
రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలో గురువారం ఉదయం చోటుచేసుకున్న ఒక ఘోర ప్రమాదం యావత్ రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు కారులోనే సజీవ దహనమైన ఘటన శ్రీరాంపుర గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
శ్రీరాంపుర గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రామ్సింగ్ చౌదరి, తన తల్లి పూసీ దేవి (జిల్లా పరిషత్ సభ్యురాలు) హఠాత్తుగా ఛాతీ నొప్పితో బాధపడటంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. గురువారం (మే 28) తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో రామ్సింగ్ చౌదరి, తన భార్య సూర్యజన్ దేవి (మాజీ సర్పంచ్), మేనకోడలు మహిమతో కలిసి కారులో బయలుదేరారు.
గ్రామం దాటి కొద్ది దూరం వెళ్లగానే, రన్నింగ్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దురదృష్టవశాత్తూ కారు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ విఫలం కావడంతో డోర్లు తెరుచుకోక లోపల ఉన్నవారు బందీలుగా మారిపోయారు. చూస్తుండగానే మంటలు కారు మొత్తాన్ని చుట్టుముట్టాయి. కారు డోర్లు తీయడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. రామ్సింగ్ చౌదరి, సూర్యజన్ దేవి, మహిమలు మంటల్లో చిక్కుకుని కారులోనే ప్రాణాలు విడిచారు. రామ్సింగ్ తల్లి పూసీ దేవిని అతికష్టమ్మీద వాహనం నుండి బయటకు తీసినప్పటికీ, అప్పటికే ఆమె శరీరం 60 శాతానికి పైగా కాలిపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కూడా తుదిశ్వాస విడిచారు.
సమాచారం అందుకున్న బోరాడా పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కారులో మంటలు చెలరేగడానికి షార్ట్ సర్క్యూట్ కారణమా లేక గ్యాస్ లీకేజీ ఏమైనా జరిగిందా అనే కోణంలో ఫోరెన్సిక్ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి.
ఒకే కుటుంబంలో కీలక బాధ్యతలు నిర్వహించిన నలుగురు వ్యక్తులు ఇలా అకాల మరణం చెందడంతో శ్రీరాంపుర గ్రామంలో నీలినీడలు ముసురుకున్నాయి. రాజకీయంగా, సామాజికంగా చురుగ్గా ఉండే ఈ కుటుంబం అంతం కావడం స్థానికులను కంటతడి పెట్టించింది. రహదారి భద్రత మరియు వాహనాల నిర్వహణపై ఈ ఘటన మరోసారి హెచ్చరికగా నిలిచింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..