ఝార్ఖండ్ లో దారుణం, ఆసుపత్రిలో స్ట్రెచర్లు లేక బైక్ పైనే కోవిడ్ రోగిని తీసుకెళ్లిన వైనం
దేశంలో సెకండ్ వేవ్ కోవిడ్ సృష్టిస్తున్న బీభత్సం ఇంతా అంతా కాదు. ఆక్సిజన్, వ్యాక్సిన్,మందుల కొరతే కాదు.. ఆసుపత్రుల్లో స్ట్రెచర్ల కొరత కూడా తీవ్రమైంది.
దేశంలో సెకండ్ వేవ్ కోవిడ్ సృష్టిస్తున్న బీభత్సం ఇంతా అంతా కాదు. ఆక్సిజన్, వ్యాక్సిన్,మందుల కొరతే కాదు.. ఆసుపత్రుల్లో స్ట్రెచర్ల కొరత కూడా తీవ్రమైంది. స్ట్రెచర్ లేక ఝార్ఖండ్ లో ఓ కోవిడ్ రోగిని ఒక వార్డు నుంచి స్కూటర్ పై ఇద్దరు వ్యక్తులు తీసుకు వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలమూ లోని మెడినిరాయ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోనిది ఈ దృశ్యం. బలహీనంగా, నడవలేని స్థితిలో ఉన్న ఈ పేషంటును ఇద్దరు వ్యక్తులు మొదట భుజాలపై మోసుకు వెళ్లి వార్డులోనే స్కూటర్ పై కూర్చోబెట్టుకుని తీసుకు వెళ్లారు. అయితే వారు అతనిని వేరే వార్డుకు తరలించారా లేక డాక్టర్లు ఆయనను మరో ఆసుపత్రికి రెఫర్ చేశారా అన్న విషయం తెలియలేదు. ఏది ఏమైనా చివరకు స్ట్రెచర్లు కూడా లేని దౌర్భాగ్య స్థితి ఆసుపత్రుల్లో నెలకొంటోంది. రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో ఆసుపత్రుల యాజమాన్యాలు కూడా దిక్కులేని స్థితిని ఎదుర్కొంటున్నాయి.
నిజానికి ఇది ఝార్ఖండ్ లో పేరు పొందిన పెద్ద ఆసుపత్రి… ఇక్కడే పరిస్థితి ఇలా ఉంటే ఇక చిన్నా, చితకా హాస్పటల్స్ పరిస్థితి చెప్పనక్కర్లేదు. దేశంలోని అనేక హాస్పిటల్స్ ఇలా కునారిల్లుతున్నాయి. దేశంలో కోవిడ్ కేసులు పెరిగిపోతుండగా .. సాయం చేస్తామంటూ పలు దేశాలు ముందుకు రావడం హర్షనీయమని అంటున్నారు. కాగా- సాక్షాత్తూ ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ సైతం కరోనా వైరస్ పాజిటివ్ కి గురి కావడం గమనార్హమని నిపుణులు ఆందోళన చేస్తున్నారు. ఈ విభాగం లోనే వైరస్ తిష్ట వేసింది. సాధారణంగా అత్యంత జాగరూకతతో ఉండే ఈ శాఖ అధికారులు కూడా ఇలా పాజిటివ్ బారిన పడడం ఆశ్చర్యకరమనే వ్యాఖ్యలు వినవస్తున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: Australia: ఇండియా విమానాలపై ఆస్ట్రేలియా నిషేధం.. మే 15 వరకు వారంతా భారత్లోనే..
Karuna Shukla: కరోనాతో.. కాంగ్రెస్ నాయకురాలు, మాజీ ప్రధాని వాజ్పేయి మేనకోడలు శుక్లా కన్నుమూత