పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై భారత్ కన్నెర్ర.. ఆ దేశ ప్రధాని యూట్యూబ్ ఛానల్ బ్యాన్
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో భారత్ కన్నెర్ర చేస్తోంది. పాక్ను అన్ని విధాలా దెబ్బతీయడమే లక్ష్యంగా వ్యహప్రతివ్యూహాలు అమలు చేస్తోంది. ఆ దేశ సెలబ్రిటీస్ సోషల్ మీడియా అకౌంట్స్పైనా ఉక్కుపాదం మోపుతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. అదేంటంటే వివరాలు ఇవిగో

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోంది. పాక్కు వ్యతిరేకంగా పలు చర్యలు చేపడుతోంది. పాక్ సంబంధాలకు కటీఫ్ చెప్పేస్తోంది. కీలక నిర్ణయాలతో పాకిస్తాన్ దారులన్నీ మూసివేసే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పుడు ఏకంగా ఆ దేశ సెలబ్రిటీలకు సైతం ఊహించని షాకిస్తోంది. పాక్ సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్లపై వేటు అస్త్రం ప్రయోగిస్తోంది. ఈ క్రమంలోనే.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ యూట్యూబ్ ఛానల్ స్ట్రీమింగ్ను భారత్లో నిలిపివేసింది. జాతీయ భద్రతకు సంబంధించిన ఆదేశాలతో ఆయా సెలబ్రిటీల కంటెంట్ ప్రస్తుతం దేశంలో అందుబాటులో లేదని ఆ ఛానల్ క్లిక్ చేసిన వారికి ఒక సందేశం ఇస్తోంది. ఉద్రిక్తతలు భగ్గుమంటోన్న వేళ.. ఇప్పటికే పాకిస్తాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలు, ఆయా ఖాతాలను భారత్లో నిలిపివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
పాక్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మీడియాకు చెందిన పలు ఛానళ్లపై వేటు పడింది. పాక్ మాజీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, బాసిత్ అలీ, షాహిద్ అఫ్రిది ఛానళ్లు కూడా ఆ లిస్టులో ఉన్నాయి. పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఎక్స్ ఖాతాను కూడా బ్లాక్ చేసింది. పాక్ క్రికెటర్స్ బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్, షహీన్ అఫ్రిదీ ఇన్స్టా ఖాతాలు తాజాగా సస్పెండ్ అయ్యాయి. పాకిస్థాన్ జావెలియన్ త్రోయర్, ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అర్షద్ నదీమ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను ఇప్పటికే బ్లాక్ చేసింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత చట్టపరమైన చర్యల్లో భాగంగా భారత్లో ఖాతాను నిలిపివేయబడింది. భారత్లో నదీమ్ సోషల్ మీడియా అకౌంట్ అందుబాటులో లేదని.. చట్టపరమైన అభ్యర్థనను పాటిస్తున్నామని భారత్లో నదీమ్ ఇన్స్టా ఖాతా తెరిచిన వాళ్లకు మెసెజ్ ఇస్తోంది.
