మానవత్వం సిగ్గుపడే ఘటన.. పశువుల పాకలో నాలుగేళ్ల బాలికపై 65 ఏళ్ల వృద్ధుడి పైశాచికత్వం..!
మహారాష్ట్రలో వెలుగు చూసిన అత్యంత అమానుష ఘటన యావత్ రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక 65 ఏళ్ల వృద్ధుడు నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి, ఆపై రాళ్లతో కొట్టి చంపిన తీరు స్థానికుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిల్చింది. ఈ దారుణ ఘటన పూణే జిల్లా, భోర్ తాలూకాలోని నస్రాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

మహారాష్ట్రలో వెలుగు చూసిన అత్యంత అమానుష ఘటన యావత్ రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక 65 ఏళ్ల వృద్ధుడు నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి, ఆపై రాళ్లతో కొట్టి చంపిన తీరు స్థానికుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిల్చింది. ఈ దారుణ ఘటన పూణే జిల్లా, భోర్ తాలూకాలోని నస్రాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
వేసవి సెలవులను గడపడానికి ఆ చిన్నారి తన అమ్మమ్మ ఇంటికి వచ్చింది. శనివారం (మే 02) పగటిపూట ఇంటి బయట ఆడుకుంటున్న ఆ అమాయక బాలికను, నిందితుడు మాయమాటలతో పక్కనే ఉన్న ఒక పశువుల పాకలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి, ఆపై ఎవరికీ తెలియకుండా ఉండేందుకు తలపై బండరాయితో మోది అత్యంత దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ఆవు పేడ కుప్పలో దాచిపెట్టాడు.
మధ్యాహ్నమైనా పాప ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. చివరికి పశువుల పాకలో చిన్నారి విగతజీవిగా పడి ఉండటం చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, నిందితుడు బాలికను వెంట తీసుకెళ్తున్న దృశ్యాలు బయటపడ్డాయి. దీని ఆధారంగా 65 ఏళ్ల నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ వార్త తెలియగానే నస్రాపూర్ గ్రామం అట్టుడికిపోయింది. ఆగ్రహించిన గ్రామస్తులు చిన్నారి మృతదేహంతో పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. రహదారిని దిగ్బంధించి నిందితుడికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసును మొదట నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తూ నిరసనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
ఈ హేయమైన చర్యకు నిరసనగా స్థానిక వ్యాపారులు, గ్రామస్థులు నస్రాపూర్ బంద్ కు పిలుపునిచ్చారు. వ్యాపార సంస్థలు, దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు. భైరవనాథ్ ఆలయం నుండి భారీ నిరసన ప్రదర్శన నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు గ్రామంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. నిందితుడిపై కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, త్వరలోనే న్యాయస్థానం ద్వారా కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు వెల్లడించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
