Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister Protest: రహదారిపై భారీ గుంతలు.. అసహనం వ్యక్తం చేసిన మంత్రి.. వినూత్న రీతిలో నిరసన..

సమస్యలను పరిష్కరించాలంటూ ప్రజా ప్రతినిధుల ముందు ప్రజలు నిరసన వ్యక్తం చేయడం కామన్. అలా కాకుండా రివర్స్‌గా ఆ ప్రజాప్రతినిధే నిరసన వ్యక్తం చేస్తే..

Minister Protest: రహదారిపై భారీ గుంతలు.. అసహనం వ్యక్తం చేసిన మంత్రి.. వినూత్న రీతిలో నిరసన..
Minister Pradhuman Singh Tomar
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 22, 2022 | 8:10 PM

సమస్యలను పరిష్కరించాలంటూ ప్రజా ప్రతినిధుల ముందు ప్రజలు నిరసన వ్యక్తం చేయడం కామన్. అలా కాకుండా రివర్స్‌గా ఆ ప్రజాప్రతినిధే నిరసన వ్యక్తం చేస్తే.. ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆయనే.. సమస్యను పరిష్కరించమని కోరుతూ ప్రొటెస్ట్ చేస్తే.. చూడటానికి, వినటడానికి కాస్త విచిత్రంగా ఉన్నప్పటికీ.. రోడ్డుపై గుంతలు పూడ్చాలంటూ ఆ రాష్ట్ర మంత్రి నిరసన వ్యక్తం చేశారు. అట్లాంటిట్లాంటి నిరసన కూడా కాదండో.. చాలా కొత్తగా నిరసన వ్యక్తం చేశారు. రోడ్లు బాగుపడే వరకు కాళ్లకు చెప్పులు వేసుకునే ప్రసక్తే శపథం చేశారు. అప్పటి వరకు ఉన్న చెప్పులను రోడ్డు మీదే వదిలేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో చోటు చేసుకుంది.

ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవలి కాలంలో కురుస్తున్న భారీ వర్షాలకు గ్వాలియర్‌లో రోడ్లన్నీ పాడైపోయాయి. అయితే, పాడైపోయిన రోడ్లకు మరమ్మతులు చేయాల్సిన మున్సిపల్ శాఖ అధికారులు దానిని పట్టించుకోవడం లేదు. దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయంపై స్థానిక మంత్రి ప్రద్యుమ్న సింగ్‌కు ఫిర్యాదు చేశారు అక్కడి ప్రజలు. ఫిర్యాదులు భారీగా రావడంతో షాక్ అయిన మంత్రి.. గ్వాలియర్‌లో రోడ్లను స్వయంగా పరిశీలించారు. రోడ్డంతా పాడైపోయి ప్రజలు అవస్థలు పడుతుండటాన్ని గమనించిన మంత్రి.. మరమ్మతులు చేయాలని ఆదేశించారు. అయినప్పటికీ అధికారులు ఉదాసీనతగా వ్యవహరించారు. దాంతో ఆగ్రహానికి గురైన మంత్రి ప్రద్యుమ్నసింగ్ తోమర్.. కఠిన నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ అధికారుల తీరును నిరసిస్తూ గ్వాలియర్ రోడ్లు బాగుపడే వరకు తన కాళ్లకు చెప్పులు వేసుకోనని స్పష్టం చేశారు. తన కాళ్లకు ఉన్న చెప్పులను రోడ్డుపైనే వదిలేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. గ్వాలియర్‌ రోడ్లపై ప్రజల నుంచి తనకు చాలా ఫిర్యాదులు వచ్చినట్టు తెలిపారు మంత్రి ప్రద్యుమ్నసింగ్‌. అధికారులు తన విజ్ఞప్తిని , హెచ్చరికలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఆ రోడ్లపై చెప్పులు లేకుండా తిరగాలని నిర్ణయించుకునట్టు వెల్లడించారు. తన నిరసనతో అధికారుల్లో తప్పకుండా మార్పు వస్తుందన్నారు.

ఇవి కూడా చదవండి

గతంలోనూ మంత్రి ప్రద్యుమ్న సింగ్ తోమర్ ఓ వృద్ధురాలి కాళ్లు పట్టుకుని క్షమాపణలు కోరారు. గ్వాలియర్‌లోని ఓ రోడ్డుపై రద్దీకి కారణం అవుతుందంటూ అక్కడ కూరగాయల మార్కెటును వేరే ప్రాంతానికి తరలించారు అధికారులు. అదే సమయంలో మార్కెట్‌కు వచ్చిన మంత్రిని చూసిన కూరగాయలు అమ్ముకునే ఓ వృద్ధురాలు ఆయన వద్దకు చేరుకుంది. మార్కెట్‌ను తరలిస్తే తన ఉపాధి పోతుందని ఆవేదన వ్యక్తం చేసింది. కూరగాయలు అమ్ముకుని పూట గడిపే తనకు.. ఈ నిర్ణయం వల్ల ఉపాధి పోతుందంటూ కన్నీటి పర్యంతమైంది. వెంటనే స్పందించిన మంత్రి ప్రద్యుమ్నసింగ్.. ఆమెకు పరిస్థితిని వివరించారు. అసౌకర్యానికి క్షమించమని కోరుతూ ఆమె కాళ్లు పట్టుకుని ప్రాధేయపడ్డారు. వృద్ధురాలి చేతులు పట్టుకుని చెంపలపై కొట్టించుకున్నారు. ఈ ఘటన నాడు సంచలనం సృష్టించింది. ఇప్పుడు చెప్పులు వేసుకోననే నిర్ణయంతో మరోసారి వార్తల్లో నిలిచారు మంత్రి ప్రద్యుమ్నసింగ్.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..