పాముల భయం తెచ్చిన తంటా.. దెబ్బకు టాక్సీ నుంచి దూకేసిన వ్యాపారవేత్త.. ఆ తర్వాత..!
ముంబైలో ప్రముఖ వ్యాపారవేత్త బాంద్రా-వర్లి సీ లింక్ నుండి సముద్రంలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు అర్ధరాత్రి టాక్సీలో ప్రయాణిస్తున్నప్పుడు వింతగా ప్రవర్తించాడు. అంతేకాదు డ్రైవర్ వాహనాన్ని ఆపమని కోరాడు. టాక్సీ ఆగిన వెంటనే, అతను సముంద్రంలోకి దూకి మరణించాడు. ఆత్మహత్య వెనుక గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగిన ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వ్యాపారవేత్త సముద్రంలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మంగళవారం (సెప్టెంబర్ 16) అర్ధరాత్రి జరిగింది. ఆ వ్యాపారవేత్తను 47 ఏళ్ల అమిత్ శాంతిలాల్ చోప్రాగా పోలీసులు గుర్తించారు. రాజస్థాన్కు చెందిన అమిత్ శాంతిలాల్ ముంబైలో వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు. అయితే వృత్తిపరమైన కారణాల వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అయితే అమిత్ ఆత్మహత్య చేసుకున్న తీరు షాక్కు గురి చేస్తోంది. మంగళవారం (సెప్టెంబర్ 16) అర్ధరాత్రి అమిత్ శాంతిలాల్ చోప్రా టాక్సీలో ప్రయాణిస్తున్నాడు. అతని టాక్సీ బాంద్రా-వర్లి సీ లింక్ వద్దకు చేరుకోగానే, అతను వింతగా ప్రవర్తించడం ప్రారంభించాడు. కారులో తన చుట్టూ పాములు బుసలు కొడుతూ, తనను కాటేస్తున్నాయని గట్టిగా అరిచాడు. కారు ఆపాలంటూ.. కాపాడాలంటూ కేకలు వేశాడు. దీంతో టాక్సీ డ్రైవర్ భయపడి సముద్రం ఒడ్డుకు చేరుకున్నాడు. ఆ తర్వాత చోప్రా టాక్సీ డోర్ తెరిచి సీ లింక్ నుండి సముద్రంలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది చూసిన టాక్సీ డ్రైవర్ షాక్ అయ్యాడు. వెంటనే సీ లింక్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించాడు.
ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి దగ్గర ఎలాంటి సూసైడ్ నోట్ కనిపించలేదని పోలీసు అధికారులు తెలిపారు. ఈ సంఘటన గురించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హఠాత్ పరిణామంతో కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. దర్యాప్తు తర్వాతే మరణానికి ఖచ్చితమైన కారణం తెలుస్తుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మృతుడు అమిత్ శాంతిలాల్ చోప్రా ఇమిటేషన్ జ్యువెలరీ వ్యాపారం చేసే వ్యాపారవేత్త. అతను తన భార్య, పిల్లలతో కలిసి ముంబైలోని అంధేరి వెస్ట్లో నివసిస్తున్నాడు. అతను ముంబైలో జ్యువెలరీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి ఒంటి గంటకు చోప్రా టాక్సీలో ప్రయాణించాడు. టాక్సీ బాంద్రా మీదుగా వెళ్లి సీ లింక్కు చేరుకుంది. ఈ సమయంలో, అతను వింతగా ప్రవర్తించాడని పోలీసులు తెలిపారు. చోప్రా ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతని బంధువులు, కుటుంబసభ్యులను విచారిస్తున్నారు. చోప్రా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా? అతనికి మరేదైనా సమస్యలు ఉన్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానమివ్వడం ద్వారా ఆత్మహత్య వెనుక గల కారణాలను పోలీసులు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




