ఇంటిముందు ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి అఘాయిత్యం.. నిందితుడు ఎన్కౌంటర్..
నిర్భయ లాంటి కఠినచట్టాలున్నప్పటకీ కామాంధులు రెచ్చిపోతున్నారు. చిన్నారులు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతూ పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు.. తాజాగా.. కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది.. ఐదేళ్ల చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటుండగా ఎత్తుకెళ్లాడు. అత్యాచారం చేసి చంపేశాడు ఓ కామాంధుడు. కర్నాటక హుబ్లీలో జరిగిన ఈ దారుణంలో నిందితుడ్ని ఎన్కౌంటర్ చేశారు పోలీసులు.. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని హుబ్లిలో చోటుచేసుకుంది..

కర్ణాటకలోని హుబ్లిలో ఐదేళ్ల చిన్నారి కిడ్నాప్, రేప్ అండ్ మర్డర్ కేసులో నిందితుడు పోలీసుల కాల్పుల్లో చనిపోయాడు. బిహార్లోని పాట్నాకు చెందిన నితేశ్ కుమార్ హుబ్లీలో ఓ ఇంటి ముందు ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లాడు. చిన్నారి మిస్సైందని తల్లిదండ్రులు వెతుకుతుండగా.. అశోక్నగర్ సమీపంలోని ఓ పాడుబడ్డ భవనంలో కనిపించింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చిన్నారి చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు అశోక్ నగర్ పోలీస్స్టేషన్ ముందు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. బాధిత కుటుంబానికి 10లక్షల రూపాయల సాయం అందిస్తామని.. కర్నాటక స్లమ్ డెవలప్మెంట్ చైర్మన్ ప్రసాద్ అబ్బయ్య ప్రకటించారు.
సీసీటీవీ ఫుటేజీ సాయంతో పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేసేందుకు నిందితుడ్ని తరలిస్తుండగా.. పారిపోయేందుకు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు.. ఓ పోలీసు వాహనాన్ని ధ్వంసం చేయడంతో ఒకరికి గాయాలయ్యాయన్నారు. ముందస్తు హెచ్చరికల్లో భాగంగా.. గాల్లోకి కాల్పులు జరిపినా నిందితుడు లొంగిపోలేదన్నారు హుబ్లీ పోలీస్ చీఫ్ శశికుమార్.
తప్పించుకునేందుకు యత్నించడం, తమపై దాడి చేయడంతో ఆత్మరక్షణలో భాగంగా.. అతడిపై రెండు రౌండ్ల కాల్పులు జరిపామన్నారు పోలీసులు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారని చెప్పారు. బాలిక అత్యాచారం, హత్యతో పాటు.. ఎన్కౌంటర్పై కూడా విచారణ జరుగుతుందని పోలీస్ ఉన్నతాధికారులు ప్రకటించారు..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..