Jayalalithaa Audio: పిలిస్తే వచ్చి చూడరా..? మరణానికి ముందు డాక్టర్లపై జయలలిత ఆగ్రహం.. సంచలనంగా మారిన ఆడియో..
జయలలిత మరణానికి ముందు మాట్లాడిన ఆడియో ఒకటి కలకలం రేపుతోంది. ఆర్ముగం కమిషన్ విచారణ నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన జయలలిత ఆడియో.. ప్రస్తుతం వైరల్ గా మారింది.

తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత మరణ రహస్యంపై ఆర్ముగస్వామి కమిటీ రిపోర్డు సంచలనంగా మారింది. నివేదికలోని సంచలన విషయాలను డీఎంకే ప్రభుత్వం అసెంబ్లీలో వెల్లడించింది. దీంతో తమిళనాడు జయలలిత మృతి.. ఆమె అనారోగ్యంగా ఉన్న సమయంలో శశికళ సహా పలువురు వ్యవహరించిన తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో జయలలిత మరణానికి ముందు మాట్లాడిన ఆడియో ఒకటి కలకలం రేపుతోంది. ఆర్ముగం కమిషన్ విచారణ నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన జయలలిత ఆడియో.. ప్రస్తుతం వైరల్ గా మారింది. 2015లో చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో బెడ్ పై ఉన్నప్పుడు జయలలిత మాట్లాడారు. నేను పిలిచినపుడు మీరెందుకు రాలేదంటూ డాక్టర్లపై జయలలిత మండిపడుతున్నట్లు స్పష్టమవుతోంది. చికిత్స సమయంలో తీవ్రంగా దగ్గుతూ.. జయలలిత డాక్టర్లపై అసహనం వ్యక్తం చేశారు. ‘‘నేను ఇంతలా బాధపడుతుంటే మీరు పట్టించుకోవడం లేదు’’ అంటూ డాక్టర్లను ప్రశ్నించిన జయలలిత.. వారిపై అసహనం వ్యక్తంచేశారు. ఈ సమయంలో ఆసుపత్రి స్టాఫ్ ఆడియోను రికార్ట్ చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా, చెన్నైలో తన ప్రెస్ మీట్ తర్వాత డాక్టర్ రిచర్డ్ బీల్ 2017 వీడియో కూడా వైరల్గా మారింది. దీనిలో రిచర్డ్ బీల్ మాట్లాడారు. జయలలిత విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉందా అని శశికళ ప్రశ్నించగా.. ఆమె తప్పక వెళ్లాలని డాక్టర్ చెప్పడంతో వారు అంగీకరించారు. కానీ, ఆ తర్వాత జయలలిత చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు ఇష్టపడలేదని అప్పట్లో వార్తలొచ్చాయి.
అయితే.. ఆర్ముగం కమిషన్ రిపోర్ట్ సమర్పించిన నేపథ్యంలో జయలలితకు మరణానికి సంబంధించిన వీడియోలు, ఆడియోలు ఒక్కొక్కటిగా వైరల్ అవుతున్నాయి. దీంతో తమిళనాడులో రాజకీయాలు వేడెక్కాయి. ఆర్ముగస్వామీ కమీషన్.. జయలలిత సన్నిహితురాలు శశికళ, ఆమె బంధువు, వైద్యుడు అశివ కుమార్, ఆరోగ్య శాఖ మాజీ మంత్రి సి విజయభాస్కర్, ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి రాధాకృష్ణన్లను తప్పుపట్టింది. జయలలిత మరణించిన సమయం గంట ఆలస్యం కావడం, యాంజియోగ్రఫీ నిర్వహించకపోవడం, శశికళ చికిత్సలో జోక్యం చేసుకోవడం వంటి అంశాలపై ఆరుముఘస్వామి కమిషన్ ప్రశ్నలు లేవనెత్తింది.




జయలలిత చికిత్స సమయంలో మాట్లాడిన ఆడియో వినండి..
#Jayalalithaa‘s audio clip goes viral #JayalalithaaDeath pic.twitter.com/beG7zS3xCj
— Janardhan Veluru (@JanaVeluru) October 20, 2022
కాగా.. తమిళనాడు దివంగత సీఎం జయలలితకు చేయించిన వైద్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శశికళపై ఆరోపణ నేపథ్యంలో ఆమె స్పందించారు. జయ వైద్యంపై తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని చెప్పారు శశికళ. జయలలితకు అందించిన వైద్యం, ఆమె మృతిపై విచారణకు తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆర్ముగస్వామి కమిషన్ ఇచ్చిన నివేదికపై శశికళ తీవ్రంగా స్పందించారు. జయలలిత వైద్యం విషయంలో తానెప్పుడూ జోక్యం చేసుకోలేదని చెప్పారు. అక్కకు ఎలాంటి మందులు, చికిత్స అందించాలో వైద్యబృందమే నిర్ణయించిందని.. తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ ఖండిస్తున్నానని శశికళ పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..