పేదల్ని ట్రంప్ చూడకూడదట.. 4 అడుగుల గోడ కట్టేశారు !

ఈ నెల 24-25 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ఇండియాకు రానున్న సందర్భంగా ఆయన మోటార్ కేడ్ (కాన్వాయ్) అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి అతి పెద్ద మోతేరా క్రికెట్ స్టేడియం వరకు సాగనుంది.

పేదల్ని ట్రంప్ చూడకూడదట.. 4 అడుగుల గోడ కట్టేశారు !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 23, 2020 | 12:39 PM

ఈ నెల 24-25 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ఇండియాకు రానున్న సందర్భంగా ఆయన మోటార్ కేడ్ (కాన్వాయ్) అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి అతి పెద్ద మోతేరా క్రికెట్ స్టేడియం వరకు సాగనుంది. లక్షలాది ప్రజలు ఆయనకు, ఆయన వెంట వచ్ఛే అధికారుల బృందానికి స్వాగతం పలుకుతారని అంచనా. అయితే.. ఈ వాహనశ్రేణి సాగే మార్గంలో పేదల మురికివాడలు ఆయనకు కనబడకుండా 4 అడుగుల ఎత్తయిన గోడను కట్టేశారు. నగర మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆగమేఘాల మీద ఈ పని కానిచ్చారు.  క్రికెట్ స్టేడియంలో ట్రంప్, ప్రధాని మోదీ ఇద్దరూ ఒకే వేదికను అలంకరించనున్నారు. ‘ నమస్తే ట్రంప్’పేరిట ఈ నెల 24 న ఈ ఆహ్వాన సంరంభం జరగనుంది. అయితే ఇంత హడావుడిలోనూ ఈ స్టేడియం చుట్టుపక్కల ఆవాసాలు ఏర్పరచుకున్న మురికివాడవాసుల గోడును ఆలకించేవారే లేకపోయారు. తమను తమ ఇళ్ళు, గుడిసెలు ఖాళీ చేయాలని  మున్సిపల్ సిబ్బంది నోటీసులు పంపారని వారు వాపోతున్నారు. ఇన్నేళ్ళుగా ఇక్కడ ఉంటున్న తాము ఇక ఎక్కడికి వెళ్లాలని వారు ప్రశ్నిస్తున్నారు. కాగా-ఈ గోడ నిర్మాణం పత్రికల్లోనూ, సోషల్ మీడియాలోనూ విమర్శలకు, సెటైర్లకు దారి తీస్తోంది. ఈ దేశంలోని పేదరికం అగ్రరాజ్యాధినేతకు కనబడకూడదన్నది ప్రభుత్వ ఉద్దేశమా అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగు అడుగుల గోడ నిర్మించినంత మాత్రాన ఇక్కడి పేదరికం నశించిపోతుందా అని కొందరు ట్విటర్ యూజర్లు ఫైరవుతున్నారు.

కానీ…  మున్సిపల్ అధికారులు మాత్రం ఈ గోడను నిర్మించాలని తాము రెండు నెలల క్రితమే నిర్ణయించామని తెలిపారు.

ట్రంప్ విజిట్ ప్రతిపాదనకు ముందే తామీ నిర్ణయం తీసుకున్నామని వారు పేర్కొన్నారు. ఫుట్ పాత్ పైన, రోడ్లపైన ఆక్రమణలను నివారించడానికి దీని నిర్మాణం చేపట్టినట్టు మున్సిపల్ కమిషనర్ విజయ్ నెహ్రా ట్విటర్ ద్వారా వెల్లడించారు. ట్రంప్-మోదీ ఇద్దరూ కలిసి వచ్ఛే 22 కి. మీ. దూరం పొడవునా నిలబడి వారికి స్వాగతం చెప్పడానికి ఇప్పటికే లక్షమందికి పైగా ప్రజలు తమ పేర్లను నమోదు చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఏమైనా.. ఇది అతి పెద్ద రోడ్ షో అవుతుందన్నారు.