AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baba Vanga: జూలై 5న పెను ప్రమాదం.. అక్కడికి వెళ్లాలంటేనే టూరిస్టుల గుండెల్లో వణుకు..

వచ్చే నెల జూలై 5న జపాన్‌కు పెను విపత్తు పొంచి ఉందని ప్రఖ్యాత మాంగా కళాకారిణి రియో టాట్సుకి చేసిన జోస్యం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. "కొత్త బాబా వంగా"గా గుర్తింపు పొందిన ఈమె అంచనాలతో జపాన్‌కు వెళ్లాలనుకున్న వేలాది మంది పర్యాటకులు తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. ఒకవైపు పర్యాటకులు భయంతో వణికిపోతుంటే, మరోవైపు జపాన్ పర్యాటక రంగం భారీ నష్టాలను చవిచూస్తోంది. అసలు టాట్సుకి చేసిన ఆ భయానక అంచనా ఏంటి? పర్యాటకులు ఎందుకు ప్రయాణాలు రద్దు చేసుకుంటున్నారు? అన్న వివరాలు ఇప్పుడు చూద్దాం.

Baba Vanga: జూలై 5న పెను ప్రమాదం.. అక్కడికి వెళ్లాలంటేనే టూరిస్టుల గుండెల్లో వణుకు..
New Baba Vanga Prediction On Japan
Bhavani
|

Updated on: Jun 24, 2025 | 6:04 PM

Share

జపాన్‌కు జూలై 5, 2025న పెను ప్రమాదం ముంచుకొస్తుందని ప్రఖ్యాత మాంగా కళాకారిణి రియో టాట్సుకి జోస్యం పలికారు. “న్యూ బాబా వంగా”గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన టాట్సుకి అంచనాలతో జపాన్‌ పర్యాటక రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఆమె భయానక అంచనాలు, పర్యాటకుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ఇంతకీ ఆ జోస్యంలో ఏముందో తెలుసుకుందాం..

భయానక జూలై 5 అంచనా

రియో టాట్సుకి తన పుస్తకం “ది ఫ్యూచర్ ఐ సా”లో జూలై 5, 2025న జపాన్‌ నగరాలు సముద్రంలో మునిగిపోతాయని పేర్కొన్నారు. నీటి అడుగున సంభవించే పేలుడు, అగ్నిపర్వత విస్ఫోటనం దీనికి కారణం కావచ్చు. సముద్రం “మరుగుతున్నట్లు”, “భారీ బుడగలు” వస్తున్నట్లు ఆమె చూశారు. ఇది 2011 తోహోకు భూకంపం సృష్టించిన సునామీ కన్నా భారీదని, జపాన్‌ దక్షిణ తీరం, పరిసర ప్రాంతాలపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. జపాన్, ఫిలిప్పీన్స్‌ మధ్య లోతైన సముద్ర పగులు పెను సునామీకి దారి తీస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఈ అంచనాలతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

జపాన్‌ పర్యాటక రంగానికి తీవ్ర నష్టం

టాట్సుకి అంచనాలతో జపాన్‌కు వచ్చే విమాన బుకింగ్‌లు భారీగా రద్దయ్యాయి. జూన్‌ చివరి, జూలై తొలి వారాల్లో హాంకాంగ్ నుంచి జపాన్‌కు వెళ్లాల్సిన విమాన రిజర్వేషన్లు 83 శాతం పడిపోయాయి. పర్యాటకులు తమ జపాన్ పర్యటనలను రద్దు చేసుకుంటున్నారు. ఈ విపత్తు సంభవించకపోయినా, పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం ఇప్పటికే స్పష్టమైంది. జూలై నెల కోసం ఆశగా ఎదురుచూస్తున్న జపాన్ పర్యాటక పరిశ్రమ, పరిస్థితి ఊహించినంత దారుణంగా ఉండరాదని కోరుతోంది.

జపాన్ ప్రభుత్వ స్పందన

ప్రజలను ప్రశాంతంగా ఉంచేందుకు జపాన్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. మియాగి గవర్నర్ యోషిహిరో మురాయ్ ప్రజలు భయాందోళన చెందవద్దని, సంయమనం పాటించాలని కోరారు. పౌరులు దేశం విడిచి వెళ్లడం లేదని నొక్కి చెప్పారు. పర్యాటకులు జపాన్‌ను సందర్శించడం కొనసాగించాలని, ప్రణాళికలు వాయిదా వేయాల్సిన అవసరం లేదని ఆయన విజ్ఞప్తి చేశారు.

రియో టాట్సుకి గత అంచనాలు

గతంలో రియో టాట్సుకి చేసిన కొన్ని అంచనాలు నిజమయ్యాయి. వీటిలో 2011 తోహోకు భూకంపం, ప్రిన్సెస్ డయానా, ఫ్రెడ్డీ మెర్క్యూరీ మరణాలు, కోవిడ్-19 మహమ్మారి ఉన్నాయి. 2030లో మరింత తీవ్రమైన వైరస్ వస్తుందని కూడా ఆమె హెచ్చరించారు. ఈ నేపథ్యమే ప్రస్తుత అంచనాలకు బలం చేకూర్చుతోంది.