుర్చీ వంటి వాటిని పరిశీలించాలని కేంద్రానికి సూచించింది.

ఉరి శిక్ష చాలా క్రూరమైనదనన్న లా కమిషన్‌ నివేదికను పిటిషనర్‌ తరపు న్యాయవాది ధర్మాసనం ముందు చదివి వినిపించారు. ఆ అభిప్రాయంతో ఏకీభవించి సుప్రీం తమకు శాస్త్రీయ సమాచారం కావాలని తెలిపింది. ఉరి వల్ల కలిగే నొప్పి. బాధపై అధ్యయన సమాచారాన్ని ఇవ్వాలని అటార్నీ జనరల్‌ను కోరింది. అమెరికాలో మరణ శిక్ష అమలుచేసేందుకు ప్రాణాంతక ఇంజెక్షన్‌ ఇస్తున్నారని..అందులో ఏ రసాయనాన్ని వినియోగిస్తారనే దానిపైనా పరిశోధన చేయాలని జస్టిస్‌ నరసింహ సూచించారు. ప్రాణాంతకమైన ఇంజెక్షన్‌ ద్వారా శిక్ష అమలు కూడా బాధాకరమని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ అభిప్రాయపడ్డారు. తుపాకీతో కాల్చడం మానవ హక్కులను ఉల్లంఘించడమేనని తెలిపారు. ఉరి శిక్ష కాకుండా మరో పద్ధతిని అనుసరిస్తే రాజ్యాంగ విరుద్ధమవుతుందేమో చూడాలన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..