NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ కేసు.. రూ. 5 లక్షల లంచంతో కెమిస్ట్రీ ప్రశ్నల కొనుగోలు.. సీబీఐ విచారణలో షాకింగ్ నిజాలు!
NEET Paper Leak: మే 3న దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిందన్న ఆరోపణలతో దేశవ్యాప్తంగా విద్యార్థులు, విద్యావేత్తలు, రాజకీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీనితో మే 12న ఆ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది..

NEET Paper Leak: దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నీట్ (NEET UG) ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ విచారణలో భాగంగా మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన ఓ కోచింగ్ సెంటర్ యజమాని శివరాజ్ రఘునాథ్ మోటేగాంకర్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పరీక్షకు ముందే కెమిస్ట్రీ ప్రశ్నాపత్రాన్ని సంపాదించడానికి మోటేగాంకర్ ఏకంగా రూ. 5 లక్షల లంచం చెల్లించినట్లు సీబీఐ గుర్తించింది.
బెయిల్ పిటిషన్ విచారణలో బయటపడ్డ నిజాలు:
మోటేగాంకర్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్కు సమాధానంగా సీబీఐ ప్రత్యేక కోర్టుకు సమర్పించిన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. ఇతర నిందితులతో కలిసి పక్కా ప్రణాళిక ప్రకారమే మోటేగాంకర్ ఈ నీట్ కెమిస్ట్రీ ప్రశ్నలను దొంగతనంగా సేకరించాడని దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రశ్నాపత్రాలను రూపొందించే ప్యానెల్లో సభ్యుడిగా ఉన్న పి.వి. కులకర్ణి అనే వ్యక్తి నుంచి మోటేగాంకర్ ఈ ప్రశ్నలను పొందినట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది. మోటేగాంకర్ కుమారుడు కులకర్ణి నడుపుతున్న కెమిస్ట్రీ కోచింగ్ క్లాసులకు వెళ్లేవాడు. ఆ క్లాసుల్లోనే ఈ ప్రశ్నలను నిందితులు చేరవేసినట్లు సమాచారం.
ఫోన్ డేటాతో దొరికిపోయిన నిందితుడు:
కులకర్ణి అందించిన ప్రశ్నలను ఉపయోగించి మోటేగాంకర్ స్వయంగా తన చేతివ్రాతతో నోట్స్ సిద్ధం చేసుకున్నాడు. దర్యాప్తు అధికారులు మోటేగాంకర్ మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకోగా, అందులో కెమిస్ట్రీకి సంబంధించిన 132 ప్రశ్నలు గల 36 ఫోటోలు లభ్యమయ్యాయి. వీటిలో 5 డూప్లికేట్ ఫోటోలు ఉన్నాయి. సీబీఐ అధికారులు ఈ ప్రశ్నలను ఎన్టీఏ సిద్ధం చేసిన నీట్ ఒరిజినల్ మాస్టర్ క్వశ్చన్ సెట్తో పోల్చి చూడగా, అందులోని 111 ప్రశ్నలు వీటికి సరిగ్గా సరిపోలడం గమనార్హం.
మొబైల్ ఫోన్ మెటాడేటా విశ్లేషణ ప్రకారం.. మే 3వ తేదీన జరిగిన నీట్ పరీక్షకు దాదాపు 10 రోజుల ముందే ఈ ఫోటోలను ఫోన్లో తీసినట్లు స్పష్టమైంది. ఈ లీక్ కోసం చెల్లించిన రూ. 5 లక్షల లంచం డబ్బును మరో సహ నిందితుడు మనోజ్ భగవాన్రావ్ శిరూరే ఇచ్చిన సమాచారం మేరకు సీబీఐ స్వాధీనం చేసుకుంది.
అసలేం జరిగిందంటే?
మే 3న దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిందన్న ఆరోపణలతో దేశవ్యాప్తంగా విద్యార్థులు, విద్యావేత్తలు, రాజకీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీనితో మే 12న ఆ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. ఆ తర్వాత జూన్ 21న నీట్ పరీక్షను తిరిగి నిర్వహించారు. ప్రస్తుతం ఈ కేసులో సీబీఐ ఇప్పటివరకు 13 మందిని అరెస్ట్ చేయగా, వారంతా ప్రస్తుతం న్యాయస్థానం పర్యవేక్షణలో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




