AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుల గణన ఒక చారిత్రాత్మక నిర్ణయం! ప్రధాని మోదీకి కిషన్‌ రెడ్డి కృతజ్ఞతలు

కేంద్ర క్యాబినెట్ కుల గణనకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. బీసీలకు కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని, కుల గణనను వ్యతిరేకించిన చరిత్రను ప్రస్తావించారు. మోదీ ప్రభుత్వం బీసీల అభివృద్ధికి చేస్తున్న కృషిని ఎత్తిచూపారు.

కుల గణన ఒక చారిత్రాత్మక నిర్ణయం! ప్రధాని మోదీకి కిషన్‌ రెడ్డి కృతజ్ఞతలు
Kishan Reddy Pm Modi
SN Pasha
|

Updated on: May 01, 2025 | 6:20 PM

Share

జనాభా లెక్కలతో పాటు దేశవ్యాప్తంగా కుల గణన చేస్తామని ఇటీవలె కేంద్ర క్యాబినేట్‌ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి స్పందిస్తూ.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. రిజర్వేషన్ విధానాలను మార్చడం, ముస్లిం జనాభాను బీసీ వర్గంలోకి చేర్చడం ద్వారా కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మకంగా వెనుకబడిన తరగతుల(బీసీ) ప్రయోజనాలను దెబ్బతీసిందని ఆరోపించారు. కేవలం ఎస్సీ, ఎస్టీ నేపథ్యాల కారణంగానే రామ్ నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ములను రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్లు వేయడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని, దీర్ఘకాలంగా ఉన్న మాదిగ రిజర్వేషన్ సమస్యను పరిష్కరించే దిశగా మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తోందని, కుల గణనతో ఎస్సీలలో ఉప-వర్గీకరణకు మార్గం సుగమం అవుతుంది అన్నారు.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుల గణనపై ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు, కానీ చర్య తీసుకోవడంలో విఫలమయ్యారు. బిజెపి తరపున సుష్మా స్వరాజ్ అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీకి కుల గణనకు మద్దతుగా ఒక లేఖ రాశారు. అయినప్పటికీ 2011 జనాభా లెక్కల్లో అప్పటి హోంమంత్రి పి. చిదంబరం వ్యతిరేకత కారణంగా కుల గణనను మినహాయించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల గణన బీసీ వ్యతిరేకమని పేర్కొన్నారు. ముఖ్యంగా బీసీల్లో ముస్లింలను చేర్చడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందని వెల్లడించారు. కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ ఎప్పుడూ బీసీ సమస్యలపై నిజాయితీగా పని చేయలేదు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి రాజకీయ లాభం కోసం కాంగ్రెస్ మతపరమైన, కుల ఆధారిత విభజనలను సృష్టిస్తోందని ఆరోపించారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, బీసీల పట్ల కాంగ్రెస్ వైఖరి అస్థిరంగా, అవకాశవాదంగా ఉందని నొక్కి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి మోదీని కులం ఆధారంగా తక్కువ చేసి మాట్లాడిందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వ హయాంలో వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్‌కు మంజూరు, అగ్రవర్ణాలలో ఆర్థికంగా బలహీన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్, ముస్లిం మహిళలకు న్యాయం, సాధికారతను నిర్ధారించే ట్రిపుల్ తలాక్ రద్దు గురించి కిషన్ రెడ్డి ప్రస్తావించారు.

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎల్లప్పుడూ “సబ్కా సాత్, సబ్కా వికాస్” అనే సమ్మిళిత నినాదంతో పనిచేస్తుందని తెలిపారు. చారిత్రక సందర్భాన్ని ప్రస్తావిస్తూ 1881 నుండి 1931 వరకు కుల గణన ప్రక్రియలో భాగంగా ఉందని, కానీ స్వాతంత్ర్యం తర్వాత, కాంగ్రెస్ నాయకత్వంలో, 1951 నుండి కుల డేటా సేకరణ నిలిపివేయబడిందని వివరించారు. జవహర్‌లాల్ నెహ్రూ, మౌలానా ఆజాద్ వంటి ప్రముఖ కాంగ్రెస్ నాయకులు కుల ఆధారిత గణనను బహిరంగంగా వ్యతిరేకించారు. మైనారిటీ జనాభా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడినందున వారిని కూడా ఉద్ధరించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ రాజీవ్ గాంధీ 1990లో పార్లమెంటులో మండల్ కమిషన్ సిఫార్సులను తిరస్కరించారని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి